కూటమి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ హత్యలను ఖండించండి.
శాంతి చర్చల ఉదయ్ (గాజర్ల రవి), కామ్రేడ్ అరుణ, కామ్రేడ్ అంజులకు జోహార్లు.
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి రాజకీయ హత్యలు మొదలయ్యాయి. మావోయిస్టులను పట్టుకుని ఎన్కౌంటర్ పేరిట హత్యలు చేయడం ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన. సామ్రాజ్యవాద అనుకూల వైఖరితో ప్రజా పోరాటాలను రక్తపుటేరుల్లో ముంచెత్తిన వ్యక్తి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీంతో ఆపరేషన్ కగార్కు ఆంధ్రా మరో చురుకైన ప్రయోగశాలగా మారినట్టు గత నెలలో జరిగిన కామ్రేడ్ పండన్న హత్య గానీ, ఇప్పుడు ముగ్గురు మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటరు గానీ స్పష్టం చేస్తున్నాయి. శాంతి చర్చల రామకృష్ణ చంద్రబాబు హయాంలో జరిగిన రామగఢ్ హత్యకాండలో తీవ్రంగా గాయపడి, ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయారు. ఇప్పుడు చర్చల ఉదయ్ను ఏపీ గ్రేహోండ్స్ హతమార్చింది. కాల్పుల విరమరణ జరిపి, శాంతి చర్చలు జరపాలని కూటమియేతర రాజకీయ పార్టీలన్నీ కోరుకుంటున్నాయి. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద అన్ని స్రవంతుల వామపక్ష పార్టీలు, సంస్థలు, సంఘాలు మంగళవారం (జూన్ 17) ఇదే డిమాండ్ను మరింత గట్టిగా వినిపించాయి. ఆ తర్వాత 24 గంటల్లోనే చర్చల ఉదయ్ను ఏపీ పోలీసులు కాల్చి చంపడం గర్హనీయం. 15 రోజుల క్రితం హత్యచేసిన చర్చల సుధాకర్ సంస్మరణ సభను సత్యవోలులో మరో 12 గంటల్లో ఆ గ్రామం, విప్లవ అభిమానులు, సంఘాలు జరుపుకోనున్నాయి. ఈ సమయంలో విశాఖ ఏజెన్సీలో ముగ్గురు మావోయిస్టులను హత్య చేయడం అత్యంత దిగ్ర్భాంతికరం. శాంతిని, చర్చలను కోరుతున్న ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ రాజకీయ హత్యలను తీవ్ర స్వరంతో ఖండించాలని విప్లవ రచయితల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.
-రివేరా, కార్యదర్శి, విరసం