భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ
పత్రిక ప్రకటన
తేదీ: 15-06-2025.
బీజేపీ హిందుత్వ ఫాసిస్టు కగార్ దాడిని ఖండిస్తూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో జూన్ 20న బంద్ ను జయప్రదం చేయండి!
45 ఏళ్ళ సుదీర్ఘ విప్లవోద్యమ అనుభవం కలిగిన సీనియర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియస్ ఆనంద్, సుధాకర్, గౌతం, 30 ఏళ్ళ విప్లవోద్యమ అనుభవం కలిగిన కామ్రేడ్ మైలారపు అడెల్ అలియస్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ఏడుగురిని క్రూరంగ హత్య చేసిన ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించండి!
ప్రియమైన ప్రజలారా!
కేంద్రంలోని బీజేపీ హిందుత్వ ఫాసిస్టు ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని 2024 జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలోను మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలన్నిటిలో తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తూ నరసంహారాలను కావిస్తున్నది. అటవీ సంపదను, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఏకైక లక్ష్యంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసులపై వారికి అండగా ఉండే మావోయిస్టు పార్టీపై వరుసగా దాడులు చేస్తూ 550 మందికి పైగా హత్యలు చేసింది. మే 21 న మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ నంబాల కేశవరావు@బసవరాజ్ తో పాటు 27 మంది కామ్రేడ్స్ ను పొట్టనపెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ 3వ తేదీ నుండి నేషనల్ పార్క్ లో మరొక చుట్టువేత దాడిని నిర్వహించి ఏడుగురు కామ్రేడ్స్ ను హత్య చేసింది.
జూన్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు వారం రోజుల పాటు నేషనల్ పార్క్ ఏరియా అంతటా ఏరియా డామినేషన్ చేస్తూ వేల సంఖ్యలో బలగాలు చుట్టుముట్టి పెద్దఎత్తున జల్లెడపట్టాయి. అన్నపూర్ గుట్టలను జూన్ 4న బలగాలు మోహరించి చుట్టుముట్టి దాడికి పూనుకున్నాయి. జూన్ 4 రాత్రి చిమ్మచీకటిలో దళం కామ్రేడ్స్ రిట్రీట్ అవుతున్నప్పుడు దారి తప్పిన కామ్రేడ్ గౌతం దళం నుండి విడిపోయాడు. జూన్ 5న ఉదయం 9-10 గంటల మధ్యన ఒంటరిగా ఉన్న కామ్రేడ్ గౌతంను శత్రు బలగాలు చుట్టుముట్టడంతో వారితో పోరాడుతూ కామ్రేడ్ గౌతం అమరుడయినాడు.
కామ్రేడ్ గౌతం పశ్చిమ గోదావరి జిల్లాలోని సత్యవోలు గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో ఆరవ సంతానంగా 1957 జులై 4 తేదీన జన్మించాడు. విజయవాడలో ఆయుర్వేధ మెడికల్ కాలేజీలో చదువుతూ ఆర్ ఎస్ యూ లో చేరి విప్లవ బాట పట్టి 1981లో పూర్తికాలం కార్యకర్తగా తన కృషిని మొదలు పెట్టాడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాలలో పని చేస్తూ 1997లో రాష్ట్ర కమిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. 2001 ఏఓబీ స్పెషల్ జోన్ ఏర్పడినప్పుడు అక్కడకి బదిలీ అయి సెక్రెటరీయేట్ మెంబర్ గా, ఏఓబీ సెక్రెటరీగా తన సేవలు అందించాడు. 2004లో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపినప్పుడు సుధాకర్ పేరుతో మావోయిస్టు పార్టీ ఏఓబీ ప్రతినిధిగా పాల్గొన్నాడు. 2009 నుండి అమరుడు అయ్యే వరకు క్రాంతి పత్రిక సంపాదకుడుగా, రాజకీయ గురువుగా తన సేవలను అందించాడు.
జూన్ 6వ తేదీన పెద్దకాక్లేర్ గ్రామ సమీపంలో ఉన్న మరొక దళంపై శత్రువు బలగాలు దాడిచేసినప్పుడు వారితో పోరాడుతూ కామ్రేడ్ భాస్కర్ అమరుడయినాడు. కామ్రేడ్ భాస్కర్ పేద రైతాంగ దళిత కుటుంబంలో పుట్టిపెరిగాడు. ఇంటర్మిడియేట్ చదువుతూ ఆర్ఎస్ యూలో పనిచేసాడు. 1995లో పూర్తికాలం కార్యకర్తగా పార్టీలోకి భర్తీ అయి, ఉమ్మడి అదిలాబాద్ ప్లాటూన్ లో పనిచేసాడు. ఉమ్మడి అదిలాబాద్ డివిజన్ కమిటీ డీవీసీఎం గా పనిచేసాడు. 2015లో రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొమరం భీం-మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉంటూ తన బాధ్యతలను నిర్వహిస్తూ అమరుడయినాడు.
జూన్ 6, 7 తేదీ లలో కామ్రేడ్ రైనీ (నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యురాలు) అనారోగ్య కారణంగా ఇరుపగుట్ట గ్రామంలో నిరాయుధంగా ఉన్నప్పుడు పోలీసులు పట్టుకొని హింసించి హత్య చేసారు. కొమరంభీం- మంచిర్యాల డివిజన్ కి చెందిన సభ్యులు కామ్రేడ్ సంతోష్ (భాస్కర్ గార్డ్), కామ్రేడ్ రజని, నేషనల్ పార్క్ ఏరియా 2 పీఎల్ సభ్యుడు కామ్రేడ్ లాల్సూ, కుడియం మహేష్(ఇరుపగుట్ట గ్రామస్తుడు) లను పట్టుకొని హత్య చేసారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు వరుస దాడులు చేస్తూ మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని చంపుతూ, మరొక వైపు శాంతి చర్చల నాటకం ఆడుతున్నాయి. గతంలో చర్చల ప్రతినిధిగా వచ్చిన కామ్రేడ్ సుధాకర్ ను కూడా చంపింది. ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ, కగార్ దాడులను వ్యతిరేకిస్తూ జూన్ 20వ తేదీన ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో బందును పాటించాలని అందరికీ పిలుపునిస్తున్నాము.
విప్లవాభినందనాలతో,
జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).

