“బస్తర్లో CPI (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేశవ్ రావుతో సహా 27 మంది ఊచకోతకు నిరసనగా పంజాబ్ లోని సంగ్రూరులో భారీ ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. డెమోక్రటిక్ ఫ్రంట్ ఎగైనెస్ట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నవషరణ్ మాట్లాడుతూ, సహజ వనరులపై కార్పొరేట్ నియంత్రణ కోసం జరుగుతున్న క్రూరమైన యుద్ధంలో భాగమే ఈ మారణహోమం అని మండిపడ్డారు. భారత పాలకులు దశాబ్దాలుగా తన సొంత ప్రజలపై చేస్తున్న యుద్ధం యొక్క భయంకరమైన కోణాన్ని ఈ మారణహోమం బయటపెడుతుందన్నారు.
బస్తర్, ఇతర ఆదివాసీ ప్రాంతాలలో నక్సలిజాన్ని ఎదుర్కోవడం అనే ముసుగులో పాలకులు నిర్వహిస్తున్న మారణహోమ సైనిక దాడిని ఈ సమావేశం నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, అలాగే సాంస్కృతిక, సాహిత్య, ప్రజాస్వామ్య వేదికలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 కి పైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నవ్షరన్, డాక్టర్ పర్మీందర్ సింగ్, ప్రొఫెసర్ ఎ.కె. మలేరి, బూటా సింగ్ మెహమూద్పూర్ తదితరులు పాల్గొన్నారు.యశ్పాల్ చండీగఢ్ అధ్యక్షత వహించిన ఈ సమావేశం విప్లవ గీతాలతో , కామ్రేడ్ కేశవ్ రావు (బస్వ రాజ్) , ఇతర ప్రజా పోరాట అమరవీరులకు నివాళులర్పిస్తూ, పోరాట నినాదాల మధ్య ప్రారంభమైంది.
డాక్టర్ నవ్షరన్ మాట్లాడుతూ, “2009 నుండి, ఫాసిస్ట్ భారత రాజ్యం ఆదివాసులపై జాతి విధ్వంస దాడిని ప్రారంభించింది. ఊచకోతలు, సామూహిక అత్యాచారాలు, పిల్లల హత్యలు, మొత్తం గ్రామాలను నాశనం చేయడం సర్వసాధారణమైంది. తీరని దురాశతో నడిచే ప్రపంచ కార్పొరేట్ మైనింగ్ ప్రయోజనాలను కాపాడటానికి బస్తర్ తో సహా అనేక ప్రాంతాలు సైనికీకరించబడ్డాయి.”
డ్రోన్ , హెలికాప్టర్ బాంబు దాడులు, జరిగిన ఎన్కౌంటర్లు, పౌరులను మావోయిస్టులుగా ముద్ర వేయడం అనేది స్వదేశీ సమాజాలను స్థానభ్రంశం చేయడానికి, అణిచివేయడానికి ఉపయోగించే వ్యూహాలు అని నవషరణ్ హెచ్చరించారు. ఈ దోపిడీ, విధ్వంసక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిఘటించినందుకు వేలాది మంది ఆదివాసీలు, విప్లవకారులు జైళ్లలో మగ్గుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మార్చి 2026 నాటికి ‘నక్సలిజాన్ని నిర్మూలించాలి’ అనే బిజెపి ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం కార్పొరేట్ దోపిడీకి మార్గం సుగమం చేసే ఫాసిస్ట్ వ్యూహంలో భాగం. ఈ ‘అభివృద్ధి’ నమూనా హింసాత్మకమైనది, ప్రజా వ్యతిరేకమైనది దానిని మనం తిరస్కరించాలి” అని ఆమె నొక్కి చెప్పారు.
”హింసకు మావోయిస్ట్, ఇతర సాయుధ ఉద్యమాలు కారణం కాదని, హింస ,లోతైన వ్యవస్థాగత అన్యాయం, అణచివేత, అసమానత యొక్క పర్యవసానమని డాక్టర్ నవ్షరన్ వివరించారు. ఈ మనోవేదనలను పరిష్కరించడానికి బదులుగా, రాష్ట్రం ‘కగార్’ వంటి కార్యకలాపాల ద్వారా, కర్రెగుట్టలను చుట్టుముట్టడం వంటి క్రూరమైన ముట్టడి వ్యూహాల ద్వారా, ఆదివాసీ రక్తంతో అడవులను తడిపి సైనిక అణచివేతను పెంచింది. అడవులలో మావోయిస్టులు, ఆదివాసీలను ఊచకోత కోయడం, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్వరాలను అణచివేయడం ఇవి రెండూ రాజ్యం యొక్క ప్రాయోజిత ఉగ్రవాదానికి రెండు ముఖాలు” అని ఫ్రంట్ కన్వీనర్ డాక్టర్ పర్మీందర్ సింగ్ అన్నారు. ఈ సామూహిక హింసాయుత పాలనకు వ్యతిరేకంగా పంజాబ్లోని ప్రజాస్వామ్య శక్తులు బలమైన , ఐక్య స్వరాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారాయన.
పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పోరాటాలను – అది జియోండ్, చాంద్భన్ లేదా సంగ్రూర్ అయినా – అణిచివేయడానికి క్రూరమైన పోలీసు బలగాలను మోహరించడాన్ని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో పోల్చారు. రాష్ట్రం క్రమంగా పోలీసు రాజ్యంగా మారుతోంది, ఇది రైతులు, కార్మికులు, దళితులు ఇతర వర్గాల చట్టబద్ధమైన పోరాటాలను నేరంగా పరిగణిస్తుందన్నారు.
బూటా సింగ్ మెహమూద్పూర్ సమర్పించిన ఈ కింది తీర్మానాలను,డిమాండ్లను సమావేశం ఆమోదించింది.
- డ్రోన్ దాడులు, నకిలీ ఎన్కౌంటర్లు, ఆదివాసీ ప్రాంతాలలో ఇతర రకాల సామూహిక హింస, హత్యలను వెంటనే నిలిపివేయాలి.
- పారామిలిటరీ శిబిరాలను తీసివేయాలి ఈ ప్రాంతాల నుండి ప్రత్యేక భద్రతా దళాలను ఉపసంహరించుకోవడం.
- స్థానిక జనాభాను స్థానభ్రంశం చేసే కార్పొరేట్ ఆధారిత ఆర్థిక నమూనాను తిరస్కరించాలి.
- నీరు, అడవులు, భూమిపై ఆదివాసీల సహజ హక్కులను గుర్తించాలి.
- ప్రజా ఉద్యమాలను చట్టవిరుద్ధమైనవిగా ముద్ర వేయడం, అసమ్మతిని అణచివేయడాన్ని తక్షణం నిలిపివేయాలి
- ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న అందరు రాజకీయ ఖైదీలు, విచారణలో ఉన్నవారితో సహా సామాన్య ప్రజలను విడుదల చేయాలి.
- రాజ్య అణచివేతకు సాధనంగా పనిచేసే NIA ని రద్దు చేయాలి.
- కల్పిత కేసుల ఆధారంగా దాడులు, అరెస్టులను వెంటనే నిలిపివేయాలి.
నారాయణ్ పూర్ లో జరిగిన కామ్రేడ్ కేశవ్ రావుతో సహా 27 మంది చట్టవిరుద్ధ హత్యలను ప్రత్యేక తీర్మానం ఖండించింది, వాటిని విప్లవ శక్తులను భౌతికంగా నిర్మూలించడానికి BJP ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యాకాండగా తీర్మానం అభివర్ణించింది.
భారత పాలకులు నేర్చుకోవలసిన కీలకమైన పాఠాన్ని చరిత్ర నేర్పుతుందని తీర్మానం హెచ్చరించింది న్యాయం, స్వేచ్ఛలను అణిచివేత ద్వారా అడ్డుకోలేరు. దోపిడీ వ్యవస్థలు ఉన్నంత కాలం పరివర్తన కోసం ప్రజలు పోరాడుతూనే ఉంటారని సమావేశం తీర్మానించింది.
సైనిక కార్యకలాపాలు, చట్టవిరుద్ధ హత్యలను వెంటనే ఆపాలని, భారతదేశంలో ఉన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి CPI (మావోయిస్ట్), తదితర తిరుగుబాటు శక్తులతో అర్థవంతమైన చర్చలో పాల్గొనాలని సమావేశం మోడీ ప్రభుత్వాన్ని కోరింది.