Menu

యుద్ధం నీడ తొలగితేనే శాంతి – ముసాఫిర్

anadmin 2 months ago 0 220

భారతదేశంలో నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా చూస్తున్న ప్రభుత్వాలు ఆయుధానికి ఆయుధంతోనే సమాధానం చెబుతామనే ధోరణిని అవలంభిస్తున్నాయి. అంతరాలు లేని సమాజాన్ని కాంక్షించే కమ్యునిస్టులు వర్గపోరాటమే గీటురాయిగా తమ ఆచరణను నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీగా మావోయిస్టు పార్టీ ఎంచుకున్న సాయుధ పంథా పాలకవర్గాలకు సంకటంగా మారింది. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దక్కడమనేది నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని నమ్మే మావోయిస్టులు ప్రజల్ని విప్లవం భాగంచేసే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అది నక్సల్బరీ నుంచి మొదలై ఇవాళ దండకారణ్యంలో నడుస్తున్న జనతన సర్కార్‌ల వరకు కనిపిస్తున్న ఆచరణ. కానీ అర్థ శతాబ్ధంపైబడిన ఆచరణలో విప్లవోద్యమం ఎన్నో ఎగుడుదిగుడులను చూడాల్సి వచ్చింది. అదే సమయంలో విప్లవోద్యమం అందించిన వర్గస్పృహతో దేశ అట్టడుగు ప్రజలు సాధించుకున్న విజయాలూ ఎన్నో ఉన్నాయి. దొరలు, భూస్వాములు, పెత్తందార్లు అకృత్యాలను ఎదిరించి నిలబడ్డారు.

తెలంగాణలాంటి ప్రాంతాల్లో ప్రతి గ్రామం విప్లవోద్యమ ప్రభావంలోనే ఉండేదంటే నక్సలైట్లపట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు. భూస్వాముల దోపిడీ మొదలు విద్య, వైద్యం, వ్యవసాయం, మద్య నిషేధంలాంటి ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో విప్లవోద్యమం కీలక పాత్ర పోషించింది. పేదలకు భూములు పంచడంతోపాటు వ్యవసాయం కోసం పెద్ద పెద్ద చెరువులను తవ్వించడం, పాఠశాలలు నిర్మించడంలాంటి ఎన్నో కార్యక్రమాలను విప్లవోద్యమం నిర్వహించింది. ప్రత్యామ్నాయ ప్రజా పాలన నిర్మితమవుతున్న దశలో ప్రభుత్వాలు విప్లవోద్యమంపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించాయి. దీంతో విప్లవోద్యమ ప్రాంతాలు నిత్యం రక్తసిక్తమవుతూ తెలుగు నేల ఎర్రబారింది. కులాధిరిత భూస్వామ్యంపైనే కాదు, దేశ సంపదను లూటీ చేస్తున్న పెట్టుబడిపైనా విప్లవోద్యమం తమ పోరాటాన్ని ఎక్కుపెట్టింది. దేశ సహజ వనరులను కబ్జాచేయాలనుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీలకు వ్యతిరేకంగా నిలబడింది. దీంతో ప్రజల సంపదను దోచుకోవాలనుకుంటున్న దోపిడీదొంగలకు విప్లవోద్యమ నిర్మూలన అనివార్యమైంది. అందుకు ప్రభుత్వాలు అండగా నిలవడంతో విప్లవోద్యమ నిర్మూలన కార్యక్రమం యుద్ధం స్థాయికి చేరింది.

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌ పార్టీ దండకారణ్యంలోకి ప్రవేశించింది. అక్కడ ఆదివాసీల్లో ఆదివాసీలుగా కలిసిపోయారు విప్లవకారులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో అపారమైన ఖనిజ సపంద ఉంది. ఈ ఖనిజ సందపపై టాటా, జిందాల్‌, మిట్టల్‌, వేదాంతలాంటి బడా కార్పొరేట్‌ కంపెనీలు కన్నేశాయి. ఈ కార్పొరేట్‌ సంస్థల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా దశాబ్దాలుగా ఆదివాసీలు పోరాడుతున్నారు. ఈ పోరాటానికి మావోయిస్టులు అండగా నిలవడంతో మావోయిస్టుల నిర్మూలన కోసం భారత ప్రభుత్వం పూనుకుంది. మావోయిస్టు ఏరివేత పేరుతో అడవి నుంచి ఆదివాసీలను గెంటివేసి కార్పొరేట్‌ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ పరిచే వ్యూహంతో విప్లవోద్యమ నిర్మూలన కార్యక్రమాన్ని దశాబ్దాలుగా భారత ప్రభుత్వం అమలు చేస్తోంది.

చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సాల్వాజుడుంలాంటి ప్రైవేటు సాయుధ ముఠాను రూపొందించి ఆదివాసీలకు వ్యతిరేకంగా ఆదివాసీలను నిలబెట్టే ప్రయత్నం చేసింది. తరువాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ పేరుతో విప్లవోద్య నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా ఆపరేషన్‌ గ్రీన్‌హంట్ రెండోదశ, ఆపరేషన్‌ ప్రహార్‌, ఆపరేషన్‌ సమాధాన్‌ ఇలా ఎప్పటికప్పుడూ కొత్త వ్యూహాలతో విప్లవోద్యమంపై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. కానీ ప్రజాబలంతో ప్రభుత్వ యుద్ధనీతిని ఎదిరించి విప్లవోద్యమం పురోగమిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత జనవరిలో భారత ప్రభుత్వం ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించింది. ఇది అంతిమ యుద్ధంగా ప్రకటించిన ప్రభుత్వం 2026 మార్చ్‌ నాటికి విప్లవోద్యమం పూర్తిగా అంతమవుతుందని ప్రకటించింది. అందుకోసం లక్షలాదిగా పారా మిలిటరీ బలగాలను ఉపయోగిస్తోంది. దండకారణ్యంలో ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక క్యాంపును ఏర్పాటు చేసి, ఆదివాసీ గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మావోయిస్టుల ఆనుపానులు కనిపెట్టేందుకు డ్రోన్‌లను ప్రయోగిస్తున్నారు. డ్రోన్‌ల ద్వారా, హెలికాఫ్టర్ల ద్వారా బాంబులు వదులుతూ దండకారణ్య ప్రాంతంలో యుద్ధవాతావరణాన్ని సృష్టించారు.

తమ కాళ్లకింది నేలను కోల్పోవడానికి సిద్ధంగా లేని ఆదివాసీలను పట్టుకొని నక్సలైట్ల పేరుతో కాల్చిచంపుతుండడం పరిపాటిగా మారింది. గడిచిన నాలుగు నెలల వ్యవధిలోనే వందలాది మంది మావోయిస్టులు, ఆదివాసీలను హత్యచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఈ వాతావరణం ప్రజాస్వామిక వాదుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ ఆదివాసీల పాలిట ముప్పుగా పరిణమిస్తోందని హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నక్సలిజాన్ని శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా చూడాలని చాలాకాలంగా హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో స్వంత ప్రజలపైనే ప్రభుత్వం యుద్ధం చేయడం సరైందికాదని వాదిస్తున్నారు. అయినా ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కితగ్గేందుకు సిద్ధంగా లేకపోవడంతో సమస్య పరిష్కారానికి శాంతి చర్చల ప్రతిపాదనను ముందుంచారు. ప్రభుత్వం, మావోయిస్టులు చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

హక్కుల సంస్థలు, ప్రజాస్వామికవాదుల ప్రతిపాదన నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అందుకు తగిన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరింది. ఈ విషయంలో ఇటు చత్తీస్‌ఢ్‌ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించడం లేదు. చర్చల ప్రస్తావన నడుస్తుండగానే తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్టలపై మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో దాదాపు 10వేల మందికిపైగా భద్రతాబలగాలను మోహరించింది ప్రభుత్వం. ఇది అతి పెద్ద ఆపరేషన్‌ అనీ, భారీ విషయాన్ని సాధిస్తామని తాజాగా చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వంపై చర్చల కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ హననంగా పరిణమించిన ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది న్యాయమైన డిమాండ్‌. ఈ డిమాండ్‌కు ప్రజాతంత్రవాదులందరి మద్దతు అవసరం. ఆదివాసీ సమాజాన్ని కాపాడుకునేందుకు శాంతి చర్చలకు సిద్ధమవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలి.

నిజానికి శాంతి చర్చల ప్రస్తావన ఇప్పుడే తొలిసారి వినిపించడం లేదు. గడిచిన ఆరు దశాబ్దాల్లో అనేకసార్లు చర్చల పస్తవన తెరమీదికి వచ్చింది. కానీ, ఆచరణలోకి వచ్చింది మాత్రం 2004లోనే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు విప్లవ పార్టీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. నేరుగా విప్లవ పార్టీల ప్రతినిధులే ప్రభుత్వ పెద్దలతో పలు అంశాలపై చర్చించిన అనుభవం ఉంది. చర్చల నేపథ్యంలో దాదాపు ఆరు నెలల కాలం ఇరు పక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. చర్చల తరువాత ప్రభుత్వం వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినా కొంతకాలం పాటు క్షేత్రస్థాయిలో శాంతియుత వాతావరణం ఏర్పడడానికి అది దోహదపడింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న యుద్ధవాతారణం నేపథ్యంలో ప్రభుత్వం శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది.

శాంతి చర్చలు – గత అనుభవాలు :

పౌర స్పందన వేదిక కృషితో 2001లో ప్రభుత్వం, సీపీఐ(ఎం-ఎల్‌) పీపుల్స్‌ వార్‌ పార్టీకి మధ్య చర్చల ప్రతిపాధన ముందుకు వచ్చింది. పీపుల్స్‌ వార్‌ తరుపున మధ్యవర్తులుగా వ్యవహరించేందుకు వరవరరావు, గద్దర్‌ ముందుకు వచ్చారు. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగేలా చంద్రబాబు ప్రభుత్వం చొరవచూపలేదు. ఈ నేపథ్యంలో 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ నక్సలైట్లతో చర్చల అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో చర్చల అంశం తెరమీదకు వచ్చింది. పౌర స్పందన వేదికతో పాటు హక్కుల సంస్థలు, ప్రజాస్వామికవాదుల చొరవతో పీపుల్స్‌ వార్‌ పార్టీ చర్చలకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. సీపీఐ (ఎం- ఎల్‌) జనశక్తి పార్టీ కూడా చర్చలకు ముందుకు రావడంతో రెండు పార్టీలతో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

అయితే ఈ ప్రక్రియ అంత సులభంగా సాగలేదు. చర్చలకు రావాలంటే ముందే ఆయుధాలు వీడాలనే పీఠముడిని ముందు పెట్టింది ప్రభుత్వం. కానీ అందుకు విప్లవ పార్టీలు అంగీకరించలేదు. చర్చలకు సానుకూల వాతావరణం కల్పించడమంటే ఆయుధాలు వీడడం కాదని, తాత్కాలిక కాల్పుల విరమణ ద్వారా ఇరు పక్షాలు చర్చించుకునే అవకావం ఉంటుందని ప్రతిపాదించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంతో పాటు విప్లవ పార్టీలు కూడా కాల్పుల విరమణ ప్రకటించాయి. చర్చల తేదీలు, ఎజెండా అంశాలు, మధ్యవర్తులు ఇతరత్రా అంశాలపై జరిగిన పరస్పర సంప్రదింపుల తరువాత 2004 అక్టోబర్‌లో శాంతి చర్చలకు వచ్చేందుకు విప్లవ పార్టీలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ 30న నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో పీపుల్స్‌ వార్‌, జనశక్తి పార్టీలు భారీ బహిరంగసభ నిర్వహించాయి. ఈ సభావేదిక నుంచే ‘ప్ర‌జ‌లకు పిలుపు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించాయి. శాంతి, దున్నేవారికే భూమి లాంటి అంశాలను ఈ వేదిక నుంచి వినిపించాయి.

శాంతి చర్చల్లో పాల్గొనేందుకు 2004 అక్టోబర్‌ 11న పీపుల్స్‌వార్‌ అప్పటి ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఓబి కార్యదర్శిగా సుధాకర్‌, ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గణేశ్‌తో పాటు జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అమర్‌, రాష్ట్రకమిటీ సభ్యుడు రియాజ్‌ నల్లమల నుంచి మైదానంలోకి వచ్చారు. ఐదుగురు నాయకులతో పాటు దాదాపు మంది మావోయిస్టు పార్టీ నుంచి 20మంది, జనశక్తి నుంచి 10మంది నక్సలైట్లు తమ నాయకులకు రక్షణగా వచ్చారు. అదేరోజు గుత్తికొండ బిలం వద్ద చారుమజుందార్‌ స్థూపావిష్కరణలో పాల్గొని అక్కడకు వచ్చిన వేలాది మందిని ఉద్దేశించి విప్లవ పార్టీ నేతలు ప్రసంగించారు. అది మొదలు మొదటి దశ చర్చలు ముగిసేనాటి వరకు నిత్యం వేలాది మంది విప్లవ పార్టీ నేతలకు కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చేవారు.

హైదరాబాద్‌లోని మంజీరా గెస్ట్‌లో పీపుల్స్‌వార్‌, జనశక్తి పార్టీ ప్రతినిధులకు మకాం ఏర్పాటు చేశారు. వారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు నిత్యం వందలాది మంది అక్కడకు వచ్చేవారు. కుటుంబ సమస్యలు మొదలు, భూ సమస్యలు, రాజకీయ సమస్యల వరకు ఇలా గుట్టలు గుట్టలుగా ఫిర్యాదులు వచ్చేవి. విప్లవ పార్టీ నేతల్ని కలిసిన ప్రజా సంఘాల నేతలు ప్రత్యేక తెలంగాణ, కుల సమస్య లాంటి అంశాలను చర్చించారు. 2004 అక్టోబర్‌ 13న మంజీరా గెస్ట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలోనే పీపుల్స్‌ వార్‌ ప్రతినిధులుగా హాజరైన రామకృష్ణ, సుధాకర్‌ సీపీఐ(ఎం- ఎల్‌ పీపుల్స్‌ వార్‌, ఎంసీసీ విలీనాన్ని గురించి ప్రకటించారు. తాము చర్చల్లో సీపీఐ (మావోయిస్టు) పార్టీ తరుఫున పాల్గొంటున్నట్లు ప్రకటించారు.

అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ప్రభుత్వ ప్రతినిధులు, విప్లవ పార్టీల నేతలు, మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరిగాయి. పీపుల్స్ వార్ నేతలు రామకృష్ణ, సుధాకర్, గణేశ్; జనశక్తి నేతలు అమర్ , రియాజ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరుఫున మంత్రులు కె జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావుతో పాటు కేకే, పురుషోత్తం రావులాంటి వారు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నిరుపేదలకు భూమి పంపిణీ, ప్రపంచ బ్యాంకు విధానాలు, రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ, మద్య నిషేదం ఇలా పలు అంశాలు చర్చకు ఉన్నప్పటికీ మొదటి దశలో భూసంస్కరణల మీదే ప్రధాన చర్చ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధీనంలో, ప్రైవేట్‌ యాజమాన్యాల ఆక్రమణల్లో కోటి 20 లక్షల ఎకరాల భూమి ఉందని, ఆ భూమిని భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయాలని విప్లవ పార్టీలు ప్రతిపాదించాయి. అందుకోసం భూ కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించడంతో పాటు గాంధీ జయంతి సందర్భంగా మిగులు భూమి పంపణి ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. అందుకోసం అప్పటి ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు నేతృత్వంలో భూ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

కానీ మొదటి దశ చర్చల తరువాత ప్రభుత్వం కాల్పుల విరమణను ఉల్లంఘించి ఏకపక్ష కాల్పులకు తెరతీసింది. 2005 జనవరి 8న కర్నూలులో లక్ష్మి ఎన్‌కౌంటర్‌తో మళ్లీ ఎన్‌కౌంటర్ల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి నెలలోనే వరంగల్‌లో జనక్తి నేత రాజిరెడ్డి, సిరిసిల్లలో నరేష్‌తో పాటు మరొకరిని కాల్పిచంపారు పోలీసులు. దీంతో అప్పటి వరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్న విప్లవ పార్టీలు రెండో దశ చర్చలకు ప్రభుత్వం సిద్ధంగాలేదని అర్థం చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వం జనశక్తి పార్టీ తరుఫున చర్చల్లో పాల్గొన్న రియాజ్‌ను 2005 జూన్‌ 30న హైదరాబాద్‌లో పట్టుకొని మర్నాడు తెల్లవారుజామున కరీంనగర్‌లో కాల్చిచంపింది. శాంతి చర్చల ప్రతినిధినే చంపడంతో రెండోదశ చర్చల అంశం అక్కడితో సమసిపోయింది. తరువాత యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో స్వామి అగ్నివేశ్‌ ద్వారా చర్చల ప్రస్తావన ముందుకు వచ్చినా, మావోయిస్టు పార్టీ అప్పటి అధికార ప్రతినిధి ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌తో ఆ ప్రక్రియ ఆగిపోయింది.

ఇరవై ఏళ్ల తరువాత మళ్లీ చర్చల ప్రస్తావన సీరియస్‌గా ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. తాజాగా పలు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో ముందుకువచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎం- ఎల్‌) న్యూడెమోక్రసీ, మాస్‌లైన్‌, తెలంగాణ జన సమితి, రెవెల్యూషనరీ వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా లాంటి రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నాయి. సాయుధపోరాటాన్ని నమ్మిన విప్లవ పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని నమ్మే ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతులను అనుసరించడం హర్షనీయం కాదు. ఒక పక్షం కాల్పుల విరమణకు, చర్చలకు సిద్ధమతన్న తరువాత కూడా ఏకపక్షంగా దాడులు జరపడం తగదు. ప్రభుత్వ దూకుడు వెనక పెట్టుబడి ప్రయోజనాలు దాగిఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. కార్పొరేట్‌ సంస్థలకు దేశ వనరులను దోచిపెట్టేందుకు అడవిని నమ్ముకున్న ఆదివాసీలను, వారికి అండగా ఉన్న విప్లవోద్యమాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం కాలుదువ్వుతోంది.

విప్లవోద్యమాన్ని నిర్మూలించడం ద్వారా శాంతి స్థాపిస్తామనే ప్రభుత్వ ప్రకటనలు అర్థరహితమైవి. కాల్పుల విరమణకు ముందస్తు షరతుగా ఆయుధాలు వీడలానే ప్రతిపాదన సరైంది కాదు. నిజానికి ప్రభుత్వ వైఖరి యుద్ధంలో చస్తారో, లేదంటే ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారో తేల్చుకోండి అనేలా ఉంది. కానీ విప్లవకారులు సాయుధ పంథాను ఎంచుకోవడం వెనక ఉన్న మౌళిక అంశాలను చర్చించకుండానే ఆయుధాలు వీడమని అనడం అర్థరహితం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం కూడా ఇలాంటి ప్రతిపాదనను ముందుంచింది. కానీ చర్చల ప్రక్రియ ప్రారంభమవడానికి ముందు ఇరుపక్షాలు కాల్పుల విరమణ ప్రకటించి అడుగుముందుకు వేయాలనే అంశాన్ని మధ్యవర్తులు ప్రభుత్వానికి అర్థం చేయించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్థుత చర్చల ప్రక్రియను ముందుకు నడిపించాలి. అడవి మీద ఆధారపడి జీవించే లక్షలాది మంది ఆదివాసీలను హత్యచేసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని ప్రజలంతా ముక్తకంఠంతో నినదించాలి. యుద్ధవాతావరణం తొలిగితేనే శాంతి చర్చలు సాధ్యమవుతాయని ప్రభుత్వం గుర్తించాలి.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad