కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలన పేరుతో చేపట్టిన కగార్ ఆపరేషన్ ను తక్షణం ఆపాలని భారత రాష్ట్ర సమితి (BRS)అధ్యక్షులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు (KCR) డిమాండ్ చేశారు. చత్తీస్ గడ్ లో కగార్ పేరుతో ఆదివాసులను, అమాయకులను ఊచకోత కోస్తున్నారని, అధికారం చేతులో ఉందని ఇలా ప్రాణాలు తీయడం ప్రజాస్వామ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS ఏర్పాటై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభ జరిగింది ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని ప్రకటించారని, అందువల్ల తక్షణం కూంబింగులు, కాల్పులు ఆపి.. వారితో చర్చలు చేయాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి, శాంతి చర్చలు జరపాలని కోరుతూ తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీర్మానం చేసి లేఖ రాయడాన్ని సమర్దిస్తారా అని కేసీఆర్ సభకు వచ్చిన ప్రజలను కోరగా జనం పెద్ద ఎత్తున చప్పట్లతో ఆ తీర్మానానికి మద్దతు పలికారు.