Menu

రేణుకను గుర్తు చేసుకుందాం!

anadmin 2 months ago 0 204

వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విప్లవాచరణలో ఏనాడూ వెనుకడుగెయ్యని రేణుక మరోవైపు సాహితీకృషిని అంతే పట్టుదలతో కొనసాగించింది. ఒక కమ్యూనిస్టు విప్లవకారిణిగా, రచయితగా, సంపాదకురాలిగా రేణుక చేసిన కృషినంతా కుటుంబంగా మేం సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. తెలుసుకోలేకపోవచ్చు. బహుశా ఎన్నటికీ తెలియను కూడా తెలియకపోవచ్చు. కానీ అంచెలంచలుగా ఎదుగుతూ, తాను నమ్మిన లక్ష్యం కోసం చివరి వరకూ పట్టుదలగా నిలబడ్డ రేణుక జీవితం మాకు ఎల్లప్పటికీ గర్వకారణంగా ఉంటుంది.
……………………….
మా ఇంట్లో, మా ఊళ్లో అందరూ ప్రేమగా ‘చిట్టమ్మ’గా పిలుచుకునే రేణుక 1970 అక్టోబర్ 14న పుట్టింది. బాపు గుముడవెల్లి సోమయ్య, అమ్మ జయమ్మ (యశోద)ల రెండో సంతానమైన రేణుకకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నాం. ఇంట్లో ఒకే ఆడపిల్ల కావడంతో ఆమెను అందరూ ప్రేమగా చూసుకునేవారు. ఊళ్లో వాళ్లు కూడా రేణుకను చాలా ముద్దు చేసేవాళ్లు. అందరు ఆడపిల్లల్లా ఇంటిపనులు, వంటపనులు నేర్చుకోవాలనే ఒత్తిడి ఆమెపై మా ఇంట్లో ఉండేది కాదు. అమ్మాబాపులు ఇచ్చిన స్వేచ్ఛతో ఇంట్లో ఆమెకు పితృస్వామ్య పెత్తనాన్ని పెద్దగా ఎదుర్కోవాల్సి రాలేదని చెప్పొచ్చు.
సన్నగా, పొడుగ్గా ఉండే రేణుక చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థి. బాపు స్కూలు టీచరు కావడంతో మా కుటుంబం చాలా ఊళ్లు మారాల్సి వచ్చింది. దాంతో ఆమె కోల్కొండ, సీతారాంపురం, కడవెండి, మోత్కూరు, దేవరుప్పుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూలు చదువు పూర్తి చేసింది. జనగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.

పద్నాలుగేళ్ల వయసులో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా రేణుక ఊపిరితిత్తులకు టీబీ సోకింది. రోజూ జ్వరం వస్తూ ఉండేది. కానీ, డాక్టర్లు రోగనిర్ధరణ సరిగా చేయకపోవడంతో ఆమెకు కొన్ని నెలల వరకు సరైన చికిత్స అందలేదు. ఈలోపు జబ్బు బాగా ముదిరి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. చివరకు వరంగల్‌లో డాక్టర్ కోటిలింగం ఆమె వ్యాధిని సరిగా గుర్తించి, సరైన వైద్యం అందించడంతో జబ్బు నయమైంది. కానీ ఊపిరితిత్తుల్లో అప్పటికే కొన్ని టిష్యూలు దెబ్బతినిపోవడంతో దాని ప్రభావం ఆమెను జీవితాంతం వెంటాడింది. వేగంగా నడవలేకపోయేది. పరుగెత్తడం తన వల్ల కాకపోయేది. బాగా ఆయాసం వచ్చేది.

రేణుక ఇంటర్ చదువుతున్న సమయంలో అన్న వెంకట కిషన్ ప్రసాద్ పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. తను ఇంటర్మీడియట్ పూర్తి చేశాక మా కుటుంబం కడవెండి నుంచి మోత్కూరుకు మారింది. కడవెండిలో ఉన్న ఇల్లు అమ్మేసి మోత్కూరులో ఇల్లు కట్టుకున్నాం. అదే సమయంలో రేణుకకు పెళ్లి జరిపించాలనే తొందరపాటు నిర్ణయం మా కుటుంబం తీసుకుంది. రేణుకకు ఉన్నత చదువులు చదవాలని, అప్పుడే పెళ్లి చేసుకోవద్దని బలంగా ఉన్నప్పటికీ బాపు నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చదువు కొనసాగించవచ్చని బాపు హామీ ఇవ్వడంతో అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంది. కానీ కొన్ని నెలల్లోనే భర్త వేధింపులు, మానసిక హింసలు, అవమానాలు మొదలయ్యాయి. కొంత కాలం పాటు పుట్టింట్లో ఏమీ చెప్పకుండా వాటిని ఓపికగా భరించింది. కానీ చివరకు పరిస్థితి దారుణంగా తయారవడంతో ఆమె ఈ విషయం ఇంట్లో చెప్పడం, కుటుంబం వెంటనే స్పందించి తనకు అండగా నిలబడటంతో ఆ పెళ్లి పెటాకులు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇక అప్పటి నుంచి అమ్మాబాపు ఆమెకు అన్ని విధాలా ప్రోత్సాహం అందించడంతో ఆగిపోయిన చదువును మళ్లీ మొదలుపెట్టింది. దాంతో ఆమెలో మళ్లీ స్వేచ్ఛ రెక్కలు విప్పుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఏ (ఎక్స్‌టర్నల్) పూర్తి చేసి, ఆ తర్వాత ఎంఏ (తెలుగు), లా కోర్సుల కోసం ఎంట్రెన్సు రాసింది. కోఠి విమెన్స్ కాలేజీలో ఎంఏ (తెలుగు)లో, తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో సీట్లు వచ్చాయి. అయితే, దూరంలో ఉన్నప్పటికీ తిరుపతిలో లా చేయడాన్నే ఆమె ఎంచుకుంది. అలా ఆమె 1992లో తిరుపతికి పయనమైంది.

తొలి నుంచే చదువరి, సాహిత్యాభిమాని అయిన రేణుక ఈ దశలో సాహిత్యాన్ని విస్తృతంగా చదివింది. ఆనాడు కడవెండి గ్రామంలో, మొత్తంగా ఉత్తర తెలంగాణలో ఉధృతంగా సాగుతున్న విప్లవోద్యమ ప్రభావం ఆమెపై ఎలాగూ ఉంది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, జీతగాళ్ల వేతనాల పెంపుదల కోసం జరిగిన సమ్మెలు, కడవెండిలో ఒక భూస్వామికి చెందిన పడమటితోటను ఆక్రమించుకొని ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడం కోసం జరిగిన పోరాటం, మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల ప్రభావం రేణుకపై బలంగా పడింది. వాటిన్నింటినీ ఆమె ఒక క్రమంలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది.

సంక్షిప్త వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న వేధింపుల అనుభవంతో, పితృస్వామ్యాన్ని, దాని వివిధ రూపాలను, ధోరణులను అవగాహన చేసుకోసాగింది. అది నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫెమినిస్టు సాహిత్యం విస్తృతంగా వెలువడుతున్న కాలం. దాని ప్రభావం కూడా రేణుకపై బాగానే పడింది. అయితే, నూతన ప్రజాస్వామ్యం, సోషలిజం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులు మహిళా సమస్యను ఏ కోణంలో చూస్తారు? దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటారు? మహిళల హక్కులను, స్త్రీపురుష సమానత్వాన్ని కమ్యూనిస్టులు అసలు ఎలా సాధిస్తారు? ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు ఆమెకు ఉండేవి. ఈలోగా తిరుపతి పట్టణ ఆర్గనైజర్‌ పద్మక్కతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అమరుడు పులి అంజన్న ఇచ్చిన రిఫరెన్సుతో 1992లో ఒక రోజు మధ్యాహ్నం పూట పద్మక్క యూనివర్సిటీ హాస్టల్‌కు వెళ్లి రేణుకను కలవడం…. తన జీవితాన్ని చిరస్థాయిగా మార్చేస్తుందని బహుశా రేణుక ఊహించి ఉండకపోవచ్చు. రేణుకలో ఉన్న అనుమానాలను, ప్రశ్నలను పద్మక్క ఒక క్రమపద్ధతిలో నివృత్తి చేసింది. స్థానికంగా జరిగే మహిళా ఉద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించింది. అయితే, 1994లో పద్మక్క బూటకపు ఎన్‌కౌంటర్‌ వార్త రేణుకకు ఓ పిడుగుపాటు. ఆ దుఃఖం నుంచి తేరుకోవడానికి ఆమెకు చాలా కాలం పట్టింది.
ఆచరణ, అధ్యయనం రెండింటిని మేళవిస్తూ రేణుక క్రమంగా ఒక విప్లవకారిణిగా రూపొందింది. మహిళాశక్తి అనే సంఘంలో పని చేస్తూ, ఆ సంఘం నడిపించే మహిళా మార్గం పత్రికకు క్రమం తప్పకుండా కథలు, రిపోర్టులు రాస్తూ ఉండేది. ఒక వైపు చదువుకుంటూనే సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాల్గొంటూ.. అదే సమయంలో కథా రచయితగా ఎదిగింది. నిజానికి తిరుపతి వెళ్లడానికి ముందే ఒక కథ రాసి ‘నలుపు’ పత్రికకు పంపించినప్పటికీ, వాళ్ల ఆఫీసులో దాని చివరి పేజీ మిస్ కావడంతో అది అచ్చుకు నోచుకోలేదు. ఆ తర్వాత, తిరుపతిలో ఉన్న కాలంలో వరుసగా అనేక కథలు రాసింది. అక్కడి సాహితీమిత్రుల సద్విమర్శలతో, సూచనలతో తన కథారచన విధానాన్ని మెరుగుదిద్దుకుంది.

1996 నాటికే పూర్తికాలం పార్టీ కార్యకర్తగా పని చేసేందుకు సిద్ధపడ్డ రేణుకను పార్టీ నాయకత్వం పట్టణోద్యమంలోనే పని చేయాలని సూచించింది. వరకట్న హత్యలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు, మురికివాడల్లో ప్రజలు ఎదుర్కొనే దైనందిన సమస్యలు వంటి వాటిపై జరిగిన పోరాటాల్లో ఆమె క్రియాశీలంగా పాల్గొంది. వాటికి నాయకత్వం వహించింది. అదే సమయంలో మహిళామార్గం ఎడిటోరియల్ బోర్డులో భాగమై పత్రికను క్రమం తప్పకుండా ప్రచురించడంలో కీలక బాధ్యత పోషించింది. ఆ తర్వాత వేర్వేరు మహిళా సంఘాలతో కలిసి ఏర్పడ్డ చైతన్య మహిళా సమాఖ్యలో కూడా రేణుక భాగమైంది.
పార్టీ ఉన్నత నాయకత్వాన్ని కలిసేందుకు రేణుక అప్పుడప్పుడు నల్లమల అడవుల్లోకి వెళ్తూ ఉండేది. అమరుడు లింగమూర్తి (కృష్ణన్న) ఆమెకు బాధ్యుడు. ఆనాటికి సంతోష్ కేంద్రకమిటీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. సంతోష్ పేరు కడవెండిలో అందరికీ సుపరిచితమే కానీ రేణుకకు ఆయనతో పెద్దగా పరిచయం లేదు. కృష్ణన్న, అమరుడు ఆర్కే ఇద్దరూ కలిసి సంతోష్, రేణుకల ముందు విడివిడిగా పెళ్లి ప్రతిపాదన ఉంచారు. వారిద్దరు కలుసుకుని మాట్లాడుకునే ఏర్పాటు చేశారు. అలా కొంత కాలం పాటు ఇద్దరి మధ్య కొనసాగిన సంభాషణలు, ప్రేమకు, పెళ్లికి దారితీశాయి. అయితే, సంతోష్ అప్పటికే అగ్రశ్రేణి నాయకుడు కావడం, మరోవైపు రేణుక పట్టణంలో బహిరంగంగా జీవిస్తూ ప్రజాసంఘాల కార్యక్రమాల్లో పని చేస్తూ ఉండటంతో ఈ పెళ్లిని రహస్యంగా ఉంచాలని పార్టీ నిర్ణయించింది. ఉన్నత నాయకత్వానికి, రేణుకకు సన్నిహితులైన కొందరు కామ్రేడ్స్‌కు తప్ప మరెవ్వరికీ ఇది తెలియదు.
కానీ వీరి వైవాహిక జీవితం రెండేళ్లు నిండకుండానే విషాదాంతంగా ముగిసింది. 1999 డిసెంబర్ 2న నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్‌లతో పాటు సంతోష్ అమరుడు కావడం ఆమెకు మరో పిడుగుపాటు. పెళ్లి రహస్యం కాబట్టి బయట ఎవ్వరితోనూ తన దుఃఖాన్ని కూడా పంచుకోలేని దయనీయ స్థితి ఆమెది. అయితే, కొద్ది కాలమే అయినా సంతోష్‌తో తన జీవితం అద్భుతంగా సాగిందని రేణుక చెప్పుకునేది. కథలు, నవలలు, సినిమాల నుంచి విప్లవాచరణ దాకా ఎన్నో అంశాల్లో వాళ్లిద్దరి అభిరుచులు, ఆసక్తులు కలిసేవి. ముఖ్యంగా తన కథలపై సంతోష్ చేసిన విమర్శలు, సూచనలు అన్నింటికన్నా విలువైనవని రేణుక ఆ తర్వాతి కాలంలో చాలా సార్లు ప్రస్తావించింది.

కొంతకాలానికి రేణుక కార్యరంగం విశాఖ నగరానికి మారింది. అక్కడ లాయర్‌గా ప్రాక్టీస్ కొనసాగిస్తూనే ప్రజాసంఘాల్లో క్రియాశీలంగా పని చేసింది. పేద బస్తీల్లో నివసించే మహిళలను కూడగట్టేందుకు కృషి చేసింది. విశాఖ నగర కమిటీ కార్యదర్శిగా ఉన్న అమరుడు కౌముది నాయకత్వంలో పని చేసిన రేణుక తన సాహిత్యకృషిని కూడా యథావిధిగా కొనసాగించింది. కౌముది అప్పటికే పేరుగాంచిన విప్లవ కవి. అందుకే, తమ మధ్య జరిగే సమావేశాల్లో ఉద్యమ సమస్యలపై జరిగే చర్చలతో సమానంగా కవిత్వం, కథల గురించి కూడా చర్చలు కూడా జరిగేవని రేణుక గుర్తు చేసుకునేది.

2003 చివరి నాటికి కౌముది బూటకపు ఎన్‌కౌంటర్‌కు బలికావడంతో రేణుక ఇక బహిరంగ జీవితం గడపలేని పరిస్థితి తలెత్తింది. పోలీసులు నిరంతరం వెంటాడుతూ, అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండటంతో వారి కన్ను గప్పేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది. చివరకు కొందరు విప్లవాభిమానులు ఎంతో సాహసోపేతంగా ఆమెను మహారాష్ట్రకు తరలించి అక్కడి పార్టీ నాయకత్వానికి రేణుకను అప్పగించారు. అక్కడి నుంచి ఒడిషా చేరుకున్న ఆమె బాంసధార డివిజన్‌లో ఉద్యమ బాధ్యతలు చేపట్టింది. త్వరలోనే ఒడియా భాష నేర్చుకొని ఆ భాషలో రాయడం కూడా నేర్చుకునే దిశగా అడుగులు వేసింది.

2005లో శాఖమూరి అప్పారావును ఆమె తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. ఇద్దరికీ ప్రత్యక్ష పరిచయం లేకున్నా పరోక్షంగా ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు. ఇద్దరూ తమ తమ వైవాహిక జీవితాల్లో సంక్షోభాలను అధిగమించిన వారే. అయితే, ఇద్దరి బాధ్యతలు, కార్యరంగాలు వేర్వేరు కాబట్టి చాలా అరుదుగానే వారిద్దరికి ఒకచోట గడిపే అవకాశం దొరికేది. 2010 మార్చి 12న శాఖమూరి ఎన్‌కౌంటర్ వార్త రేణుక జీవితంలో మరోసారి విషాదాన్ని నింపింది. కలిసి గడిపింది కొద్ది కాలమే అయినా ఆమెపై చెరగని ముద్ర వేసిన ప్రేమమూర్తి శాఖమూరి. అయితే, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా విప్లవాచరణలో ఏనాడూ వెనుకడుగెయ్యని రేణుక మరోవైపు సాహితీకృషిని అంతే పట్టుదలతో కొనసాగించింది.

2006లో పార్టీ ఆమెకు ‘క్రాంతి’ పత్రిక సంపాదక బాధ్యతలు అప్పగించింది. అలా ఆమె కార్యరంగం ఒడిషా నుంచి దండకారణ్యానికి మారింది. ఆనాటి నుంచి ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిర్జీవిగా ఇంద్రావతి నదికి దక్షిణం వైపున్న రోడ్డు మీదుగా ఆంబులెన్సులో ప్రయాణించి, గోదావరి నది దాటి తెలంగాణ సరిహద్దులోకి ప్రవేశించేంత వరకూ…. అంటే దాదాపు ఇరవయ్యేళ్ల పాటు దండకారణ్యం ఆమె చిరునామాగా నిలిచింది.
ఆమె సాహితీ కృషి గురించి చెప్పుకోవాలంటే… ‘భావుకత’తో మొదలై, ‘మెట్లమీద’, ‘ప్రవాహం’, ‘ఇద్దరు తల్లులు’, ‘అమ్మ కోసం’…. ఇలా మొత్తం ఆమె రాసిన కథలు 40 వరకు ఉండొచ్చని అంచనా. ‘మిడ్కో’ పేరుతో కథలు, ‘జమీన్’ పేరుతో కొన్ని కవితలు, ‘బిడి దమయంతి’ పేరుతో ఉద్యమ నివేదికలు, విశ్లేషణలు రాసింది. ఇంకా ‘నిర్మల’ అనే పేరుతో కూడా కొన్ని కథలు రాసింది. తర్వాతి కాలంలో ఆమె రాసిన వాటిలో ‘పచ్చని బతుకులపై నిప్పయి కురుస్తున్న రాజ్యం’, ‘మండుతున్న గాయాలు’, ‘విముక్తి బాటలో నారాయణపట్నా’, ‘దండకారణ్యంలో గ్రీన్ హంట్’ మొదలైనవి ముఖ్యమైనవి. మూసపోత భాషను, రొడ్డకొట్టుడు పదజాలాన్ని వాడకుండా, అనవసర అతిశయోక్తులు లేకుండా సూటిగా, సంక్షిప్తంగా, అర్థమయ్యేలా, పాఠకులను కదిలించేలా రాయడం రేణుక ప్రత్యేకత. అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడని ఆమె స్వభావం ఆమె రచనలో కూడా ప్రతిబింబించేది. తక్కువ మాట్లాడుతూ, ఎక్కువ పరిశీలించడం, ఏదైనా తప్పనిపిస్తే ఎలాంటి మొహమాటం, భయం లేకుండా చెప్పడం, అందరితో ఆప్యాయంగా, నిష్కల్మషంగా మాట్లాడే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేది.
మహిళా మార్గంతో మొదలై, విప్లవ పథం, క్రాంతి, ప్రభాత్, పోరు మహిళ, లడెమాయన మహిళ…. లాంటి ఎన్నో పత్రికలకు ఆమె సంపాదకత్వం వహించింది లేదా వాటి కోసం రాసిందని ఆమె సహచరులు గుర్తు చేసుకుంటారు. శారీరకంగా దుర్బలంగా కనిపించే రేణుక పనిలో అంతులేని పట్టుదలను, ఓపికను ప్రదర్శించేదని, పగలూ, రాత్రి తేడా లేకుండా కంప్యూటర్‌పై పని చేసేదని ఎందరో గుర్తు చేసుకుంటారు. ఒకవైపు పత్రికల నిర్వహణ పనులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నాయకత్వ బాధ్యతలు చూస్తూనే దొరికిన విరామ సమయాల్లో తోటి సహచరులకు ఉత్తరాలు రాస్తుండేది. ఆమె రాసే ఉత్తరాలను వారు అపురూపంగా దాచుకునేవారు. ఆమె వారిని పలకరించే తీరు, వారిపట్ల చూపే ఆప్యాయత, సమస్యలపై ఆమె చేసే విశ్లేషణ… వీటిని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఉద్యమం నుంచి బయటకు వెళ్లిపోయిన వారిలో కూడా కొందరు ఇప్పటికీ ఆమె ఉత్తరాలు దాచిపెట్టుకున్నారంటే ఆమె ఎలా వారిపై చెరగని ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు.
2014లో తన అన్న ఉద్యమం నుంచి బయటకు రావడం రేణుకను నిరాశపర్చింది. తన లొంగుబాటును ఆమె వ్యతిరేకించింది. తాను మాత్రం చివరి ఊపిరి ఉన్నంత వరకూ విప్లవపథాన్ని వీడనని తల్లిదండ్రులకు లేఖ రాసింది.

చివరగా… ఒక కమ్యూనిస్టు విప్లవకారిణిగా, రచయితగా, సంపాదకురాలిగా రేణుక చేసిన కృషినంతా కుటుంబంగా మేం సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. తెలుసుకోలేకపోవచ్చు. బహుశా ఎన్నటికీ తెలియను కూడా తెలియకపోవచ్చు. కానీ అంచెలంచలుగా ఎదుగుతూ, తాను నమ్మిన లక్ష్యం కోసం చివరి వరకూ పట్టుదలగా నిలబడ్డ రేణుక జీవితం మాకు ఎల్లప్పటికీ గర్వకారణంగా ఉంటుంది. శ్రమజీవుల కష్టాలు తొలగిపోవాలని, దోపిడీ పీడనలు లేని సమసమాజం రావాలని, మహిళలపై వివక్ష, అణిచివేతలు లేకుండా పోవాలని, కుల నిర్మూలన జరగాలని, కులహంకార దాడులు లేకుండా పోవాలని, మతతత్వం నశించాలని ఆమె కన్న కలలను నిజం చేయడం మనందరి కర్తవ్యం. దానికి ఆమె అమరత్వం మనకు ప్రేరణగా నిలవాలి. ఎందుకంటే… ఆమెది మామూలు చావు కాదు.. ఒక కథలో ఒక తల్లి సంభాషణగా రాసినట్టు, ‘ఊరి నడిమధ్యన గోరీ అయి నిలిచే అసోంటి సావు!’

– రేణుక కుటుంబ సభ్యులు

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad