2014 నుండి 2023 దాకా అమెరికాలోని సియాటెల్ నగర కౌన్సిల్ మెంబర్ గా ఉన్న క్షమా సావంత్ కు ఇండియా రావడానికి మోడీ సర్కార్ వీసా నిరాకరించింది. ఇండియాలోని బెంగుళూరులో ఉన్న క్షమా సావంత్ తల్లి వసుంధర రామానుజం తీవ్ర అనారోగ్యంతో ఉండటం వల్ల ఆమెను చూడడానికి సావంత్ గత సంవత్సరం మే నెల నుండి వీసా కోసం అప్లై చేస్తూనే ఉన్నారు. అయితే ప్రతీ సారి కారణం ఏమీ చెప్పకుండానే ప్రభుత్వం వీసా తిరస్కరిస్తూ వస్తున్నది.
క్షమా సావంత్ వీసాను మోడీ సర్కార్ తిరస్కరించడానికి అసలు కారణం…. ఆమె రైట్ వింగ్ విధానాలకు బద్ద వ్యతిరేకి. ఇండియా నుంచి వెళ్ళిన కొందరు అగ్రకుల దురహంకారులు అమెరికాలో కూడా తమ దేశం నుండే వచ్చిన ఇతర కులాలకు చెందిన వ్యక్తుల పట్ల వివక్ష చూపించడాన్ని ఆమె వ్యతిరేకించింది. సియాటెల్ నగరంలో కుల వివక్షను నిషేధిస్తూ సియోటెల్ నగర కౌన్సిల్ తీర్మానం చేయడంలో కూడా సావంత్ ప్రధాన పాత్ర పోషించింది. రిపబ్లికన్, డెమాక్రటిక్ పార్టీల విధానాలను వ్యతిరేకించే సోషలిస్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ సభ్యురాలుగా ఉండిన సావంత్ మోడి సర్కార్ తీసుకవచ్చిన CAA-NRC లను కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ లో రెండేళ్ళ పాటు రైతాంగం చేసిన ఉద్యమానికి సావంత్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ప్రస్తుతం క్షమా సావంత్ సోషలిస్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ కి రాజీనామా చేసి రివల్యూషనరీ వర్కర్స్ పార్టీని స్థాపించి అమెరికాలోని పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో క్షమా సావంత్ పట్ల మోడీ సర్కార్ గుర్రుగా ఉంది. అందుకే రెండేళ్ళుగా అనారోగ్యంతో ఉన్న 82 ఏళ్ళ వృద్దురాలైన తల్లిని చూడడానికి కూడా ఆమెను మోడీ సర్కార్ ఇండియాకు రానివ్వడం లేదు.
ఈ సందర్భంగా క్షమా సావంత్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు…
భారత ప్రధాని మోడీ, బిజెపి ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న నా తల్లిని చూడటానికి నాకు వీసా నిరాకరిస్తున్నారు.
నా ఒక్కదానికే కాదు. అనేక మంది సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులను మోడీ భారత్ కు రానివ్వకుండా మా పై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.
నా సోషలిస్ట్ సియాటిల్ నగర కౌన్సిల్ కార్యాలయం భారతదేశపు రైట్ వింగ్, కార్మిక వ్యతిరేక, ముస్లిం వ్యతిరేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన రైట్ వింగ్ జాతీయవాద బిజెపి పార్టీకి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది.
మోడీ , బిజెపి ప్రభుత్వం భారతదేశంలోని కార్మికులు, రైతులు, ముస్లింలు ఇతర అణగారిన వర్గాలపై నిరంతర దాడులకు దిగాయి, వీటిలో లక్షలాది మందికి పౌరసత్వాన్ని నిరాకరించిన ముస్లిం వ్యతిరేక, పేద వ్యతిరేక CAA-NRC చట్టం కూడా ఉంది.
కార్మిక ప్రజలు , నా కార్యాలయం CAA-NRCని ఖండిస్తూ మొదటి సారి అమెరికాలో తీర్మానాన్ని ఆమోదించాయి. మేము అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ నుండి మాత్రమే కాకుండా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ నుండి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాము. అది బహిరంగంగా మమ్మల్ని వ్యతిరేకించింది. మోడీ క్రూరమైన, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశంలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా మేము ఒక తీర్మానాన్ని కూడా చేయగలిగాము. సియాటిల్ డెమోక్రాట్లు, విశ్వ హిందూ పరిషత్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ వంటి మితవాద, మోడీ అనుకూల సమూహాల వ్యతిరేకత ఉన్నప్పటికీ, దక్షిణాసియా వెలుపల మొదటిసారిగా కుల ఆధారిత వివక్షపై చారిత్రాత్మక నగరవ్యాప్త నిషేధాన్ని కూడా మేము అమలు చేయగలిగాము.
డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన వాగ్దానం చేసిన సామూహిక బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు, వాటిలో పని ప్రదేశాల్లో దాడులు కూడా ఉన్నాయి. అమెరికాలో వలస కార్మికులపై డెమొక్రాట్లు ,రిపబ్లికన్లు ఇద్దరూ నిర్వహిస్తున్న దాడులు పెరుగుతూనే ఉన్నాయి.
అంతర్జాతీయంగా శ్రామిక ప్రజలు, వామపక్షాలు, రైట్ వింగ్, బిలియనీర్ తరగతికి వ్యతిరేకంగా గొంతెత్తాలి. వలసదారులు, కార్యకర్తలు , ఉద్యమాలపై వారి అణచివేత , దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి. మోడీ, బిజెపి, ట్రంప్, రిపబ్లికన్లు, డెమొక్రాట్లతో సహా అన్ని పెట్టుబడిదారీ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలి.
#visadenial #humanrights #travelbans @cmkshama pic.twitter.com/AC9NJ6HHoa
— Gita (@GitaSunilPillai) February 2, 2025