‘పోయి వస్తాం ʹ
శ్రీకాకుళం సెట్ బ్యాక్ నుంచి తేరుకున్న
జగిత్యాల
దేశమంతా తానై
విరిగిన పిల్లనగ్రోవి నుంచీ
గెరాల్లా స్థావరాల
పోరాట గానాన్ని వినిపిస్తున్నది
కొత్త గట్టు నుంచి మెట్టు మెట్టుగా
ఆంధ్ర దండకారణ్య బీహార్ లను
తన ప్రవాహ చొరవతో నిర్మించిన
మానేరు
నాగేటి చాళ్లలో
గంగా కావేరులై ప్రవహిస్తున్నది
చుట్టూ వాగే కాని
చూపులో దిగంతాలు నింపుకున్న
తెలంగాణ కడివెండి
క్షితిజరేఖలా స్థిరంగా
వీడ్కోలు కాదు
ప్రజావీరులకు స్వాగతం పలుకుతున్నది
వరవరరావు
డిసెంబర్ 2 , 1999
భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ నెత్తుటి జ్ఞాపకం ఈ రోజు…. భారత విప్లవ నాయకులు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ విప్లవోద్యమానికి నాయకత్వం వహించడమే కాక భారత దేశంలో అనేక ముక్కలుగా ఉన్న అనేక విప్లవ గ్రూపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన గొప్ప విప్లవ కారులు… కామ్రేడ్ నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్, శీలం నరేష్ లు అమరులైన రోజు ఇది. 1999 డిశంబర్ 1 వతేదీన ఈ ముగ్గురిని బెంగళూరులో పట్టుకొని చిత్ర హింసలు పెట్టి చంపి హెలీకాప్టర్ లో తీసుకొచ్చి కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవుల్లో పడేశారు.

నల్లా ఆది రెడ్డి మొదటి తరం విప్లవ నాయకుడు. 1969 లో సాగిన ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మల్లోజుల కోటేశ్వర్ రావు (కిషన్ జీ), మరికొంత మంది సహచరులతో కలిసి పాల్గొన్న వాడు, నాయకత్వం వహించిన వాడు. పీపుల్స్ వార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన వాడు. ఎటువంటి సమస్యకైనా అత్యంత నైపుణ్యంతో పరిష్కారం చూయించగల దిట్ట అని పేరున్న వాడు. ఒక సారి అరెస్టయ్యి ఆదిలాబాద్ జైల్లో ఉన్నప్పుడు తనతో పాటే జైల్లో ఉన్న మరో సహచరుడి తో కలిసి చాక చక్యంగా తప్పించుకున్నాడు.
ముగ్గురు కూడా సున్నిత మనస్కులు. పోరాటంలో మాత్రం కసిగా పాల్గొనే వాళ్ళు. దేశంలోని అనేక విప్లవ గ్రూపులను ఒక్క తాటి పైకి తెచ్చేందుకు వాళ్ళు చేసిన కృషి అమోఘమైనదని , వాళ్ళు చనిపోవటం భారత విప్లవోధ్యమానికి తీరని లోటని అప్పటి పీపుల్స్ వార్ ప్రకటించింది. ప్రజల రక్షణకోసం, పార్టీ ఆత్మరక్షణ కోసం సైన్యం అవసరం ఉందని భావించిన పీపుల్స్ వార్ పార్టీ ఆ ముగ్గురు విప్లవకారుల వర్ధంతి సందర్భంగా 2000 డిశంబర్ 2 వ తేదీన పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ( పీజీఏ ) ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ప్రతి యేడు డిశంబర్ 2 వ తేదీ నుండి వారం రోజుల పాటు వారోత్సవాలను నిర్వహిస్తోంది. 2004 సెప్టంబర్ 21 న దేశంలోనే అతి పెద్ద రెండు విప్లవ పార్టీలైన సీపీఐఎంఎల్ పీపుల్స్ వార్, ఎంసీసీఐ లు ఐక్యమై సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన సందర్భంగా పీజీఏ ను పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్ జీఏ) గా మార్చారు.
