గాంధేయవాది, ప్రముఖ సామాజిక కార్యకర్త హిమేష్ కుమార్ ఫేస్ బుక్ టైంలైన్ నుంచి….
నేను నా ఫోన్లో ఈ సందేశాన్ని టైప్ చేస్తున్న సమయంలో, భారత ప్రభుత్వ భద్రతా దళాలు భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలోని ఆదివాసీ గ్రామంపై రాకెట్లతో దాడి చేస్తున్నాయి.
నవంబరు 13వ తేదీ తెల్లవారుజామున 2:00 గంటలకు ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి గ్రామంలో వందలాది మంది సైనికులను తీసుకొచ్చి నూతన సైనిక శిబిరాన్ని ప్రారంభించారు.
క్యాంపును ప్రారంభించిన వెంటనే, సైనికులు రాకెట్ లాంచర్లను వేయడం ప్రారంభించారు.
ఆదివాసులు తమ వరి పంటను కోయడానికి, కోసిన పంటను నూర్పిడి చేయడానికి, పొలంలో పోగు చేసిన వరిని ఇంటికి తీసుకురావడానికి అనుమతించడం లేదు. ఆరోగ్యం బాగులేని ఆదివాసులను ఆస్పత్రికి తరలించేందుకు కూడా అనుమతించడం లేదు.
మూల్వాసీ బచావో సంఘటన్ ప్రాంతీయ సమన్వయకర్త రఘు మిడియామి ఈ ఉదయం నాకు ఫోన్లో ఇదంతా చెబుతున్న సమయంలో కూడా సైనికులు విసిరిన రాకెట్ల పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో, బస్తర్ మానవ హక్కుల కార్యకర్త సోనీ సోరీ కూడా ఈ సంభాషణలో పాల్గొన్నారు.
మొత్తం ఘటనాక్రమం గురించి సమాచారం ఇస్తూ, రఘు, సోని , 8వ తేదీన, సుక్మా, బీజాపూర్, దంతెవాడలకు చెందిన పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు తెల్లవారుజామున 4:00 గంటలకు ఉసూర్ బ్లాక్లోని 15 గ్రామాలను చుట్టుముట్టి 52 మంది ఆదివాసులను పట్టుకుని గుండం క్యాంపుకు తీసుకువెళ్ళినట్లు చెప్పారు.
వీరిలో 33 మందిని రెండు రోజుల తర్వాత 10వ తేదీన విడుదల చేశారు. మూల్వాసి బచావో మంచ్కు చెందిన 7 గురు ఆదివాసీ యువకులను తప్పుడు కేసులో జైలులో పెట్టారు.12 మంది ఆదివాసులు ఇప్పటికీ బీజాపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారిలో ఐదుగురు మహిళలు. అరెస్టు అయిన తమ వాళ్ళను కలిసేందుకు వస్తున్న కుటుంబసభ్యులను బీజాపూర్కు రానివ్వకుండా మార్గమధ్యంలో ఉసూరు, అవపల్లి క్యాంపుల సైనికులు అడ్డుకున్నారు.
నవంబర్ 8న ఉదయం 7:00 గంటలకు తన పొలంలో వరి నూర్పిడి చేస్తున్న రేకాపల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆదివాసీ రైతు కుంజం జోగాను భద్రతా బలగాలు కాల్చి చంపాయి.
ఆదివాసుల ఇళ్లను సైతం ధ్వంసం చేయడంతోపాటు తమ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో ఇళ్లను కూలగొట్టారు. ఆదివాసుల ఇళ్లలో సైనికులు 35,000 రూపాయలు దోచుకున్నారు. మహిళల చీరలు విప్పి సోదాలు చేశారు. మిగతా మహిళలు తమకు పెళ్లయిందని, తాము ఈ ఊరి వాళ్ళమేనని చెప్పడంతో సైనికులు పెళ్లి చేసుకున్నారో లేదో మీ బట్టలు విప్పి చూపించండి అన్నారు. దీనిపై ఆదివాసీ మహిళలు అభ్యంతరం తెలుపుతూ సైనికులతో వాగ్వాదానికి దిగారు.
సైనికులు ఆదివాసులను పట్టుకుని తీసుకెళ్తూ, గ్రామస్థులపైకి రాళ్లు కూడా రువ్వారు. ఆదివాసులపై భద్రతా బలగాలు అనుసరిస్తున్న కొత్త పద్ధతి ఇది. ఆదివాసులు తమ కుటుంబ సభ్యులను విడిపించేందుకు తమ వెంట రాకూడదని వాళ్ళను రాళ్లతో కొట్టారు.
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి