ఇప్పుడు దేశంలో కలమెక్కడుందని, అంటరానితనం లేనే లేదని, కుల వివక్ష, కుల అణిచివేత అనేది హిందూమతాన్ని నాశనం చేయడం కోసం కమ్యూనిస్టులు, హిందూ వ్యతిరేకులు చేస్తున్న కుట్రపూరిత ప్రచారమని ధీర్ఘాలు తీస్తుంటారు కొందరు. ఆ ధీర్ఘ రాయుళ్ళు చదవాల్సిన వార్త ఇది.
కర్నాటక మండ్యలోని హనకరే అనే గ్రామంలో ఉన్న ‘కాలభైరవేశ్వర’ ఆలయంలోకి తరతరాలుగా దళితులకు ప్రవేశం ఇవ్వలేదు అగ్రకులాలు. మూడేళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న పాత కట్టడాన్ని కూల్చివేసి కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ మందిరం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. కాగా, ఈ ఆలయంలోకి తమనూ రానివ్వాలని స్థానిక దళితులు చాలా కాలంగా కోరుతున్నారు. ఈ కొత్త ఆలయంలోకి తమను రానివ్వాలని దళితులు అగ్రకులాలవారైన ఒక్కలిగలను కోరారు. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అధికారులను ఆశ్రయించారు. ఈ విషయంపై అధికారులు అనేకసార్లు అగ్రకులాల వారితో అనేక సార్లు జరిపారు. అగ్రకులస్తులు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో చివరకు అధికారులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆదివారంనాడు దగ్గరుండి దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. దీంతో ఆగ్రహం చెందిన ఒక్కలిగ కులస్తులు ఆలయంలోని కాలభైరవేశ్వర విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. వందలాది మంది అగ్రకులస్తుల గుంపు విగ్రహాన్ని ఎత్తుకెళ్తూ ఉంటే , దళితులు ఆలయంలోకి వెళ్ళగలరేమో కానీ దేవుణ్ణి మాత్రం దర్శించుకోనివ్వబోమని హెచ్చరికలు జారీ చేసినా,రు. “వాళ్ళు గుడి ఉంచుకోనివ్వండి, మేము మాతో పాటు దేవతను తీసుకెళ్తాము” అని బహిరంగంగా ప్రకటించినా అధికార యంత్రాంగం ఏం చేయలేకపోయింది.
ఇప్పుడు ఆ వూరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రకులస్తులు ఎప్పుడు ఏం చేస్తారో అని దళితులు వణికిపోతున్నారు. వందలాది మంది అగ్రకులస్తులు ఊరేగింపుగా వచ్చి విగ్రహాన్ని తీసుకెళ్తేనే ఏం చేయలేని అధికారులు ఒకవేళ తమపై దాడి జరిగితే రక్షించగలరా అని భయపడుతున్నారు.
ఎక్కడో ఓ చోట కొందరుంటారు. అందరినీ అదే గాటన కట్టేస్తే ఎలా అని మళ్ళీ ధీర్ఘాలు తీయకండి. ఈ దేశంలో ప్రతీ ఊరు, ప్రతీ గల్లీ ఆ దేవుని విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిన ‘ఒక్కలిగలే’ నిండి ఉన్నారు. కులాల పేర్లు వేరు కావచ్చు కానీ ఇప్పటికీ దేశాన్ని రాజ్యాంగం కన్నా మతమూ, కులమే నడిపిస్తున్నాయి.