ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మరో ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ లో భాగంగా అర్ద సైనిక బలగాలు చత్తీస్ గడ్ గ్రామాలపై దాడులు తీవ్రం చేశారు. అనేక మంది ఆదివాసులను ఇళ్ళలోంచి పట్టుకెళ్ళి కాల్చి చంపుతున్నారని హక్కుల సంఘాల ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఈ ఆరు మరణాలు జరిగాయి. అర్ద సైనిక బలగాల దాడులలో ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 123 మంది మావోయిస్టులు, సాధారణ ప్రజలు మరణించారు.
ఇక శుక్రవారం జరిగిందని పోలీసులు చెప్తున్న ఎన్ కౌంటర్ కథనం ప్రకారం,తూర్పు బస్తర్ డివిజన్లోని ముంగోడి, గోబెల్, గుబం, అదెర్బెడ, వట్టేకల్, ఛోటాతోన్బెడ గ్రామాల్లో పీఎల్జీఏ సభ్యులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు శుక్రవారం ఎన్కౌంటర్ను ప్రారంభించాయి. నాలుగు జిల్లాలకు చెందిన రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ సిబ్బంది, ITBP , CRPF ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భట్బెడ-బట్టేకల్ మరియు ఛోటెతోన్బెడ అడవుల్లోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దాంతో భద్రతా బలగాలు కాల్పులు జరపగా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని, ముగ్గురు జవాన్లు గాయపడ్డారని పోలీసులు చెప్పారు.