Menu

శాంతి కపోతాల వేట!

anadmin 5 days ago 0 214

పచ్చని అడవి నెత్తురోడుతోంది. చెట్టు చెట్టుకూ తూటాల గాయాలు… గుట్ట గుట్టకూ ఎర్రెర్రటి జ్ఞాపకాలు. పదునెక్కుతున్న పోరాటాన్ని చూస్తూ పరవ్వలుదొక్కిన నదులు ఇప్పుడు కన్నీరెడుతున్నాయి. నది కన్నీళ్లు నగరానికి, నాగరిక సమాజానికి కనిపించకపోవచ్చు. కానీ… అక్కడ రాలుతుంది నిలువెత్తు మనుషులు. ఇప్పపూలు రాలినట్లు మనుషులు రాలిపోతున్నారు. శాంతి కపోతాల్లాంటి మనుషులు వాళ్లు. సామాన్యుడి కోసం సాయుధమైన వాళ్లు. అడవి ఒడిలో ఇప్పుడు ఒక్కొక్కరూ ఒరిగిపోతున్నారు.

ఇంతకూ ఎవరు వాళ్లు? ఒక మనిషిపై మరో మనిషి పెత్తనం ఉండకూడదనుకున్న వాళ్లు. పసిపిల్లల నవ్వులాంటి ప్రపంచాన్ని కలగన్న వాళ్లు. ఆ నవ్వుల కోసం నవ యవ్వనాన్ని, మొత్తం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైనవాళ్లు. ఆ సాహసికుల తలలకు వెలలు కట్టిన సర్కారు దండకారణ్యంలో నెత్తురు పారిస్తోంది. ఇదీ… ప్రజలపై ప్రభుత్వాలు చేస్తున్న ప్రత్యక్ష యుద్ధం. అంతరాలు లేని సమాజాన్ని కలలుగంటున్న అన్నలు దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పు అంటోంది రాజ్యం. దోపిడీ వ్యవస్థను కాపాడేందుకు ప్రణాళికాబద్ధమైన హింసను అమలు చేస్తోంది.

దండకారణ్యంలోకి విప్లవోద్యమం ప్రవేశించిన నాలుగున్నర దశాబ్దాలు గడిచిపోయింది. ఈ నలబై ఏళ్ల ప్రస్తానంలో విప్లవోద్యమం ఊహించని స్థాయికి ఎదిగింది. ఒంటినిండా వస్త్రాలు కూడా లేని ఆదివాసీలు విప్లవోద్యమంలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. ప్రత్యామ్నాయ ప్రజా ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో నాయకత్వం వహిస్తున్నారు. ఇదే భారత పాలకవర్గాల్లో కలవరానికి కారణమైంది. ఆ కలవరమే…. ఆపరేషన్ కగార్‌కు మూలమైంది. సాల్వాజుడుంలాంటి ప్రతిఘాతుక సాయుధ ముఠాల ఏర్పాటుతో మొదలై ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌, ఆపరేషన్‌ ప్రహార్‌, ఆపరేషన్‌ సమాధాన్‌ అంటూ ఎన్నో యుద్ధవ్యూహాలను అమలు చేసింది ప్రభుత్వం. గడిచిన రెండున్నర దశాబ్దాల్లో విప్లవోద్యమం ఈ దాడులన్నిటినీ ఎదుర్కొని నిలబడింది. ప్రజలను, ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకుంది. అందుకే… ఇప్పుడు కగార్‌ పేరుతో సామూహిక హననానికి తెరలేపింది సర్కారు. అడవిని ధ్వంసం చేసి అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు లక్షల కోట్లు వెచ్చించి సర్కారు చేస్తున్న నెత్తుటి యజ్ఞం ఇది.

ఈ యుద్ధ వాతావరణం ఆదివాసీ సమాజానికి ముప్పుగా పరిణమించింది. ఈ మారణహోమాన్ని ఆపేందుకు… ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకు మావోయిస్టు పార్టీ సంసిద్ధతను వ్యక్తం చేసినా… ప్రభుత్వం మాత్రం అడవిపై ఆధిపత్యం కోసం అత్యాధునిక ఆయుధాలను ఎగదోస్తోంది. లక్షలాది మంది భద్రతా బలగాలను మోహరించి ఈ దేశ ప్రజలపై జరుపుతున్న యుద్ధంలో వందలాది మంది ఆదివాసీలు, విప్లవకారులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఇంత జరుగుతున్నా ఇంకా… శాంతి చర్చల ప్రస్తావన ఏంటి అనే వాదన ముందుకు వస్తోంది. భద్రతాబలగాల దాడిని ఎదుర్కోలేకే… మావోయిస్టులు చర్చల పేరుతో నాటకాలాడుతున్నారని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.

నిజానికి విప్లవోద్యమం లేవనెత్తుతున్న ప్రశ్నలకు పరిష్కారాలు వెతకడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే… చర్చలకు ముందుకు వచ్చేవి. కానీ… ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా లేమని చెప్పకనే చెబుతూ మానవహననానికి పాల్పడుతున్నాయి. దీంతో భద్రతాబలగాల చుట్టివేత, ఉద్యమ నిర్మూలన కార్యక్రమం విప్లవోద్యమం భారీ నష్టాలు చవిచూడడానికి కారణమవుతోంది. కానీ.. ఇవేవీ మావోయిస్టు పార్టీ ఊహించనివి కావు. త్యాగాలకు సిద్ధపడి సాయుధమార్గాన్ని ఎంచుకున్న వాళ్లు… రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోలేదని కాదు. కానీ… ప్రజల్ని, ప్రజా ఉద్యమాన్ని కాపాడుకోవడానికి అవసరమైనప్పుడు సంయమనం పాటించాలి. శత్రువు బలాన్ని అంచనావేసి…. అందుకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌ కగార్‌ లక్ష్యం విప్లవోద్యమ నిర్మూలనే అని చెబుతున్నా ఆదివాసీ సమాజాన్ని అడవికి దూరం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి సందర్భంలో పౌర సమాజం కోరుతున్నట్లు ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెనకడుగు వేయకూడదనే అవగాహనతో మావోయిస్టు పార్టీ చర్చలకు ముందుకు ముందుకు వచ్చింది.

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ చర్చలు జరిపింది. అప్పటి అనుభవాలు కూడా పార్టీ ఎరుకలో లేకపోలేదు. మావోయిస్టు పార్టీ అప్పుడే చర్చల పట్ల తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చర్చల ప్రక్రియను తాము రాజకీయ పోరాటంగా భావిస్తున్నామని ప్రకటించారు. ప్రజలకు కొంతైనా మేలు జరుగుతుందని ఆశించి ప్రభుత్వంతో చర్చించేందు వచ్చామన్నారు. అయితే.. “చివరకెలాగూ పోరాటమే….” అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

దళితుల సాన్నిహిత్యంతోనే విప్లవ పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, వారికి ప్రాంతాల వారీ రాజ్యాధికారం ఇప్పించడమే తమ ప్రధాన లక్ష్యమని రామకృష్ణ స్పష్టం చేశారు. రాజ్యాధికారం రావాలంటే వ్యవస్థలో సమగ్రమైన మార్పు రావాలని, అది దోసెడు రక్తం ధారపోయకుందే సాధ్యంకాదని బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రధానంగా భూమిలేని నిరుపేదలకు భూమి పంపిణీ చేయడంపై అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంతో లోతుగా చర్చించారు మావోయిస్టు నేతలు. ఒక్కో కుటుంబానికి మూడెకరాలు భూమిని మహిళల పేరుపై ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది కూడా. అందుకోసం మిగులు భూమిని గుర్తించేందుకు భూ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇవి మాత్రమే కాదు… చివరకు పోలీసుల జీతభత్యాల పెంపును కూడా నక్సల్స్‌ నేతలు ప్రస్తావించారు.

అయితే, ముందే చెప్పినట్లు చర్చలను రాజకీయపోరాటంలో భాగంగానే చూశారు మావోయిస్టులు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని బట్టబయలు చేయడం కూడా చర్చలకు సిద్ధమవ్వడంలోని ఉద్దేశం. అలాగే… అంతిమంగా ప్రజల చేతికి రాజ్యాధికారం రావడం ఎలా అనే విషయం పట్ల కూడా విప్లవోద్యమానికి స్పష్టత ఉంది.

కాంగ్రెస్‌ పార్టీ నక్సలైట్లతో చర్చల అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం, పౌర సమాజం నుంచి ఒత్తిడి రావడంతో 2004లో చర్చలు సాధ్యమయ్యాయి. అలా 2004 అక్టోబర్‌ 11న పీపుల్స్‌వార్‌ అప్పటి ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఓబి కార్యదర్శిగా సుధాకర్‌, ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గణేశ్‌తో పాటు జనశక్తి రాష్ట్ర కార్యదర్శి అమర్‌, రాష్ట్రకమిటీ సభ్యుడు రియాజ్‌ నల్లమల నుంచి మైదానంలోకి వచ్చారు. అక్టోబర్‌ 15 నుంచి 18 వరకు నక్సలైట్‌ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు దోహదపడతాయనే నమ్మకం లేకపోయినా… శాంతి కోసం తాము ఎప్పుడూ సిద్ధమే అని ప్రకటించారు మావోయిస్టు నేతలు రామకృష్ణ, సుధాకర్, గణేశ్. ఆరోజు ప్రభుత్వంతో నేరుగా ప్రజా సమస్యలపై చర్చించిన నక్సలైట్ నాయకుల్లో ముగ్గురు నేతలు ఇప్పుడు లేరు.

జనశక్తి పార్టీ తరుఫున చర్చల్లో పాల్గొన్న రియాజ్‌ 2005 జూన్‌ 31న కరీంనగర్‌ జిల్లా బదన్‌కల్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. శాంతి చర్చల ప్రతినిధిని చంపడంపై అప్పట్లో రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. అప్పట్లో కాంగ్రెస్‌ మిత్రపక్షంగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్‌ఎస్‌ రియాజ్‌ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తిరుగుబాటు తెరతీసింది. మంత్రివర్గం నుంచి బీఆర్‌ఎస్‌ వైదొలిగింది. రియాజ్‌ ఎన్‌కౌంటర్‌తో రెండవ దశ చర్చల అంశం సమసిపోయింది.

శాంతి చర్చల్లో కీలకంగా వ్యవహరించి మావోయిస్టు పార్టీ అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 2021లో అనారోగ్యంతో దండకారణ్యంలో మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యం మెరుగైన వైద్యం అందించే అవకాశం లేకపోవడంతో ఆయన అడవిలోనే తుదిశ్వాస విడిచారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో మరో చర్చల ప్రతినిధి సుధాకర్‌ మృతి చెందాడు. మొత్తంగా శాంతి కోసం ఆయుధాన్ని అడివిలో వదిలి సర్కారు ముందుకు వచ్చిన ముగ్గురు అగ్రనేతలు అమరులయ్యారు. కార్పొరేట్‌ కంపెనీల, పెట్టుబడిదారుల తరుపున వేటగాడి అవతారమెత్తిన భారత సర్కారు ఇప్పుడు శాంతి కపోతాల్ని వేటాడుతోంది.

రామకృష్ణ, సుధాకర్‌, రియాజ్‌ శాంతిని స్వప్నించిన వాళ్లు. కోట్లాది మంది కలల్ని నిజం చేసేందుకు నిలువునా తపించిన వాళ్లు. వాళ్లే కాదు… దోపిడీ పీడనలేని సమాజం కోసం సాయుధమార్గాన్ని ఎంచుకున్నవాళ్లంతా శాంతి కోసమే యుద్ధమని నమ్మిన వాళ్లు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అలాంటి నూతన మానవుల వేట కొనసాగుతోంది ఇవాళ. దోపిడీ శక్తుల నెత్తుటి దాహాం పచ్చని అడవిని వశం చేసుకోవచ్చు. కానీ… విప్లవకారుల త్యాగాలు ఎన్నటికీ వృథాకావు. పెట్టుబడికి దాసోహమైన పాలకవర్గ అణచివేత విధానాలపై అంతిమంగా ప్రజలే విజయం సాధిస్తారు.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad