మే 21, 2025న, భారత సైన్యం, పారామిలిటరీ దళాలు, కమాండో యూనిట్లు 28 మంది CPI (మావోయిస్ట్) యోధులను ఊచకోత కోశాయి. భారతదేశంలోని ఛత్తీస్గఢ్-అబుజ్మడ్ ప్రాంతంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సహా 28 మంది మావోయిస్టు యోధుల ఊచకోత తర్వాత, ఆ పోరాట యోధులను స్మరించుకుంటూ, అంతర్జాతీయ విప్లవ శక్తులు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) తో సంఘీభావంగా నిలబడాలని పిలుపునిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాయి.
వారు తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన సందేశంలో, “త్వరలో ప్రతీఘాతక విప్లవ కోటలు చుట్టుముట్టబడటం, ఫాసిజం యొక్క రాజభవనాలు ఖచ్చితంగా నాశనం చేయబడటం ఖాయం” అని అన్నారు.
Maoist Communist Party of Turkey – the Halk Kurtuluş Ordusu (People’s Liberation Army) (MKP-HKO)
యోధులు ప్రచురించిన సందేశం ఈ క్రింది విధంగా ఉంది;
“….. ప్రియమైన సహచరులారా;
మే 21న, భారతదేశంలో కామ్రేడ్ బసవరాజ్తో సహా అమరులైన 27 మంది మావోయిస్టు గెరిల్లాలను, మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యోధుల తరపున గౌరవపూర్వకంగా స్మరించుకుంటున్నాము; ఆ యోధుల పోరాటానికి మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కామ్రేడ్ బసవరాజ్ అమరత్వంతో విలువైన నాయకుడిని కోల్పోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టుకు, ప్రపంచ అంతర్జాతీయ శ్రామికవర్గం, అణగారిన ప్రజలకు, మార్క్సిజం-లెనినిజం-మావోయిజం ద్వారా నడిపించబడిన ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి మా సంతాపం తెలియజేస్తున్నాము.
కామ్రేడ్ బసవరాజ్ సహా మరో 27 మంది మావోయిస్టు గెరిల్లాల ఊచకోత భారతీయ మావోయిస్టులను మాత్రమే కాకుండా, మనతో సహా మొత్తం అంతర్జాతీయ శ్రామికవర్గాన్ని కూడా తీవ్రంగా బాధపెట్టిందని మాకు ఖచ్చితంగా తెలుసు. విప్లవ పోరాట అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన, భారతదేశ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధ జెండాను ఎగురవేసిన కామ్రేడ్ బసవరాజ్, ఆయన తన నాయకత్వంలో రూపొందించిన మావోయిస్టు పంథాపై పట్టుదల, విప్లవ సిద్ధాంతం, వర్గ పోరాటంలో ఆయన పాత్ర, ఆచరణాత్మక కృషి మరువలేనివి. ఆయన 50 సంవత్సరాల పోరాట ఆచరణతో, యుద్ధాన్ని నడిపించిన విప్లవ మిలిటెంట్ పంథాతో గుర్తుండిపోతారు.
ఈ దాడులు కామ్రేడ్ బసరవాజ్ను చంపడానికి మాత్రమే జరగలేదు, లేదా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)ని అంతం చేయడానికి మాత్రమే కాదు. ఈ దాడులు వాస్తవానికి సాయుధపోరాట మార్గంలో నడుస్తున్న ప్రపంచంలోని అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన దాడులు.
ప్రియమైన సహచరులారా;
ఫాసిస్ట్ భారత రాజ్యం తమ విజయం అని గొప్పలు చెప్పుకుకుంటున్నఈ సైన్యపు దాడిలో మావోయిస్టు యోధుల ప్రతిఘటన, సైన్యంతో రోజుల తరబడి సాగించిన ప్రతిఘటన అసాధారణమైనది. 20 వేల మందితో కూడిన ఫాసిస్ట్ సైన్యానికి వ్యతిరేకంగా 35 మంది 60 గంటల పాటు చేసిన వీరోచిత యుద్దం… ఈ ఇతిహాస ఉదాహరణ సాయుధ పోరాట యుగం ముగిసిందని చెప్పే వారికి అత్యంత తాజా సమాధానం.
మాడ్ అడవులలో ఓడించబడినది మోడీ ఫాసిజం; అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది మరణం కాదు, ప్రతిఘటన. రాజ్యం నిర్మించిన లొంగుబాటు గొలుసును మావోయిస్టు యోధులు తమ వీరోచిత పోరాటంతో విచ్చిన్నం చేశారు. ద్రోహం దాని స్వంత మురికి రక్తంలో మునిగిపోయింది. ఇది ఖచ్చితంగా; త్వరలో, ప్రతీఘాత-విప్లవ కోటలు చుట్టుముట్టబడతాయి. ఫాసిజం రాజభవనాలు ఖచ్చితంగా నాశనం చేయబడతాయి. కామ్రేడ్ బసవరాజ్ చెప్పినట్లుగా, “తుది విజయం ప్రజలదే అవుతుంది.”
ఇక్కడి నుండి, మేము అంతర్జాతీయ శక్తులను, ప్రధానంగా మావోయిస్టు పార్టీలు, సంస్థలకు పిలుపునిస్తున్నాము. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్)తో సంఘీభావం పెంచుకోవడం ప్రపంచ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తక్షణం చేయాల్సిన పని.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు)కు మేము అండగా నిలుస్తున్నామని మరోసారి ప్రకటిస్తున్నాము. భారత మావోయిస్ట్ పార్టీతో మేము సంఘీభావాన్ని పెంచుకుంటామని మా వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాము.
మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వర్థిల్లాలి!
అంతర్జాతీయ సంఘీభావం వర్ధిల్లాలి!
కామ్రేడ్ బసవరాజ్ అమర్ రహే!
ప్రజా యోధులు అమరులు!……”