దండకారణ్యం నుంచీ, ప్రత్యేకంగా బస్తర్ ప్రాంతం నుంచీ సమాచారం కోసం కొంత ఆధారపడదగిన వేదిక బస్తర్ టాకీస్ యూట్యూబ్ చానల్. కొన్నిసార్లు తటస్థంగా, ఎక్కువసార్లు పోలీసుల వైపు మొగ్గు చూపుతూ ఉండే వికాస్ తివారీ రిపోర్టింగ్ నుంచి ఆయన అభిప్రాయాలనూ, మొగ్గునూ పక్కనపెట్టి అక్కడి వాస్తవ సమాచారం గ్రహించవచ్చు. గుండె కోట్ మారణకాండ తర్వాత వారం రోజులు గడిచాక ఆయన వాస్తవంగా ఎన్ కౌంటర్ జరిగిన దగ్గరికి – అంటే గుండెకోట్ కు – వెళ్లి నంబాళ్ల కేశవరావుతో సహా 28 మంది ఒరిగిపోయిన స్థలం నుంచి ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వబోతున్నానని గురువారం సాయంకాలం ఒక ప్రకటన పోస్ట్ చేశాడు. శుక్రవారం ఉదయం ఆ 38 నిమిషాల రిపోర్ట్ అప్ లోడ్ చేశాడు.
ఒక భీకరమైన మారణకాండ, 28 మందిని చంపిన మారణకాండ సరిగ్గా జరిగినచోటు నుంచి విలేఖరి వీడియో కథనం అంటే ఆసక్తి కలిగింది. చాలా దుఃఖంతో, ఉద్వేగంతో, విచారంతో ఆ వీడియో చూశాను.
‘చెట్లన్నీ గాయపడ్డాయి’ అని ఆదివాసులు అన్నారని చెప్పి, “వాళ్లు ప్రతిదాన్నీ సజీవమైనదిగానే వ్యవహరిస్తారు” అని వివరణ కూడా ఇచ్చాడు. తూటాలు తగిలి గాయపడిన ఎన్నో చెట్లను, వెదురు వనాలను చూపాడు. పోలీసులు ఎటువైపు నుంచి ఎటు వచ్చి ఎటు కాల్పులు జరిపారు, మావోయిస్టులు ఎటు నుంచి ఎటు పరుగెత్తారు, ఏయే స్థలాల్లో కాల్పులు జరిగాయి, ఎక్కడ మావోయిస్టులు తూటాలు తగిలి కూలిపోయి ఉంటారు చాలా వివరంగా చెప్పాడు. ఒకచోట కుప్పగా పడి ఉన్న తూటాల షెల్స్ చూపించాడు. కొన్ని వందల తూటాలు పేల్చారని అవి సాక్ష్యం చెపుతున్నాయి.
ఆ స్థలాల్లో చెప్పులు, బూట్లు, చిరిగిపోయిన దుస్తులు, చిన్న పౌచ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, కళ్లద్దాల కేసులు, కాగితాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వికాస్ తివారీ వాటి గురించి కూడా చెప్పాడు. పోలీసులు పెద్ద వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని, అవసరం లేనివి వదిలేసి పోయారని అన్నాడు.
అమరవీరుల చివరి గుర్తులు. అవన్నీ వారం కింద పడిపోయిన, చెల్లాచెదురయిన వస్తువులు. ఈలోగా వానలు కూడా పడ్డట్టున్నాయి. కొన్ని తడిసిపోయాయి. కొన్నిటి మీద దుమ్ము పేరుకుంది. ఒకటి రెండు చోట్ల ఆ వస్తువులలోంచి ఒకటో రెండో పైకి తీసి వికాస్ తివారీ వాటి గురించి కూడా చెప్పాడు.
ఒకచోట, ‘ఇదిగో ఇక్కడేదో డైరీ పడి ఉంది’ అన్నాడు. నా గుండె ఒక్కసారి ఆగిపోయింది. అమరుల డైరీ పోలీసులు తీసుకుపోకుండా వదిలేసి ఉంటారా? ఇంతకూ అది డైరీ కాదు, చాలా మంది జేబులో పెట్టుకునేలాంటి చిన్న స్క్రిబ్లింగ్ పాడ్. పైన స్పైరల్ బైన్డ్ కూడా ఉన్నట్టుంది. అది తీసి ‘వరుసగా సంవత్సరాలు వేసి ఉన్నాయి. పి జి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, లా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ అని ఉన్నాయి’ అన్నాడు. ‘ఇదేమిటో తెలియడం లేదు’ అన్నాడు.
నాకది అర్థమైపోయింది. అక్కడ మృతవీరుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, లా చదివినది ఒకే ఒక్కరు. విజయలక్ష్మి. ఎందుకు రాసి పెట్టుకుందో గాని, తన పుట్టిన సంవత్సరం నుంచి వరుసగా సంవత్సరాలు వేసుకుంటూ వచ్చి, చదువు ఎప్పుడు మొదలు పెట్టినదీ, ఏ సంవత్సరం ఏమి చదివినదీ రాసి పెట్టుకుంది.
‘తడిసిపోయింది, కాగితాలు విడిపోవడం లేదు’ అంటూనే పేజీ తిప్పి ‘ఇక్కడేదో తెలుగులో రాసి ఉంది’ అని అది కింద పడేశాడు. “ప్రజా పోరు ప్రభంజనం చలపతి, ప్రజాయుద్ధ ప్రజ్వలనం దళపతి” అనే పల్లవితో చలపతి మీద రాసిన పాట. బహుశా విజయలక్ష్మి చేసిన చివరి రచనల్లో ఒకటి కావచ్చు. వసంతమేఘంలో, వియ్యుక్కలో వచ్చిన విజయలక్ష్మి రచనలు చూస్తే, ఆమెకు మంచి రచనా శక్తి ఉందనీ, విరివిగానే రాసేదనీ అర్థమవుతుంది. ఆ అక్షరాలు, ఆ సృజన శక్తి, ఆ ఉత్సాహం, అంత కఠినమైన జీవితంలో చిగుర్లేసిన అద్భుతమైన ఊహాశక్తి, వ్యక్తీకరణ నైపుణ్యం.
తెలంగాణ ఉద్యమ సమయంలో తనను చూశానో లేదో గుర్తు లేదు. ఆ మాటకొస్తే ఆ ఇరవై ఎనిమిది మందిలో ఏ ఒక్కరి గురించీ నాకు అంతకు ముందు తెలియదు. 1978-79 ఆర్ ఇ సి కి చాలా తరచుగా వెళ్తూ ఉండేవాడిని గనుక కేశవరావును చూశానేమో గాని గుర్తు లేదు.
వికాస్ తివారీ కిందినుంచి ఒక టోపీ తీసి చూపాడు. దానికి ఒక నక్షత్రం ఉందనీ, అటువంటి టోపీలు నాయకులు పెట్టుకుంటారనీ, అది బసవరాజుది కావచ్చుననీ అన్నాడు. ఒకచోట రాగి వాటర్ బాటిల్ తీసి చూపి, ‘ఇటువంటివి సీనియర్ నాయకులే వాడతారు. ఇది బసవరాజుది కావచ్చు’ అన్నాడు.
ఆ తర్వాత ‘ఒక పుస్తకం పడి ఉందిక్కడ’ అంటూ తీసి ‘పార్టీ సంవిధాన్’ అని చదివాడు. ‘కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోవాదీ)’ అని చదివాడు. లోపలి పేజీలు తిప్పి “ఇదంతా గోండి (దేవనాగరి లిపిలో గోండి) లో ఉంది నాకు అర్థం కాదు” అన్నాడు. ఆ పార్టీ ప్రణాళిక బుక్ లెట్ మీద లాల్సూ అని పేరు రాసి ఉందని చదివాడు.
పోలీసులు విడుదల చేసిన 27 మంది గుండెకోట్ మృతుల జాబితాలో విజ్జా ఉరఫ్ లాల్సు ఉర్సా అని ఒక పేరు ఉంది. “దాదాపు 23 ఏళ్ల వయసు, సుక్మా జిల్లా జాగర్ గొండ పోలీసు స్టేషన్ పరిధిలోని ఊర్మి గ్రామస్తుడు” అని, “పి ఎల్ జి ఏ కంపనీ నంబర్ 7 సభ్యుడు, తలపై ఎనిమిది లక్షల బహుమతి” అని కూడా రాశారు. అంటే ఆదివాసి. బహుశా ఇప్పుడిప్పుడే, దళంలో చేరాకనే అక్షరాలు నేర్చుకున్నాడేమో. ఒక పెన్సిల్ తో (లేక పెన్నుతో రాస్తే వర్షానికి చెరిగిపోయిందో) తన పేరు రాయడం నేర్చుకుని ఈ పార్టీ ప్రణాళిక మీద రాసుకున్నాడేమో… దుఃఖం ఆగలేదు.
ఆ దృశ్యం చూడగానే నాకు శ్రీకాకుళ ఆదివాసి, సవర అమరవీరుడు బిడ్డిక మంగన్న గురించి ఉదంతం గుర్తుకొచ్చింది. మొండెంఖల్ లో ఐదవ గిరిజన మహాసభకు వెళ్తున్న ఆదివాసుల ఊరేగింపు మీద 1967 అక్టోబర్ 31న భూస్వాములు జరిపిన కాల్పుల్లో ఆరికె కోరన్న, బిడ్డిక మంగన్న చనిపోయారు. బిడ్డిక మంగన్నను కాల్చి చంపాక ఆయన గుడిసెకు వెళ్లి చూస్తే ఒక అగ్గిపెట్టెలో మలిచి పెట్టిన ఎర్రజెండా, ఒక పలకా బలపం, ఒకటో తరగతి పుస్తకం కనిపించాయని ఇప్పటికే ఎందరో రాశారు. ఆదివాసులకు అక్షరాలు నేర్పిన ఉద్యమం అది. యాబై ఎనిమిదేళ్ల తర్వాత మరొక ఆదివాసి రాసిన తొలి అక్షరాలు!!
గుండెకోట్ మారణ కాండ యాబై ఎనిమిది సంవత్సరాలుగా సాగుతున్న అనేక మారణకాండల లాంటిదే. గుండెకోట్ అమరవీరులు వర్గపోరాట అనంత ధారలో పాలకుల చేతిలో ప్రాణాలు కోల్పోయినవారిలో మొదటివారూ కాదు, చివరివారూ కాదు. దోపిడీ పీడన అసమానత అన్యాయం లేని ఒక సమాజాన్ని సృష్టించాలనే సుందర స్వప్నంతో పోరాట మార్గం చేపట్టి ఆధిపత్య శక్తుల చేత హత్యకు గురైన వారు స్పార్టకస్ నుంచి ఇప్పటికి లక్షల మందో కోట్ల మందో…
నక్సల్బరీలో 1967 మే 25న ఎనిమిది మంది ఆదివాసి స్త్రీలనూ, ఒక పురుషుడినీ, ఇద్దరు పిల్లలనూ కాల్చి చంపినప్పటి నుంచి ఇప్పటికి పాలకవర్గాలు కనీసం పదిహేను వేల మంది ప్రజలను పొట్టన పెట్టుకున్నాయి. నక్సల్బరీలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసి మహిళలు ధానేశ్వరి, శీమస్వరి, నయనేశ్వరి, సొరుబాల, సోనామతి, ఫూల్ మతి, సంసారి, గౌద్రు ల నుంచి గుండెకోట్ లో హత్యకు గురైన విజయలక్ష్మి (భూమిక, వసుధ), లలిత (సంగీత)ల దాకా ఆకాశంలో సగం త్యాగంలో సగం కన్నా ఎక్కువ పాత్రనే వహించింది. నిరక్షరాస్య నక్సల్బరీ అమర మహిళల నుంచి అద్భుతమైన వ్యక్తీకరణ శక్తి ఉన్న విజయలక్ష్మి దాకా. అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుని ఎర్రజెండా పలకా బలపం ఒకటో తరగతి పుస్తకం గుడిసెలో భద్రంగా దాచుకున్న బిడ్డిక మంగన్న నుంచి, చివరి క్షణం దాకా మావోయిస్టు పార్టీ ప్రణాళికను తన దగ్గర పెట్టుకున్న లాల్సు ఉర్సా దాకా…
పరిచితులు కాకపోయినా గుండెకోట్ అమరులు కల్పిస్తున్న గుండెకోత ఎంత భారంగా ఉందో…
-ఎన్.వేణుగోపాల్