Menu

కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి,సిపిఐ మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి

anadmin 2 months ago 0 235

(రచయిత: ఇప్ప పృథ్వి రెడ్డి)

సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే కాకుండా తమ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి మిలిటరీ ఆపరేషన్లు/సాయుధ ఘటనలు అన్నీ వెంటనే నిలిపివేయాలని తన క్యాడర్ అంతటికీ ఆదేశాలు జారీ చేసింది. గత నెల రోజుల పైగానే వారి వైపు నుండి ఎటువంటి సాయుధ ఘటనలు జరిగినట్టు అటు పోలీసులు చెప్పలేదు, మీడియాలో కూడా రాలేదు.
ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి రూపేష్ “బస్తర్ టాకీస్” కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని, శాంతిని కోరుకుంటున్నామని, ఇప్పటికే “కాల్పుల విరమణ” పాటిస్తున్నామని, అమాయక ఆదివాసీల మరణాలు తమను కలిచివేస్తున్నాయని అన్నారు. నిరాయుధులయిన తమ నాయకత్వాన్ని సజీవంగా పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి చంపివేసి పోలీసు అధికారులు ఎన్కౌంటర్ కథలు చెప్తున్నారని అన్నారు. ఇంత స్పష్టంగా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన తరువాత అందుకు వీలుగా తగు ఏర్పాట్లు చేసి వారితో సంభాషించి పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం అది మరిచి నిస్సిగ్గుగా అమానవీయంగా మారణహోమం కొనసాగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది.
మధ్యభారతదేశంలోని ఆదివాసీల కాళ్ళ కింద ఉన్నటువంటి కోటానుకోట్ల విలువ చేసే ఖనిజ సంపదను తవ్వేయడానికి ఇప్పటికే దేశ విదేశీ కంపెనీలు అనేక ఎంఓయూ లను కుదుర్చుకున్నాయి. ఐరన్ ఓర్, బాక్సైట్, కోల్, లైమ్ స్టోన్, మాంగనీస్, గ్రాఫైట్, డోలమైట్ వంటి అత్యంత విలువయిన అరుదయిన ఖనిజ సంపదకు దండకారణ్యం నెలవు. ఈ విలువయిన సంపదను కొల్లగొట్టాలని ఎన్నో సంవత్సరాల క్రితమే కన్నేసినప్పటికీ కేవలం అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ భయంతో కార్పొరేటు కంపెనీల అడుగులు ముందుకు పడలేదు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంఓయూ లు కుదుర్చుకున్న కార్పొరేటు కంపెనీలు తాము ఈ సంపదను తోడుకోడానికి వీలుగా దండకారణ్యం కేంద్రంగా పని చేస్తున్న సిపిఐ మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే షరతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు బలంగా పెట్టారు. కేవలం మావోయిస్టులు అంతం అయితే సరిపోదని ఆదివాసీలు కూడా అడవుల్లో ఉండకుండా నిర్వాసితులను చేయాలనేది వారి లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మావోయిస్టుల పేరుతొ ఆదివాసీలను పట్టుకుని చంపి వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో విశేష కృషి చేసిన మావోయిస్టు పార్టీని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మార్చ్ 2026 నాటికి అంతం చేస్తామని ప్రకటించి మరీ మావోయిస్టులను, ఆదివాసీలను చంపివేస్తుంటే పెల్లుబికాల్సిన సామాజిక వెల్లువ రాకపోవడం మన దేశంలో నెలకొన్న సామాజిక స్పృహ దారిద్ర్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న మారణకాండపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ మాట్లాడడం లేదంటే జరుగుతున్న దాంట్లో వారికి కూడా భాగస్వామ్యం ఉన్నదనే అర్థం చేసుకోవాలి. అయితే ఈ సమస్య పార్లమెంటరీ రాజకీయ పార్టీలు అనుకుంటున్నట్టుగా కేవలం శాంతి భద్రతలకు సంబందించిందేనా? కేవలం మావోయిస్టులకు ఆదివాసీలకు సంబందించిందేనా? అస్సలు కాదు. ఇది రాజకీయ ఆర్థిక సామాజిక విషయాలతో ముడిపడి ఉన్న సమస్య. ప్రకృతికి సంబందించిన సమస్య. అడవుల మనుగడకు అందులోని జీవరాసుల మనుగడకు అక్కడి ఆదివాసీల మనుగడకు సంబందించిన సమస్య. మానవత్వానికి సంబందించిన సమస్య. ప్రజాస్వామ్యానికి సంబందించిన సమస్య. ఈ సమస్యల మూలలను వెతికి పరిష్కరించడం మానేసి ప్రభుత్వ సాయుధ బలగాలతో మావోయిస్టు పార్టీని అంతమొందించగలరేమో కానీ అది తాత్కాలిక విజయమే అవుతుంది. ఎవరో ఒకరు మళ్ళీ తిరిగి ఆ పార్టీని, పోరాటాన్ని పునరుద్దరించడమో లేక మరొక కొత్త విప్లవ పార్టీ పుట్టుకురావడమో తప్పక జరుగుతుంది. ఇప్పటికయినా శాంతిచర్చలు జరిపి సమస్య మూలలను వెతికి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని రాజకీయపార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన చారిత్రిక అవసరం ఉంది. దండకారణ్యంలో మోహరించిన ప్రభుత్వ పోలీసు బలగాలన్నీ వెంటనే వెనక్కి రావాలని, ఎన్కౌంటర్లను తక్షణమే నిలిపివేయాలనే ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన పెట్టాలి.
(ఈ వ్యాసం వ్రాసే సమయానికి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది పోలీసు బలగాలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. ఏ క్షణంలో అయినా పోలీసులు భారీ ఎన్కౌంటర్ జరిగిందని పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారని ప్రకటించవచ్చని తెలుస్తోంది. కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా చేస్తున్న ఈ ఆపరేషన్ నుండి తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలను వెంటనే వెనక్కి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ప్రాణనష్టాన్ని నివారించాలి.)

‍ఇప్ప పృథ్వి రెడ్డి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad