(forceindia.net లో గజాలా వహాబ్ రాసిన ‘ఫస్ట్ పర్సన్ | ది రియల్ స్టోరీ’ ఆర్టికల్ కు తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)
2026 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తానని హోంమంత్రి ఇచ్చిన హామీ ప్రజల కంటే కార్పొరేట్లకే ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది
రాష్ట్రాన్ని విభజించడం ద్వారానూ, స్థానిక జనాభాను లోబరుచుకోవడం ద్వారానూ కశ్మీర్ సమస్యను పరిష్కరించిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం తన దృష్టిని భారతదేశం వికసిత్ భారత్ వైపు పయనించడానికి ఆటంకం కలిగిస్తోందని అనుకుంటున్న మరొక ముఖ్యమైన సమస్యపై మళ్లించింది. అది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒరిస్సా లోని ప్రాంతాలతో కూడిన భారతదేశ ఖనిజ సంపద ఉన్న ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- (మావోయిస్ట్) వేళ్ళూనుకొన్న ప్రాంతం.
2004 నుండి హెచ్చుతగ్గుల హింస తీవ్రతతో భారత ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదంతో పోరాడుతున్నప్పటికీ – 2017లో ప్రారంభమైన పెద్ద ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ను పూర్తి చేయడానికి 2024 జనవరిలో, ఛత్తీస్గఢ్లోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరు సూచిస్తున్నట్లుగా అంతిమ పోరాటాన్ని ప్రారంభించింది. అంచుకు నెట్టే అనే అర్థం యిచ్చే ఉర్దూ పదమైన కగార్ అనేది ఉప-ప్రాంతీయ సైనిక చర్య. అందువల్ల, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ చర్య మావోయిస్టులను అంచుకు నెట్టే వరకు కొనసాగుతుంది.
బహుశా, ఇది హోంమంత్రి అమిత్ షాకు మార్చి 2026 నాటికి నక్సలిజం (వామపక్ష తీవ్రవాదంకి పర్యాయపదం) తుడిచిపెట్టుకుపోతుందని పదే పదే చెప్పడానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వామపక్ష తీవ్రవాదం ఎప్పుడు ముగుస్తుందో షాకు ఖచ్చితంగా తెలియడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆయన ప్రభుత్వ ఉద్దేశ్యం తీవ్రవాదాన్ని అంతం చేయడం కాదు, తీవ్రవాదిని అంతం చేయడం – దీని మధ్యలోకి వచ్చేంత దురదృష్టవంతులెవరు ఉంటారు?. అన్నింటికంటే, ఆయన ఇటీవల పార్లమెంటులో తన ప్రభుత్వం ఎవరినీ ఖైదీలుగా తీసుకోదని ‘ఉగ్రవాదులను కళ్ళ మధ్య కాల్చివేస్తుంది’ అని నొక్కి చెప్పిన వ్యక్తి.
పర్యవసానంగా, ఆపరేషన్ కగార్ ప్రారంభించినప్పటి నుండి, ప్రధానంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలోనే 400 మందికి పైగా మరణించారు. ఆర్టికల్ 14 సేకరించిన డేటా ప్రకారం, మావోయిస్టులు, భద్రతా బలగాల కంటే పౌరుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. వామపక్ష తీవ్రవాదంపై విజయం సాధించామని ప్రకటించడానికి తొందరపడుతున్న ప్రభుత్వం ప్రారంభించిన ‘దహనం చేసిన భూమి’ విధానంలో (ఈ విధానం ఒక మిల్టరీ వ్యూహం – ఇందులో సైన్యం శత్రుబలగానికి అవసరమైన దేన్నయినా ఆహారం, నీళ్ళు, కనీస సౌకర్యాలు, చివరకు పౌరులను కూడా నాశనం చేస్తుంది. శత్రువుకు వనరులు అందకుండా చేయడం, వారి పోరాట శక్తిని బలహీనపరచడం లేదా వెనక్కు మరలక తప్పని స్థితికి చేర్చడానికి ఉపయోగిస్తారు) ఆదివాసీ జనాభా దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మనోవేదనలు, వారి స్వంత అడవులు, వ్యవసాయ భూముల నుండి వారిని వెళ్ళగొట్టడం, నేరస్థులుగా చేయడం, భద్రతా బలగాలు, పట్టణవాసులు కూడా వారిని అమానవీయులుగా మార్చడం, అభివృద్ధి పేరుతో వారి సహజ ఆవాసాల నుండి వారిని తొలగించడం వంటివి నక్సలిజంపై పోరు పేరుతో తుడుచుకుపోయాయి.
గత ఆరు నెలల్లోనే, బస్తర్లో జరిగిన అనేక మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలలో విజయం సాధించానని రాజ్యం పేర్కొంది. అలాంటి సందర్భాలలో, అడవిలో ఎవరు చనిపోతారో ఎవరికీ తెలియదు కాబట్టి, రాజ్యం చేసే వాదనలను అంగీకరించాలి. బూటకపు ఎన్కౌంటర్లు, చట్టాతీత హత్యలు, పౌరులను మావోయిస్టులుగా చిత్రీకరించడం, హింస, అత్యాచారం మొదలైన వాటి గురించి అనేక నివేదికలు ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఈ యుద్ధంలో, పోలీసు చర్య నుండి కథనం వరకు ప్రతిదీ రాజ్యం నియంత్రిస్తుంది. ఈ కథనంలో, భారతదేశ ఆదివాసీ ప్రాంతంలో ఉన్న ఏకైక సమస్య మావోయిస్టు తీవ్రవాదుల ఉనికి. వారు మాత్రమే అణచివేసేవారు. అందువల్ల, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగే నిరసనలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతాదంతా సాఫ్ట్-నక్సలిజం; నిరసనకారులు అర్బన్-నక్సల్స్.
అమాయక ఆదివాసీ జనాభాపై దారుణాలు ఎంతగా జరిగాయంటే, పౌర సమాజ కార్యకర్తలతో పాటు, మావోయిస్టు నాయకత్వం కూడా ఆపరేషన్ కగార్ను నిలిపివేసి, తమతో శాంతి చర్చల్లో పాల్గొనాలని ప్రభుత్వాన్ని కోరుతూ మార్చి 28న ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియాలో ప్రసారం అవుతున్న లేఖ ప్రకారం, మావోయిస్టు ప్రతినిధి అభయ్ కాల్పుల విరమణ, చర్చలు కోసం విధించిన షరతులు ఆదివాసులు, మానవ హక్కుల కార్యకర్తలకు సంబంధించి ఉన్నాయి.
ఉదాహరణకు, బస్తర్లోని మాడ్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలలో సంఘర్షణకు మూలాలుగా మారుతున్న మరిన్ని సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేయడాన్ని ఆపాలని మానవ హక్కుల కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మావోయిస్టులు ఈ క్యాంపులపై దాడి చేస్తే, పొరుగున ఉన్న గ్రామస్తులందరూ అనుమానితులవుతారు. అనుమానితులతో సాధారణంగా ఏమి జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. తరచుగా, బలగాలు గ్రామస్తులను ఇన్ఫార్మర్లుగా మారమని బలవంతం చేస్తాయి; ఇది వారిని మావోయిస్టుల దృష్టిలో పడేట్లు చేస్తుంది. 2024 ఇండియా టుడే నివేదిక ప్రకారం, కేవలం బస్తర్లోనే దాదాపు 160 సెక్యూరిటీ క్యాంపులు ఉన్నాయి; వాటిలో 30 క్యాంపులను 2024 లోనే ఏర్పాటు చేసారు. ఆపరేషన్ కగార్పై విరసం తయారు చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఒక బుక్లెట్ ఇలా చెబుతోంది – ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి ‘ఒక మాడ్ ప్రాంతంలోనే ఆరు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసారు’; అబుజ్మాడ్లో ఈ క్యాంపుల మొత్తం సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.
ఏప్రిల్ 4న పౌర సమాజ సంస్థల సభ్యులు, సంబంధిత పౌరులు జారీ చేసిన ‘కాల్పుల విరమణ చర్చల కోసం విజ్ఞప్తి’లో, ఈ క్యాంపుల్లో ఎక్కువ భాగం సాముదాయక భూమిలో లేదా గ్రామ భూమిలో ఉన్నాయని; బస్తర్లో భద్రతా సిబ్బంది, పౌర నిష్పత్తి 1:9కి చేరుకుందని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని, వేరే సందర్భంలో, ఒక మధ్య స్థాయి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారి కూడా నాతో ప్రస్తావించారు. అతని ప్రకారం, వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాల, ప్రధానంగా 100 సిఆర్పిఎఫ్ బెటాలియన్లను వామపక్ష తీవ్రవాదంని ఎదుర్కోవడానికి మోహరించారు. ప్రతి బెటాలియన్లో దాదాపు 1,200 మంది సిబ్బంది ఉంటే కనక , 1,20,000 కంటే ఎక్కువ కేంద్ర ప్రభుత్వ దళాలు నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉన్నాయి. దీనికి తోడు, రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర సాయుధ పోలీసులు, జిల్లా రిజర్వ్ గార్డ్లు, బస్తర్ ఫైటర్లు, భారత సైన్యం, వైమానిక దళం కూడా శిక్షణ, లాజిస్టిక్స్ విధుల్లో ఉన్నాయి. ఈ సంఖ్యలు ఊహకందనంతగా ఉన్నాయి.
ఆ తరువాత మరో సంఖ్య ఉంది. 2022-23 సంవత్సరానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం, ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం ముప్పు ప్రభావిత ప్రాంతాలకు వివిధ విభాగాల కింద రూ. 5,317 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక కేంద్ర సహాయం, భద్రతా సంబంధిత వ్యయం, వామపక్ష తీవ్రవాదం ఉన్న ప్రాంతాలలో మోహరించిన దళాల సామర్థ్యానికి, సామర్థ్య నిర్మాణానికి కేటాయింపులు ఉన్నాయి.
ఆదివాసీ జనాభాకున్న ఫిర్యాదులను పరిష్కరించడానికి, వారి అభ్యున్నతి కోసం ఈ జాతీయ ప్రయత్నాన్ని చేస్తే కనక, అది ఈ ప్రాంతంలో పరివర్తన తీసుకువచ్చి, మావోయిస్టులకు ఆతిథ్యం ఇవ్వని ప్రదేశంగా మార్చేది. దురదృష్టవశాత్తు, ఈ ప్రయత్నం 2026 మార్చి ఏకపక్ష గడువును తీర్చడానికి ఖర్చు చేయడం జరుగుతోంది. విరసం బుక్లెట్ ప్రకారం, ఈ గడువుకు కారణం ‘2013 నుండి 2018 వరకు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో 272 అవగాహన ఒప్పందాలు (మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్))పైన సంతకం చేసింది, దీని కోసం దాదాపు రూ. 16.6 బిలియన్ల (1600 కోట్లు)పెట్టుబడి పెట్టింది.’
అందువల్ల, ఈ ప్రాంతాన్ని మైనింగ్ కోసం క్లియర్ చేయాలి. సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేయడం అంటే మావోయిస్టులను, సమస్యాత్మక ఆదివాసులనులను చంపడం ఎంత ముఖ్యమో, పారిశ్రామిక కార్యకలాపాలకు భద్రత కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఈ విధమైన అధికారిక విధానంతో, తీవ్రవాదులను చంపవచ్చు, కానీ వారి ఆలోచనలు మాత్రం సజీవంగా ఉంటాయి.