1983లో శివసాగర్ ʹఉద్యమం నెలబాలుడుʹ కవితా సంపుటికి ముందుమాట రాస్తూ వివి..
ʹఇంద్రవెల్లి గురించి ఏమీ రాయలేదమని (శివసాగర్ను) అడిగినప్పుడు మనం ప్రజలే చరిత్ర నిర్మాతలని చెప్పినా వీరుల గురించి రాసే అలవాటు నుంచీ పేరులేని వీరుల గురించి రాయడం ఇంకా ప్రజాపంథాలో నేర్చుకోవాల్సే ఉందని అన్నాడుʹ అని రాశారు.
పేరు లేని వీరుల గురించి ఆలోచించే సందర్భాన్ని ఇంద్రవెల్లి తీసుకొని వచ్చింది. నిజానికి అలాంటి ʹపేరుʹ లేని వీరులు మనకు తెలిసిన చరిత్ర పొడవునా ఎందరో తెలుసు. ఇంద్రవెల్లికి ముందూ, తర్వాతా కూడా ఉన్నారు. విప్లవోద్యమాల్లోనే కాక అనేక ప్రజా పోరాటాల్లో ఉన్నారు.
కానీ చరిత్ర రచనలో ʹవీరులʹకు చోటు ఇచ్చే ఫ్యూడల్ సంప్రదాయం నుంచి ప్రజా పంథాలోకి రావడానికి తీవ్రమైన పెనుగులాట తప్పనిసరైంది. విప్లవోద్యమ నాయకుడిగా శివసాగర్ ఈ పరిశీలన చేయగలిగారు. క్రమంగా చరిత్రను నిర్మిస్తున్న ప్రజలే చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో అవగాహన కలిగింది. ఇంద్రవెల్లిలాంటి అనేక సందర్భాల్లోంచి పేరు లేని ప్రజలను కేంద్రంగా చరిత్రను చూసే దృక్పథం మనకు పట్టుబడింది.
ఒక వాస్తవాన్ని సూత్రీకరించుకోడానికి, ఆచరించడానికి మధ్య సాగే ఎడతెగని సంఘర్షణకు ఇది ఉదాహరణ. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో జరిగిన మారణకాండకు ఇప్పుడు ముప్పైతొమ్మిది ఏళ్లు.
మామూలు పరిశీలకులకు అది ఒక ఘటన కావచ్చు. కానీ చరిత్ర నిర్మాతలైన ప్రజల గురించి ఆలోచించే వాళ్లు దాన్ని నిజ చరిత్రలో భాగంగా చూస్తారు. ఈ అవగాహన ఊరకే కలగలేదు. వర్గపోరాటాన్ని దాని అసలైన అర్థంలో స్వీకరించే ప్రయత్నాలు అప్పటికే మొదలయ్యాయి. ప్రజాపంథా నిర్మించే పని ఆరంభమైంది.
అంతకముందు ఏడాది ఏప్రిల్ 22 న సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ ఆవిర్భవించింది. ఇప్పటికి 40 ఏళ్ళు. ఆ తేదీకి విప్లవోద్యమ చరిత్రలో చాలా ప్రాధాన్యత ఉంది. అప్పటికి దశాబ్దానికి పైగా ఉండిన విప్లవోద్యమ అవగాహనలను, ఆచరణను, నినాదాలను, నిర్మాణ రూపాలను లోతుగా సమీక్షించుకొని ప్రజాపంథాలో పీపుల్స్ వార్ ఏర్పడింది. సింబాలిక్ గా మహత్తర రష్యన్ విప్లవాన్ని విజయవంతం చేసిన కామ్రేడ్ లెనిన్ పుట్టిన రోజది. ఆ పార్టీ ఏర్పాటు, దాని ప్రజాపంథా సాహిత్య సాంస్కృతిక రంగాలతో సహా సకల జీవన పార్శ్వాల్లో వర్గపోరాటానికి దారి చూపింది. ఇంద్రవెల్లి నెత్తుటినీ, కన్నీటినీ దాచుకుంటూనే ఈ ప్రజాపంథా కరీంనగర్, ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల నుంచి, సింగరేణి కార్మికోద్యమాల నుంచి దండకారణ్యానికి దారి చూపించింది.
అందుకే ప్రముఖ విప్లవ కవి ఎన్ కె ʹఆదిలాబాద్ విప్లవానికి కన్నతల్లిʹ అన్నారు.
ఇంద్రవెల్లి మారణకాండలో ఎందరు అమరులయ్యారో, వాళ్ల పేర్లేమిటో ఇప్పటికీ పూర్తి వివరాలు తెలియవు. పీపుల్ వార్ ఏర్పాటులోని ఉత్తేజమూ, ఆ తర్వాత ఏడాదికి ఇంద్రవెల్లి దు:ఖమూ తెలుగు నేతల మీద ఎన్నో వర్గపోరాట రూపాలను ముందుకు తీసుకొచ్చాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఇదొక కీలకమైన మలుపు.
దాని ప్రభావాలను, అర్థాలను, వీటి వెనుక ఉన్న ఆచరణాత్మక అవగాహనల మీద ఎన్నో విశ్లేషణలు వచ్చాయి. అయితే అది పూర్తయిందని చెప్పలేం.
ఇంద్రవెల్లి ఘటన మన చారిత్రక దృక్పథాన్ని ప్రభావితం చేసింది. చరిత్ర నిర్మాణాన్ని అర్థం చేసుకొనే శాస్త్రీయ పద్ధతి వైపు మళ్లించింది. చరిత్రలో గతానికి వర్తమానానికి ఉండే సంబంధం పట్ల స్పృహను అందించింది. వాస్తవ చరిత్రకు ఉండే కాల్పనిక రూపంపట్ల శ్రద్ధ పెంచింది. దీని పర్యవసానమే సాహు, అల్లం రాజయ్య రాసిన కొమురం భీం నవల. .
ఇంద్రవెల్లి మారణకాండలో అమరుల వివరాలు, గాయపడిన వాళ్ల సమాచారం తెలుసుకోలేని పరిమితి ఉండొచ్చు. కానీ దశాబ్దాల కిందటి ఒక మహత్తర పోరాటాన్ని పునరిఖించి ఇంద్రవెల్లి అమరుల వంటి ఎందరో పేరు లేని వీరులందరినీ కొమురం భీం ప్రతీకలో రచయితలు చూపించారు. ఇదొక సాహిత్య ఉదాహరణ మాత్రమే. ఇందులో కూడా ʹపేరున్నʹ ఒక వీరుడు కనిపించవచ్చు.
కానీ ఇది ʹపేరు లేనిʹ ప్రజల చరిత్ర. వాళ్లందరి వ్యక్తిత్వాల క్రోడీకరణ.
ఇట్లా సాహిత్యంలో చెప్పగలిగినంత సులువుగా విప్లవ ప్రజా ఆచరణలో చెప్పలేకపోవడం మన పరిమితి. బహుశా కళా సాహిత్యాల అవసరం, బలం కూడా అదే కావచ్చు. ఇంద్రవెల్లి ఘటన నాటికె అప్పటి దాకా ʹపేరుʹ లేని వేలాది మంది అట్టడుగు మనుషులు పేరెన్నికగన్న ప్రజా నాయకులయ్యే క్రమం మొదలైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల్లో ఇలా ఎందరో నాయకులయ్యారు. ఇది మరింత విస్తృత స్థాయిలో, స్థిమితంగా 1970ల మద్య నుంచే ఆరంభమైంది. ప్రజలే నాయకులయ్యే అద్భుత సామాజిక సాంస్కృతిక ప్రక్రియ ఇది. అందుకే ఇంద్రవెల్లి మారణకాండ, ఆ తర్వాత ఉవ్వెత్తున సాగిన ప్రజా పోరాటాలు ఆ తరానికి ఉజ్వలమైన అనుభవాన్ని ఇచ్చాయి. గొప్ప జ్ఞాపకాలను పదిలపరిచాయి.
నిజానికి ఇంద్రవెల్లి కంటే ముందే జగిత్యాల జైత్రయాత్ర నాటికే విప్లవోద్యమం అతివాద ఛాయలను, ఆర్థిక వాదాన్ని వదిలించుకొని ప్రజా పంథాను ఎన్నుకున్నది. తన ఆచరణను నిజాయితీగా సమీక్షించుకున్నందు వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆచరణలో కొనసాగడం, నిజాయితీగా ఉండటం, కన్సిస్టెన్సీని పాటించడం అనేవే విప్లవకారులకు దృఢమైన శక్తిని ఇస్తాయి.
దీన్ని సంతరించుకోకపోతే భారత విప్లవోద్యమం ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే. దీని వెనుక కెఎస్ దార్శనికత ఉన్నది. ప్రజాపంథాలో పోరాటాల నిర్మాణం, విస్తరణ, మిలిటెన్సీ, వ్యూహాత్మకత మొదలైనవి విప్లవోద్యమ ఖజానాలో భాగం. అప్పటికే ఇవి లేకపోయి ఉంటే ఇంద్రవెల్లి మారణ కాండ తర్వాత అంతా కకావికలమై ఉండేది. పైగా శ్రీకాకుళ పోరాటం తర్వాత అప్పుడప్పుడే విప్లవోద్యమ పునర్నిర్మాణం జరుగుతోంది. ఆ దశలో అంత పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. శతృవు క్రూరత్వం మొదటి నుంచీ ఉన్నదే అయినా శ్రీకాకుళ పోరాటం తర్వాత తిరిగి మళ్లీ అంతగా ఇంద్రవెల్లిలో విరుచుక పడ్డాడు.
కానీ దెబ్బతిన్న శ్రీకాకుళంలాగే గాయపడ్డ ఇంద్రవెల్లి ఒక కొనసాగింపును ఇచ్చింది. పైగా శ్రీకాకుళం లాగా గ్యాప్ కూడా రాలేదు. దీనికి ప్రజాపంథానే కారణం. అన్ని రంగాల్లో దేశవ్యాప్తంగా ఉద్యమం విస్తరించింది. మిలిటెన్సీ పెంచలేని ప్రజాపంథా విప్లవోద్యమంలో మితవాదానికి దారి తీస్తుంది. పండిత చర్చలకు పరిమితం చేస్తుంది. అందుకే 1980 ఏప్రిల్ 22, 1981 ఏప్రిల్ 20 తేదీలు చరిత్రలో అంకెలు మాత్రమే కాదు. ఘటనలు, సందర్భాలు కాదు. చరిత్రగా కనసాగుతుండటానికి వాటిలోని ప్రజాపంథా, మిలిటెన్సీ, వర్గపోరాటానికి ఉండే అనేక ముఖాలపట్ల అవగాహన, దీర్ఘకాలిక దృష్టి కారణం.
ఇంద్రవెల్లిలో గాయపడిన పోరాటం దేశమంతా విస్తరించింది. దండకారణ్యంలోకి కూడా చేరుకున్నది. పోరాట రూపాలు, ఎత్తుగడలు, మనుషులను అజేయ పరాక్రములుగా తీర్చి దిద్దే వర్గపోరాటాలు, మానవుల్లోని సకల సృజన శక్తులకు రెక్కలు తొడిగే సాంఘిక బంధాల విముక్తి ఉద్యమాలు, చరిత్ర రచన-సంస్కృతీ సాహిత్యాలు ఎలా ఉంటాయో దండకారణ్యం నిరూపిస్తోంది. దేశంలోని విప్లవోద్యమ కేంద్రాల్లో అనుభవంలోకి వస్తున్నాయి.
ఇంద్రవెల్లి నెత్తుటి ధారల్లోంచి పురోగమించిన విప్లవోద్యమంలో ఎన్నో గెలుపోటములు ఉండవచ్చు. సాధించుకున్నవీ కోల్పోయినవీ ఉండవచ్చు. పరిమితీ విస్తృతులు ఉండవచ్చు. కానీ కొనసాగింపు ఉన్నది. సాహసం ఉన్నది. లోతైన అంతర్మథం ఉన్నది. భవిష్యత్ పట్ల భరోసా ఉన్నది. నలభై ఏళ్ల విప్లవోద్యమంలో ఇంద్రవెల్లి ఆదివాసీల ఆకాంక్షలు, అమరత్వం నిత్య ఉత్తేజితంగా ప్రజ్వరిల్లుతున్నాయి. విప్లవోద్యమానికేగాక ఆదివాసీ అస్తిత్వానికి కూడా ఇంద్రవెల్లి ప్రతీకగా మారింది.
ఆ రోజు శివసాగర్ పేరులేని వీరుల గురించి మనం ఇంకా తెలుసుకోవలసే ఉన్నదని అన్నారు. ఈ ఎరుక క్రమంగా పెరిగింది. విప్లవోద్యమానికే కాదు, సమాజానికే పెరిగింది. పోరాటశక్తులన్నిటికీ పెరిగింది. ఇంకో పక్క ఇంద్రవెల్లి మారణకాండ మీద వెను వెంటనే ఎన్నో సృజనాత్మక రచనలు వచ్చాయి. లోతైన విశ్లేషణలు వచ్చాయి. ఆదివాసులకు దేశవ్యాప్తంగా సంఘీభావం వచ్చింది. ఎన్నో నిజనిర్ధారణలు జరిగాయి. పోరాటానికి, అమరత్వానికి ఇంద్రవెల్లి చిరునామాగా మారింది. ఈ నలభై ఏళ్లుగా ప్రజాస్వామిక వాదులు ఇంద్రవెల్లి మీద చాలా కృషి చేశారు. ఎప్పటికప్పుడు రచనలు వస్తునే ఉన్నాయి. పరిశోధనలు జరిగాయి. ఇంద్రవెల్లి తలపోతతో పుస్తకాలూ వచ్చాయి. ఇదంతా విప్లవోద్యమంలోనే కాదు, సమాజంలో కూడా ఇంద్రవెల్లి వర్తమాన చరిత్ర అని నిరూపిస్తున్నాయి.
అందుకే ఇంద్రవెల్లి అమరత్వం భారత విప్లవోద్యమంలో జాజ్వల్యమానం.
-పాణి
(2020, ఏప్రెల్ లో రాసినది)