Menu

‘నెల రోజుల పాటు కాల్పుల విరమణకు మేం సిద్దం, మీరు సిద్దమా ?’

anadmin 2 months ago 0 432

చత్తీస్ గడ్ లో మావోయిస్టు పార్టీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ, చర్చలు జరగాలన్న దేశ వ్యాప్త డిమాండ్ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో అదికార ప్రతినిధి రూపేష్ రిలీజ్ చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం….

*ఇరు వైపుల నుండి ఒక నెల కాల్పుల విరమణ జరగాలని మేము కోరుకుంటున్నాం
*శాశ్వత పరిష్కారం కోసం ముందుకు సాగుదాం

ముందుగా, 2025 ఏప్రిల్ 17న జరిగిన శాంతి చర్చలకు సంబంధించి ఏప్రిల్ 8న నేను చేసిన మొదటి ప్రకటనకు తక్షణ ప్రతిస్పందన ఇచ్చినందుకు ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా భద్రతకు హామీ ఇస్తూ ఈ ప్రయత్నాన్ని కొనసాగించడానికి నన్ను అనుమతించినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నా మొదటి లేఖలో చెప్పినట్టే కగార్ పేరుతో జరుగుతున్న హత్యలను వెంటనే ఆపడమే ఈ ప్రయత్నం యొక్క ప్రధాన లక్ష్యం అని మరోసారి చెబుతున్నాను. సమస్య పరిష్కారం కావాలి. శాంతి చర్చల ద్వారా మనం దీనిని సాధించగలం. మా ఆఫర్ వెనుక వేరే వ్యూహం లేదు. మీరు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు, కనీసం తాత్కాలికంగానైనా రెండు వైపులా కాల్పుల విరమణ ప్రకటించడం అవసరం. ఇది షరతుల పరిధిలోకి రాదు, కానీ ఇది శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో భాగం. దీనిపై మీ స్పందన కోసం మేము వేచి చూస్తాము.

ఈ సమస్య పరిష్కారం కోసం నేను, మా సహచరులు ఆలోచిస్తున్న దానికిని పూర్తి రూపం ఇవ్వడానికి… చర్చల్లో మా వైపు నుండి ప్రాతినిధ్యం వహించే మధ్యవర్తి ప్రతినిధి బృందాన్ని, మా పార్టీ ప్రతినిధులను నిర్ణయించడానికి, మా కేంద్ర కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ నాయకత్వ కామ్రేడ్‌లను కలవడం అవసరం. వారిని కలవడానికి నాకు, నా సహచరులకు భద్రతా హామీ ఉండాలి. అందుకోసం, ప్రభుత్వ సాయుధ దళాల కార్యకలాపాలను ఒక నెల పాటు నిలిపివేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ చర్చల సమయంలో ప్రభుత్వ సాయుధ దళాలపై తుపాకులను ఉపయోగించవద్దని నేను ఇప్పటికే ఒక పత్రికా ప్రకటన, ప్రత్యేక లేఖ ద్వారా మా సహచరులందరికీ విజ్ఞప్తి చేశాను. కాబట్టి, మీరు నాతో ఏకీభవించి మాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌లో మోహరించిన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దళాలకు ఒక నెల పాటు కాల్పుల విరమణ పాటించాలని ఆదేశాలు జారీ చేయండి. బస్తర్‌లో హింసను వెంటనే ఆపండి. ఇది ప్రభుత్వానికి నా విజ్ఞప్తి.

భద్రతా బలగాలపై దాడి చేయవద్దని నేను మా పార్టీ క్యాడర్ కోసం బహిరంగ లేఖ జారీ చేసిన తర్వాత కూడా, ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరంతరం దాడులు చేస్తున్నాయి. ఏప్రిల్ 12న బీజాపూర్ జిల్లా, భైరమ్‌గఢ్ బ్లాక్‌లోని ఇంద్రావతి నది తీరంలో అనీల్ పూనెమ్‌తో సహా ముగ్గురిని పట్టుకుని హత్య చేశారు. ఏప్రిల్ 16న కొండగాంవ్ జిల్లాలోని కిల్లెమ్ సమీపంలో డీవీసీ సభ్యుడు హోల్దర్‌తో సహా ఇద్దరిని హత్య చేశారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి…? ఈ హత్యాకాండలు ఇలాగే కొనసాగితే, శాంతి చర్చల కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలకు ఎలాంటి అర్థం ఉండదు. అందుకే శాంతి చర్చలు ముందుకు సాగడానికి, సమ్స్య శాశ్వత పరిష్కారం కోసం ఈ హత్యాకాండలు ఆపాలని నేను ప్రభుత్వానికి, విజయ్ శర్మ కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను

ఈ సమస్యను పరిష్కరించాలనే మా చట్టబద్ధమైన డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని దేశంలోని ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము.

గమనిక: నా మొదటి పత్రికా ప్రకటనకు ప్రతిస్పందనగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు మాకు వ్యతిరేకంగా మాట్లాడిన‌ చాలా విషయాలకు నేను స్పందించడం లేదు. ప్రస్తుతం నేను ఒకే ఒక విషయంపై దృష్టి పెడుతున్నాను.

రూపేష్,
అధికార ప్రతినిధి,
నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో,
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad