Menu

మానవ హననం ఆపాలి….శాంతి చర్చలు జరపాలి

anadmin 2 months ago 0 121

(పూర్వ విప్లవ విద్యార్థులు ప్రచురించిన కరపత్రం)



*మ‌ధ్య‌భార‌తంలో ఆదివాసీల‌ హననాన్ని ఆపివేయాలి
*శాంతి, ప్రజాస్వామ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టులు
వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలి

ప్రియమైన ప్రజలారా,
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ఆదివాసులు, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్, గడ్చిరోలి, ఒడిషా, ఆంధ్ర, తెలం గాణ, ఝార్ఖండ్, బెంగాల్, కేరళ రాష్ట్రాలలోని ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలోనూ, విడిగా తమ తమ ఆదివాసీ సంఘాల నాయకత్వంలోనూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల న్నింటా ఉన్న అపారమైన ఖనిజాలను అదానీ, అంబానీ, వేదాంత, టాటా, బిర్లా తదితర కార్పొరేట్ సంస్థ లకు అప్పజెప్పడం కోసం అక్కడి ఆదివాసీలను తమ స్వంత గడ్డపై నుండి బేదఖలు చేసే ప్రయత్నాల ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. ఈ నేప‌థ్యంలోంచే త‌మ ఆవాసాల‌ను ధ్వంసం చేయ‌జూస్తున్న ప్ర‌య‌త్నాల‌కు వ్య‌తిరేకంగా జల, జంగల్, జమీన్ కోసం ఆదివాసులు పోరాడుతున్నారు. ఈ ఉద్యమాలు త‌మ‌కు అడ్డంకిగా ఉన్నాయని వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే ఆదివాసుల‌కు అండ‌గా మావోయిస్టుల నాయకత్వంలో జరుగుతున్న పోరాటాన్ని అణచివేయడం పేరుతో తీవ్ర దమనకాండ కొనసాగుతున్నది.
ఈ నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్బంధాన్ని ఓ విధానంగా అమ‌లు చేస్తున్నాయి. అన్ని రకాల ప్ర‌జా ఉద్య‌మాల‌పై అణ‌చివేత‌ను కొన‌సాగిస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే ప్రజాస్వామ్య యుతం గా, రాజ్యాంగబద్దంగా నడుస్తున్న పోరాటాలప‌ట్ల కూడా కేంద్ర ప్ర‌భుత్వం క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తున్నది. రైతు ఉద్య‌మం మొద‌లు సీఏఏ, ఎన్ఆర్‌సీ వ్య‌తిరేక ఉద్య‌మాల‌ను క్రూరంగా అణ‌చివేసింది. ఉదాహరణకు ఉత్తర ఛత్తీస్ గఢ్ లోని హస్ దేవ్ అడవులను ఆదానీ కంపెనీకి అప్పజెప్పారు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నియమించిన ప్యానల్ వ్యతిరేకించినా కూడా దాన్ని అదానీకి అప్పజెప్పారు. అక్కడ రెండున్నర, మూడు లక్షల చెట్లను నరికివేస్తున్నారు. అట్లాగే ఒడిశాలోని పలు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలు చట్టబ ద్దంగా, రాజ్యాంగబద్దంగా చేస్తున్న పోరాటాలను ర‌క్త‌పుటేరుల్లో ముంచుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు అడవిని అప్పనంగా అప్పగించడం కోసం ప్రభుత్వాలే రాజ్యాంగ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్నాయి. ఆదివాసీల రక్షణ కై రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన 5వ షెడ్యూల్, 6 వ షెడ్యూల్ లను, పెసా (PESA) చట్టాన్ని, అటవీ అధికారాల చట్టాన్ని విచ్చల విడిగా ఉల్లంఘిస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే మావోయిస్టులను అణచివేసే పేరుతో ప్రతి తొమ్మిది మంది ఆదివాసీలకు ఒకరు చొప్పున పోలీసులను, పారామిలిటరీ బలగాలను అడ‌వినిండా నింపారు. మూడు, నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పోలీసు క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆదివాసీలు తమ సాధారణ దైనందిన జీవితాన్ని గడపకుండా మొత్తం అడ‌వినంతా నిర్బంధ శిబిరంగా మార్చివేశారు.
శ‌త్రు దేశాల‌పై దాడి చేసే రీతిలో.. భార‌త ప్ర‌భుత్వం ఆదివాసీ గూడాలపై డ్రోన్ లతో, మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో దాడులు చేస్తున్న‌ది. దేశ పౌరులైన ఆదివాసీ బిడ్డ‌ల‌పై భారత ప్రభుత్వం తానే యుద్ధం చేస్తూ.. అంత‌ర్జాతీయ నీతి, న్యాయ‌ చట్టాలను ఉల్లంఘిస్తున్నది. 2026 మార్చ్ కల్లా మావోయిస్టు ఉద్యమం లేకుండా చేస్తామని ప్రకటించి గత రెండేళ్లుగా ఆపరేషన్ కగార్ (అంతిమ యుద్ధం) పేరుతో జరుపుతున్న అణచివేత అత్యంత పాశవిక స్థాయికి చేరుకున్నది. నిరాయుధులను, ఎన్ కౌంటర్లలో గాయపడిన వారిని, అనారోగ్యంతో గ్రామాల్లో ఉన్నవిప్లవకారులను పట్టుకొని చంపివేస్తున్న‌ది. ఎంతమందిని చంపితే అంత రివార్డు అన్న‌ట్లుగా.. పోలీసులకు ల‌క్ష‌లు, కోట్ల రూపాయాల్లో రివార్డులు అందిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలోం చే.. ఆదివాసీల‌పై మారణకాండ కొన‌సాగుతున్నది.
ఆదివాసులపై కొనసాగ‌తున్న మార‌ణ‌కాండ‌తో కలత చెందుతున్న మేధావులు ఈ యుద్ధం ఆగాల‌నీ, శాంతి, ప్రజాస్వామ్యం నెలకొనాలనీ కోరుకొంటున్నారు. ఆదివాసీ జాతి హ‌న‌నం ఆగిపోవాల‌నే ఉద్దేశ్యంతో శాంతి చర్చల కమిటీని ఏర్ప‌టు చేసి శాంతికోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. దాని కోసం మావోయిస్టులు, ప్ర‌భుత్వాలు చ‌ర్చించుకోవాలని పిలుపునిచ్చారు. దానికి మావోయిస్టు పార్టీ వెంట‌నే ప్రతిస్పందించింది. శాంతికోసం తాము కట్టుబ‌డి ఉన్నామ‌ని తెలుపుతూ.. మార్చ్ 28 నాడు తాము కాల్పుల విరమణ పాటించ డానికి సిద్ధమంటూ ఒక ప్రకట న విడుదల చేసింది. అందుకోసం ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం కోసం “ప్రభుత్వం కొనసాగి స్తున్న హత్యాకాండను నిలిపివేయాలని, సాయుధ బలగాల మొహ‌రింపును, కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం” అని ఆ ప్రకటనలో తెలిపింది. కానీ దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం గానీ, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ హోం మంత్రి కానీ సానుకూలంగా ప్రతిస్పందించక‌పోవ‌టం గ‌మ‌నార్హం.
మధ్య భారతంలో ఆదివాసీల హ‌న‌నం ఆగిపోయి, శాంతి నెలకొనాల‌ని శాంతి చర్చల కమిటీతో పాటు దేశంలోని శాంతికాముకులు, మేధావులు ఆకాంక్షిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర‌ ప్రభుత్వాలు, మావోయిస్టులు ఇద్దరూ కాల్పులు విరమించాలని పిలుపునిస్తున్నారు. మావోయిస్టులు ఇప్పటికే కాల్పుల విరమణకు సంబంధించి సానుకూలంగా ప్రతిస్పందించారు. కాబట్టి ప్రభుత్వం కూడా కాల్పుల విరమణను పాటించా లనీ, చర్చలు జరపాలనీ దేశం యావ‌త్తూ కోరుతున్న‌ది.
మధ్య, తూరుపు భారత దేశంలోని అడవులు ఆదివాసీల అస్తిత్వానికి ఆయువుపట్టు మాత్ర‌మే కాదు, అతి విలువైన స‌హ‌జ‌వ‌న‌రుల‌కు నిల‌యాలు. అంతే కాదు, ఈ అడ‌వుల‌న్నీ దేశానికి ఊపిరితిత్తుల లాంటివి. వాటి వినాశనం అంటే అక్కడి జంతుజాలంతో పాటు దేశ ప్రజలందరి ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే. భూతలంలో జరుగుతున్న పర్యావరణ వినాశ‌క మార్పులను వేగిరవంతం చేయడమే. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న మారణకాండను, జనసంహారాన్నీ ఆపాలని, ప్రజలందరికీ చెందిన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించకూడదనీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిందిగా సకల ప్రజానీకానికి పూర్వ విప్లవ విద్యార్థులుగా మేం కోరుతున్నాం.
-మ‌ధ్య‌భార‌తంలో ఆదివాసుల హ‌న‌నాన్ని ఆపివేయాలి.
-ఆదివాసీ ప్రాంతాల్లో యుద్ధ వాతావ‌ర‌ణాన్నిరూపుమాపాలి.
-శాంతి కోసం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు, మావోయిస్టులు కాల్పుల విర‌మ‌ణ‌ను ప్ర‌క‌టించాలి.
-కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు- మావోయిస్టుల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రగాలి.
-శాంతి, ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం కోసం ప్ర‌జ‌లంతా గొంతువిప్పాలి.
-శాంతి కోసం హ‌క్కుల‌, పౌర సంఘాల‌న్నీ త‌మ వంతు క‌ర్త‌వ్యంగా క‌ద‌లాలి.

  • శాంతి కోసం జ‌రుగుతున్న అన్ని ప్ర‌య‌త్నాలను స్వాగ‌తిద్దాం.
  • శాంతి చ‌ర్చ‌ల కోసం జ‌రుగుతున్న అన్ని స‌భ‌లు, స‌మావేశాల‌ను విజ‌య‌వంతం చేద్దాం.

-పూర్వ విప్లవ విద్యార్థులు

ప్రచురణకర్త: ఎం సాంబమూర్తి, ఫోన్:9949871449

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad