Menu

కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం ఈ నెల 18న సభ

anadmin 2 months ago 0 69

మధ్యభారతంలో జరుగుతున్న ఆసివాసీల‌ హననాన్ని తక్షణం ఆపాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సీపీఐ మావోయిస్టు కాల్పుల విరమణ పాటించి , చర్చలు జరపాలనే డిమాండ్ తో ‘భారత్ బచావ్’ సంస్థ ఈ నెల 18న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలవరకు జరిగే ఈ సభ సందర్భంగా ఆ సంస్థ ప్రచురించిన కరపత్రం పూర్తి పాఠం మీ కోసం…

“నా ప్రియ గణతంత్రమా,
ఎప్పుడయితే నడివీధుల్లో నీ ఉత్తమ పౌరులు చంపబడతారో, జైళ్ళలో పోగుబడుతుంటారో,
ఎప్పుడయితే ద్రోహులు ఉన్నతస్థానాల నధిరోహిస్తుంటారో భయంకరమైన తప్పేదో నీలోనే ఉంది.”
(అభయ్ ప్లేవియన్ ఖాభా, సోషియాలజిస్ట్, ఆదివాసీహక్కుల కార్యకర్త)

మితృలారా,
భారత గృహమంత్రి అమిత్ షా తన ఛత్తీస్ ఘడ్ పర్యటనలో భాగంగా 5వ తేదీ రాయ్ పూర్ లో ప్రభుత్వ అధికారులు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్. ఎన్ ఐఏ, ఇంటలిజెన్స్ విభాగాలతో నిర్వహించిన భద్రతాసమీక్షా సమావేశం తర్వాత, 31 మార్చి, 2026 తరువాత నక్సలిజం కాలగర్భంలో కలిసిపోక తప్పదని, బస్తర్ ప్రజలు నక్సలిజం కన్నా అభివృద్ధి పథాన్ని కోరుకుంటున్నందున, ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలో భాగం కావల్సిందిగా నక్సలైట్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు” ప్రకటించడంతో, దేశవ్యాప్తంగా, మఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మావోయిస్టులకు, ప్రభుత్వాల మధ్య శాంతి చర్చల, కాల్పుల విరమణ అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మావోయిస్టుల నిర్మూలనకు భారత ప్రభుత్వం తలపెట్టిన ‘అంతిమ యుద్ధం- కగార్’ ఎదురుకాల్పుల పేరిట గత రెండు సంవత్సరాలలో (2024 లో 287, 2025లో ఇప్పటికే 120) నాలుగు వందలకు పైగా మావోయిస్టులు, సాధారణ అదివాసీ ప్రజలు మరణించడం జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తన స్వంత ప్రజల పైననే చేస్తున్న అమానుషత్వం పట్ల కలత చెందుతున్న పౌరసమాజం, హక్కుల సంఘాలు, మేధావులు చేసిన “శాంతి చర్చలు – ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ” ప్రతిపాదనకు స్పందించిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ”ప్రజల ప్రయోజనాల కోసం మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమే. అందుకు సానుకూల వాతావరణం కల్పిస్తే, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం” అంటూ, “సామ్రాజ్యవాదుల, దళారీ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడిని సుస్థిరం చేయడం, బ్రాహ్మణీయ, హిందుత్వ, ఫాసిస్టు ఆర్.ఎస్.ఎస్. – బి.జె.పి. లు నిర్మించ తలపెట్టిన ‘వికసిత్ భారత్ – హిందూ రాష్ట్ర’ నిర్మాణంలో భాగంగానే కగార్ మారణ హెూమాన్ని సృష్టిస్తుందని, మావోయిస్టుల పేరిట కమాండోల ముసుగులో భారత సైన్యాన్ని మోహరించి, సాధారణ ఆదివాసీ ప్రజలను, వృద్ధులను, మహిళలను, చిన్న పిల్లలను సైతం నిర్ధాక్షిణ్యంగా చంపుతున్నదని, ఆదివాసీ జాతి నిర్మూలనకు పాల్పడుతుందని, ఇప్పటి వరకూ మావోయిస్టుల పేరిట హతమార్చిన వారిలో మూడవ వంతు సాధారణ, అమాయక ఆదివాసీ ప్రజలే”నని ఆరోపించారు. దక్షిణాసియా ఉగ్రవాద వ్యవహారాల పోర్టల్, మధ్యభారతంలో కొనసాగుతున్న సాయుధ ఘర్షణలలో ఈ సంవత్సర కాలంలో ” 15 మంది సాధారణ పౌరులు, 14 మంది భద్రతా బలగాలు, మావోయిస్టులు 150 కి పైగా మరణించార”ని పేర్కొనడం కూడా దీనిని నిర్ధారిస్తుంది. 2018 నుండి 2022 వరకు ప్రభుత్వ సాయుధబలగాలు (168), మావోయిస్టులు (327) ల కంటే ఎక్కువగా సాధారణ ప్రజలు (335) వరకు ప్రాణాలు కోల్పోయారని ఆర్టికల్ 14 ప్రచురించడం ఎంతో ఆందోళన కలిగించే విషయం. ప్రతి మనిషి ప్రాణం విలువైనదే కనుక ఈ మరణాలకు మూల కారణం, పరిష్కారం వెదకవలసిన బాధ్యత పౌరసమాజం, మేధావుల పైన ఉన్నది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటూ, మధ్యభారతంగా పేర్కొనబడే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గడ్ రాష్ట్రాలు షెడ్యూల్డు తెగల ప్రజలు నివసించే ప్రాంతాలుగా పరిగణిస్తూ, వాటిని భారత రాజ్యాంగం అయిదవ షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించింది. 2011 జనాభాలెక్కల ప్రకారం, దేశంలోని 10,42,81,034 ఆదివాసీ ప్రజలలో, ఈ రాష్ట్రాలలో వివిధ తెగలకు చెందిన 50 శాతం ఆదివాసులు జీవిస్తున్నారు. నాగరిక, మైదాన ప్రాంతాలకు దూరంగా, ప్రత్యేక జీవన విధానం, ఆచార, సంప్రదాయాలు కలిగి, తమచుట్టూ ఉన్న అటవీ ఉత్పత్తులు, సంపదపై ఆధారపడి మనుగడను సాగించే వీరి రక్షణకు, భారత రాజ్యాంగం అటవీ హక్కుల చట్టం – 2006, పెసా-1996 లాంటి చట్టాలను తయారుచేసింది. గ్రామసభ అంగీకారంపై ఆధారపడే ఆయా ప్రాంతాలలో ప్రభుత్వ పథకాల అమలు కొనసాగుతుందని హామీ పడింది. కానీ, పూర్వ బస్తర్ కలెక్టర్గా ఆదివాసుల అభివృద్ధి కొరకు జీవితాన్నంతా ధారపోసిన బి.డి. శర్మ, భారత ప్రభుత్వాల పాలనావిధానాలు, వాటి అమలులో చూపిస్తున్న వివక్ష, వాటి ఉల్లంఘనలను “అమలు కాని హామీల చరిత్ర” గా అభివర్ణించాడు. ఆదివాసీ ప్రాంతాలలో నిక్షిప్తమైన లక్షల, కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదే వారి పాలిటి శాపంగా మారడం గమనిస్తే హృదయం ద్రవించక మానదు.

బ్రిటీష్ పాలన అంతమై, స్వదేశీ పాలన మొదలై 75 సంవత్సరాలు గడిచినా అదివాసీల కష్టాలేమీ తీరలేదు సరికదా భారత పాలకవర్గాలు వలస పాలకులను మించిన దోపిడీదారులుగా వ్యవహరించ సాగాయి. 1968లో ఎన్.ఎం.డి.సి. పేరిట వెలసిన మొదటి మైనింగ్ కంపనీ మొదలుకుని బాల్కో, ఏసిసి, అంబుజా సిమెంట్స్, లాఫార్డ్ ఇండియా లిమిటెడ్, భిలాయ్ స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ ప్లాంట్, రాయ్పూర్ అల్లాయిస్, అంజనీ స్టీల్, బల్దేవ్ అల్లాయిస్, మానెట్ ఇస్పాత్, సెయిల్ లాంటి 175 మైనింగ్ కంపనీలు, పరిశ్రమలు సుందర, సతత హరితారణ్య ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చివేసాయి. మరో వందకు పైగా అనుమతుల దశలో ఉన్నాయి. రాయ్పూర్ నగరం నేడు దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా పరిగణించ బడుతుందంటే అభివృద్ధి కథ అర్ధమవుతుంది.

నేడు యుద్ధకేంద్రంగా మారిన ఛత్తీస్గడ్ రాష్ట్రం, 46 శాతం అడవులకు, 48 ఆదివాసీ తెగలకు ఆశ్రయం కల్పిస్తుంది. దేశంలోని ఖనిజాల ఉత్పత్తిలో 2021-22 లెక్కల ప్రకారం 2వ స్థానాన్ని కలిగి రాష్ట్ర ఆదాయానికి 10 శాతం వాటాను అందిస్తూ, అత్యంత ప్రాధాన్యతను కలిగిఉంది. ఒక్క బస్తర్ డివిజన్ లోని దంతేవాడ జిల్లానుండి, రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా 12, 941 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరడం జరుగుతుంది. దేశంలో లభించే మొత్తం ఇనుప ఖనిజంలో 66 శాతం, 26 శాతం తగరం నిల్వలు, దాదాపు పది లక్షల టన్నుల బాక్సైట్ నిలువలు, లక్షా ముప్ఫైవేల టన్నుల వజ్రాల నిల్వలు, నాలుగు లక్షల ఎనభైవేల టన్నుల బంగారు నిల్వలు, నలభై అయిదు లక్షలకు పైగా బొగ్గు నిల్వలు కేవలం ఛత్తీస్ఘడ్లోనే నిక్షిప్తమై ఉన్నవని ఇండియన్ మినరల్ ఇయర్ బుక్ 2021 పేర్కొనడం గమనార్హం. ఇది ఒక్క ఛత్తీస్ గ‌డ్ కథ మాత్రమే కాదు. దానితో సరిహద్దులు పంచుకుంటున్న ఒడిషా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల వ్యధ కూడా.

ఇటువంటి విధ్వంసకర అభివృద్ధి విధానాలకు, నిర్భందాలకు వ్యతిరేకంగా ఆదివాసీ ప్రజలు మడమ తిప్పని పోరాటాలను కొనసాగిస్తున్నారు. ఒక్క దక్షిణ బస్తర్లోనే, రాంపురం, నంబి, వెచ్ఛాపాల్, నహాది, బెచ్చాఘాట్, ఓర్చా, సిల్గేర్ లాంటి నిరసన శిబిరాలు దాదాపు 25 వరకు మాడ్ బచావో మంచ్, మూల్వాసీ బచావో మంచ్, సర్వ ఆదివాసీ సమాజ్ వంటివి శాంతియుత పద్ధతులలో ఈ నిరసన ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాయి. “జల్, జంగల్, జమీన్, ఇజ్జత్”, “అదివాసీ అస్తిత్వం, స్వయంపాలన” నినాదాలతో 1910లో బ్రిటీష్ వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన నాటి గుండాదూర్ కాలంనుండి, బిర్సాముండా, కొమరం భీం, కానూ-సిద్దుల పోరాట మార్గంలో భారత పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేటి దండకారణ్య అదివాసుల పోరాట పరంపర కూడా. ఈ దేశసంపద విదేశీ కంపనీలకు కాకుండా, దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని, పర్యావరణ విధ్వంసానికి, బలవంతపు నిర్వాసిత్వానికి వ్యతిరేకంగా, తమ చట్టబద్ద హక్కుల సాధనకై అలుపెరుగని పోరాటం చేస్తున్న వారిని మావోయిస్టులుగా, అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేస్తూ పారామిలిటరీ బలగాలతో అణిచివేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే, దండకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతం కాశ్మీర్ తరువాత దేశంలో (దాదాపు ఆరు లక్షల సాయుధబలగాలు, 300 లకు పైగా సైనిక క్యాంపులతో) రెండవ స్థానంలో ఉన్నది. మధ్యభారత అడవుల్లోని లక్షలకోట్ల విలువైన ఖనిజసంపదను విదేశీ కంపనీలకు ధారపోయాలంటే ఆ ప్రాంతంలోని ఆదివాసులను అక్కడినుండి తరిమేయక తప్పదు. మావోయిస్టులు ఒక సాకు మాత్రమే.
డెబ్బై అయిదు సంవత్సరాలుగా తమకు రాజ్యాంగం హామీ పడ్డ హక్కుల సాధనలో అలుపెరుగని పోరాటంలో ఉన్న వారికి మద్దతుగా నిలబడడం మైదాన ప్రాంతాల ప్రజల, ప్రజాస్వామిక వాదుల, సామాజిక ఉద్యమకారుల, మేధావుల, పర్యావరణవాదుల…. రాజకీయపార్టీల, నాయకుల కనీస బాధ్యత. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగవిలువలను, రాజ్యాంగ పీఠిక స్పూర్తి గొప్పదనాన్ని, అక్షరాలలో, మాటలలో కాకుండా ఆచరణలో చూపవలసిన బాధ్యత దానిని నమ్మే ప్రతి ఒక్కరిది. రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని కోల్పోయిన ప్రజల అగ్రహ ప్రకటన సమాజం భరించక తప్పదు.

గత 10 సంవత్సరాలకు పైగా మనువాద, బ్రాహ్మణీయ, సంఘ్ కనుసన్నల్లో బిజేపి పార్టీ ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తున్నది. ప్రజాస్వామ్యమంటేనే విభిన్న రాజకీయాల సంవాదం అన్న సూత్రాన్ని కాలరాస్తూ, తమతో విభేదించిన వారిని తన పంచమాంగ దళాలతో దాడులు చేయిస్తుంది. ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులను శత్రువులుగా ప్రకటించిన గోళ్వాల్కర్ బాటలో, మనువాదానికి, కులవ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాడే దళితులను, అదివాసీ అస్తిత్వం, స్వయంపాలన అంటున్న ఆదివాసులను సైతం శతృవులుగా పరిగణిస్తూ, “వికసిత్ భారత్ – 2017″ లక్ష్యంతో పయనిస్తుంది. మతాన్ని, రాజకీయాలను కలగలిపి అధికారంలోకి వచ్చి నేడు కార్పోరేట్లతో జతకట్టి చట్టబద్దంగా కార్పోరేట్, మనువాద, బ్రాహ్మణీయ, ఫాసిస్ట్” హిందూరాష్ట్ర” ఉద్దేశంతో, మనుస్మృతిని దేశరాజ్యాంగంగా ప్రకటించేందుకు దృఢ సంకల్పంతో సాగుతుంది. అనన్య త్యాగాలతో బ్రిటీష్ వలనవాదులను తరిమికొట్టి సాధించుకున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రం, సమానత్వాలను, లౌకిక, ప్రజాస్వామిక విలువల పునాదిగా, డా. బి.ఆర్. అంబేడ్కర్ చే రాయబడిన భారత రాజ్యాంగానికి సంభవించ బోతున్న ప్రమాదాన్ని నివారించడం, జాతీయ, అంతర్జాతీయ చట్టాలను, 5వ, 6వ షెడ్యూల్డ్ ప్రాంతాల రక్షణలను తుంగలో తొక్కి మధ్యభారతంలో మావోయిస్టులపై పోరాటం పేరుతో జరపుతున్న ఆదివాసీ జాతిహననాన్ని అడ్డుకునేందుకు, రాజకీయ పార్టీలు, దేశభక్తులు, పౌర, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు, సంస్థలు, మేధావులు ఒక్కటిగా కదలవలసిన చారిత్రక సందర్భం ఇది.

భారత్ బచావో అధ్వర్యంలో, ఏప్రిల్ 18, 2025న సుందరయ్య విజ్ఞాన కేంద్రం” వేదికగా, ఆదివాసీ జాతి హననాన్ని అడ్డుకుందాం, షెడ్యూల్డ్ ప్రాంతాలను కాపాడుకుందాం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ పాటించాలనే డిమాండ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆదివాసీ హక్కుల నాయకులు, సామాజిక వేత్తలు, పలు సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.

వక్తలు:
ప్రొ. మనోరంజన్ మహంతి, చైర్మన్, భారత్ బచావో
జస్టిస్ కోల్సీ పాటిల్, చైర్మన్, భారత్ బచావో అడ్వైజరీ కౌన్సిల్
సోనీ సోరీ, ఆదివాసీ హక్కుల నాయకురాలు
జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు
భక్తచరణ్ దాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి
బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ చైర్మన్, తెలంగాణ ప్లానింగ్ కమిషన్
మధుయాష్కి, మాజీ ఎంపి, కాంగ్రెస్
ప్రొ. కోదండరాం, ఎమ్మెల్సీ, అధ్యక్షులు, తెలంగాణ జనసమితి
అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ, కాంగ్రెస్
డా. ఎస్.ఏ. సంపత్కుమార్, ఏఐసిసి సెక్రటరీ, ఛత్తీస్ ఘడ్ ఇంచార్జి
జె.వి. చలపతిరావు, అధికార ప్రతినిధి, సి.పి.ఐ.(ఎం.ఎల్) న్యూడెమాక్రసి
కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి, సి.పి.ఐ.
దాసోజు శ్రవణ్, ఎమ్మెల్సీ, బి.ఆర్.ఎస్.
బేలా భాటియా, మానవహక్కుల కార్యకర్త
ప్రొ. హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త
హిమాంశు కుమార్, ప్రముఖ గాంధేయవాది
విమలక్క, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య
జస్టిస్ చంద్రకుమార్, అధ్యక్షులు, పీస్ డైలాగ్ కమిటి
అల్లం నారాయణ, మాజీ చైర్మన్, తెలంగాణ ప్రెస్ అకాడమీ
కే. శ్రీనివాస్, ప్రముఖ పాత్రికేయులు
దేవీ ప్రసాద్, మాజీ అధ్యక్షులు, టి.ఎన్.జి.వో.
ప్రొ. కే.సీతారామరావు, మాజీ వి.సి., అంబేడ్కర్ యూనివర్సిటి
ప్రొ. అన్వరన్, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటి
బెల్లయ్య నాయక్, చైర్మన్, తెలంగాణ ట్రైబల్ డెవెలప్మెంట్ కార్పోరేషన్
ఎం.డి. రియాజ్, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కమిటి
స్కై బాబ, ముస్లిం థింకర్స్ ఫోరం

భారత్ బచావో
ప్రచురణకర్తలు: డా. గోపినాథ్ ఎం.ఎఫ్., గాదె ఇన్నారెడ్డి, జంజర్ల రమేష్ బాబు
799358490
799553919 9948410798

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad