మీరెవరైనా వియ్యుక్క కథా సంకలనం చదివారా? ప్రతి సంపుటంలోనూ కామ్రేడ్ మిడ్కో కథ ఒకటి ఉంటుంది. మిడ్కో అంటే మిణుగురు అని అర్థమట… చీకటిని చిలికిన ఆ మిణుగురు ఇప్పుడు నిస్సత్తువగా నేల రాలింది. కాదు కాదు తనంత తానుగా సృష్టించిన యుద్దంలో వెలుతురు మిణుకు నేల రాలింది. రక్తపు గాయాలతో ఆమె మనముందు మళ్ళీ నిలుచుంది.
ఇది ఒక వ్యక్తిని కోల్పోయిన బాధ మాత్రమే కాదు… ఇది ఒక విప్లవకారిణిని, ఒక గొప్ప రచయిత్రిని, ఒక ఉద్యమ స్ఫూర్తిని కోల్పోయిన విషాదం. #మిడ్కో జీవితం కలం, కర్రా, కాల్పుల మధ్య సాగిన పోరాట గాథ. ఆమె కథల్లోని ప్రతీ అక్షరం ప్రజల హక్కుల కోసం రాయబడ్డదే.
మొన్ననే హిమాంశు కుమార్ రాసిన వ్యాసాన్ని మరోసారి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో కొంత భాగాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాను…
“2023 డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఒక నెల తర్వాత 2024 జనవరి 1నాడు 6 నెలల ఆదివాసీ శిశువును పోలీసులు కాల్చి చంపారు. ఒక సంవత్సరం లోపు 14 ఏళ్ల బాలికను కాల్చి చంపారు. 16 ఏళ్ల మూగ బాలికపై అత్యాచారం చేసి, ఆ తరువాత కాల్చి చంపారు. ఇప్పటివరకు దాదాపు 400 మంది ఆదివాసులను చంపారు. వీరిలో మహిళలు దాదాపు 140 మంది ఉన్నారు” సరే వీళ్లంతా ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు నక్సలైట్లే అని అంగీకరించే ఆలోచించినా కూడా…. 140 మంది మహిళలు తుపాకులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకని పోరాటం చేయాల్సి వచ్చింది? ఏ స్త్రీ కూడా కేవలం సరదా కోసం తుపాకీని ఎత్తదు; ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడదు కూడా. దీని అర్థం ఆ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అలా ఉండడం వల్లనే మహిళలు ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాల్సి వచ్చింది”
ఒక దేశం దాని సొంత పౌరుల ఆస్తినే కొల్లగొట్టటానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవటం కోసం ప్రాణాలు ఇస్తున్న వీళ్లంతా… మీడియా దృష్టిలో, ఇంకొందరి కోణంలో “దేశద్రోహులుగా” పిలవబడుతున్నారు. లక్షలకోట్ల విలువైన ఖనిజ సంపదలని దోచుకొని విదేశీకంపెనీలకు అమ్ముకోవటానికి చేస్తున్న దమనకాండలో మరణిస్తున్న వీళ్లంతా చంపబడుతున్నారని తెలిసినా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న మీడియా, పౌరులుగా ఏదో ఒకనాటికి మనమంతా పశ్చాత్తాపం చెందక తప్పదు. కానీ ఆనాటికి సహజవనరులన్నీ కోల్పోయి, లక్షల ఆదివాసులని పణంగా పెట్టిన ఈ నేల ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఇప్పటికైనా మేలుకొమ్మన్న హెచ్చరికగా ఇవాళ మిడ్కో నేలకొరిగింది…
“వాళ్ళు అడవిలో ఎందుకూ? ఇక్కడికి వచ్చి పోరాటం చేయొచ్చుగా” అని సన్నాయి నొక్కుల చచ్చు మేధోవర్గపు మాటలు చెప్పే వాళ్లంతా సాయిబాబా విషయంలో ఏం చేశారు? వీవీ విషయంలో ఏం చేస్తున్నారు? వేలాదిగా కనీసం విచారణకు కూడా నోచుకోని ఆదివాసీ, రాజకీయ ఖైదీల విషయంలో ఎంత చొరవ చూపించారు? స్టాన్ స్వామి, అగ్నివేశ్లాంటి ఎందరి మరణాలకు వీళ్ళంతా స్పందించారు??
ఇక్కడ దోపిడీ ఉన్నంత వరకూ పోరాటం ఉంటుంది…. ఇప్పుడు చేస్తున్న అధికారిక హత్యల తరవాత మైదాన ప్రాంత ఆలోచనా పరుల మీదా ఈ దాడి జరగనుంది. నట్టనడి నగరంలోనే ఆక్రమణలని అడ్డుకోని వాళ్లం…. అడవిని పట్టించుకుంటామా?
చూస్తూనే ఉంటాం… జోహార్లు చెబుతూనే ఉంటాం… ఏదో ఒకనాడు ఎందుకూ పనికి రాని నిస్సహాయ చావులు చచ్చి కాలంలో కలిసి పోతాం. వాళ్ల బాటలో నడవమని చెప్పటం లేదుగానీ… ఇప్పుడు మనమౌనం కచ్చితంగా ఒక యుద్దనేరమే అని అంగీకరించండి…
అక్కాలార.. అన్నాలార… బిడ్డాలార… కొడుకూలార….
వీరులార మీకు ఎర్రెర దందాలు…. పాదాపాదానా పరిపరి దండాలూ..
-నరేష్ కుమార్ సూఫీ