ఆదివాసీ విప్లవ యోధుడు,గోండు బిడ్డ, కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని కేరమేరి మండలం చల్ బరిడి గ్రామానికి చెందిన కోరేంగా గోవిందరావు మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. మావోయిస్టు పార్టీ సభ్యుడైన గోవిందరావు తన తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేసిన నిబద్దతగల విప్లవకారుడని మావోయిస్టుపార్టీ తెలంగాణ రాష్ట్రకమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్ ప్రకటన పూర్తి పాఠం….
ఆదివాసి కొమరంభీం వారసుడు, ఆదివాసి గోండు బిడ్డ కామ్రేడ్ కోరేంగా గోవిందరావుకు విప్లవ జోహార్లు
కా. కోరేంగా గోవిందరావు 22-3-2025 నాడు రాత్రి 12 గంటలకు అనారోగ్యంతో (వయసు 75 సం.రాలు) కొమురం జిల్లా- ఆసిఫాబాద్ జిల్లాలోని కేరమేరి మండలం చల్ బరిడి గ్రామంలో తుదిశ్వాస విడిచినాడు.
కా. కోరేంగా గోవిందరావు జోడేఘాట్-బాబేఝరి (కొమురంభీం గ్రామం) ప్రాంతంలో 75 సం.రాల క్రితం పుట్టిపెరిగినాడు. కోమురంభీం పోరాటపటిమను, వారసత్వాన్ని కొనసాగించాడు. కేరమేరి-ఆసిఫాబాద్ ప్రాంతంలో గోవిందరావు చిపరచితుడు. ఇంద్రవెల్లి పోరాటం నుండి తుదిశ్వాస విడిచే వరకు నీరు, భూమి, అడవి స్వయం పరిపాలనకై ఆదివాసి హక్కుల కోసం ఆదివాసి గొంతుకగా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నిరంతరం పోరాడినాడు. 1/70, పెసా, 1996 అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమించారు. అమరుడు సిడాం శంభుతో కలిసి తుడుందెబ్బను స్థాపించి చివరి వరకు తుడుందెబ్బ పోరాట వారసత్వాన్ని కొనసాగించాడు.
1980 నుండి మంగి ప్రాంతంలో మావోయిస్టు దళం కొనసాగింది. అమరులు కా. జగదీష్, కా. రమేషన్న, కా. శేషన్న తోటి చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడు. పీడిత ప్రజలను-మావోయిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గ్రామం మీద, కుటుంబం మీద అనేక సార్లు దాడులను చేసారు. అరెస్టు చేసి కేరమేరి పోలీసు స్టేషన్ కు తీసుకపోయి అక్రమ కేసులు బనాయించారు. అయినప్పటికీ ఏ రోజు కూడా భయపడలేదు. 1980 నుండి 2025 వరకు ప్రజల పక్షం వహించారు. కొమురంభీం పోరాట వారసత్వాన్ని కొనసాగించాడు. కా. కోరేంగా గోవిందరావు సీనియర్ పార్టీ సభ్యుడు. కష్ట కాలంలో పార్టీని కాపాడుకున్నాడు.
కా. కోరేంగా గోవిందరావు కుటుంబ సభ్యులు అందరిని కూడా ప్రజాసంఘాలలో పని చేసే విధంగా ప్రోత్సహించాడు. తన సొంత కొడుకు కా. కోరేంగా పరబతిరావు పార్టీ తోటి సంబంధాలు ఉన్నాయని కేరమేరి లో పోలీసులు ఆక్సిడెంట్ చేసి చంపివేసారు. అయినప్పటికీ ఆదివాసి ప్రజల హక్కుల కొరకు నిరంతరం కృషి చేశాడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మావోయిస్టుల తోటి 2004లో చర్చలు కొనసాగించింది. ఆ కాలంలో మావోయిస్టు పార్టీ ఆసిఫాబాద్ మండలం మొవాడ గ్రామంలో 45 అడుగుల జిల్లా అమరవీరుల స్థూపం నిర్మించి ఆవిష్కరించింది. ఆ స్థూప నిర్మాణ పని కొరకు ఏర్పాటు చేసిన కమిటీలో ఉండి క్రియాశీలంగా పనిచేశాడు. స్థూపం ఆవిష్కరణ సభకు వేలాది మంది ప్రజలను తరలించడంలో కృషి సలిపినాడు.
కా. కోరేంగా గోవిందరావు అమరుడు కొమురంభీం వారసత్వాన్ని కొనసాగిస్తూ-1980 నుండి 2025 వరకు జల్-జంగల్- జమీన్ కొరకు, ఆదివాసి హక్కుల కొరకు ఉద్యమించాడు. కా. కోరేంగా గోవిందరావు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ (మావోయిస్టు) సంతాపం తెలియజేస్తూ విప్లవ జోహార్లు అర్పిస్తున్నది. తన ఆశయాలను ముందుకు తీసుకపోవాలి.
కామ్రేడ్ కోరేంగా గోవిందరావు అమర్ హై!
జగన్,
అధికార ప్రతినిధి,
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు),
తెలంగాణ రాష్ట్ర కమిటీ