2023 డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చింది. ఒక నెల తర్వాత 2024 జనవరి 1నాడు 6 నెలల ఆదివాసీ శిశువును పోలీసులు కాల్చి చంపారు. ఒక సంవత్సరంలోపు 14 ఏళ్ల బాలికను కాల్చి చంపారు. 16 ఏళ్ల మూగ బాలికపై అత్యాచారం చేసి, ఆ తరువాత కాల్చి చంపారు. ఇప్పటివరకు దాదాపు 400 మంది ఆదివాసులను చంపారు. వీరిలో మహిళలు దాదాపు 140 మంది ఉన్నారు.
చంపిన ఆదివాసులందరూ మావోయిస్టులే అని ప్రభుత్వం చెబుతున్నట్లు మనం అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం ఒక సంవత్సరంలో 140 మంది మహిళలను హత్య చేయడం అనేది చాలా పెద్ద విషయం.
చంపిన మహిళలందరూ నక్సలైట్లే అని ప్రభుత్వం చేసిన వాదనను అంగీకరించినప్పటికీ, అనేక తీవ్రమైన ప్రశ్నలు ఇప్పటికీ తలెత్తుతాయి.
140 మంది మహిళలు తుపాకులు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకని పోరాటం చేయాల్సి వచ్చింది? ఏ స్త్రీ కూడా కేవలం సరదా కోసం తుపాకీని ఎత్తదు; ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడదు కూడా.
దీని అర్థం ఆ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అలా ఉండడం వల్లనే మహిళలు ఆ సమస్యలకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాల్సి వచ్చింది.
ఏ పరిస్థితుల వల్ల మహిళలు స్వయంగా ఆయుధాలు చేపట్టాల్సి వచ్చిందో అలాంటి పరిస్థితులను పరిష్కరించడం అనేది ఒక ప్రజాస్వామ్య దేశ ప్రభుత్వ బాధ్యత. అటువంటి సామాజిక-ఆర్థిక, రాజకీయ పరిస్థితులను పరిష్కరించడానికి బదులుగా, భారత ప్రభుత్వం ఆదివాసీ మహిళలను చంపివేసే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంది; మహిళల మృతదేహాలను పెద్ద ఎత్తున అడవుల్లో పడవేయడాన్ని ఎంచుకుంది.
భారతదేశంలోని ఆదివాసీ సంస్థలు ఇంత పెద్ద సంఖ్యలో జరుగుతున్న ఆదివాసీ మహిళల హత్యలపై ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఈ విషయంపై వామపక్ష పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? భారతదేశ స్త్రీవాద ఉద్యమం, మహిళా సంస్థలు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నాయి? ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం చట్టబద్ధమైన ప్రశ్నలు అడగకుండా మనల్ని ఆపుతున్న భయం, సంకోచం ఏమిటి? భారత దేశంలో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తన స్వంత దేశంలోని ఆదివాసీ మహిళలను ఇంత పెద్ద సంఖ్యలో చంపడం మన సమాజంలో ఎటువంటి ప్రశ్నలను లేవనెత్తదా?
- -హిమాంశు కుమార్
- (హిమాంశు కుమార్ గాంధేయ కార్యకర్త; దేశవ్యాప్తంగా అనేక సైకిల్ యాత్రలకు ప్రసిద్ధి చెందారు.)
- https://janchowk.com/ నుంచి – తెలుగు – పద్మ కొండిపర్తి