చత్తీస్ గడ్ ,బీజాపూర్ పట్టణంలో ముఖేష్ చంద్రకర్ అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్టు హత్యకు గురైన విషయం తెలిసిందే. ముఖేష్ NDTV న్యూస్ ఛానెల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తూనే యూ ట్యూబ్ లో ‘బస్తర్ జంక్షన్’ అనే ఛానల్ ను నడుపుతున్నాడు. బీజాపూర్ జిల్లాలో గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ముఖేష్ చంద్రకర్ చేసిన ఓ స్టోరీ NDTVలో డిసెంబర్ 25న ప్రసారమయ్యింది. దీంతో ఈ నిర్మాణ పనుల కాంట్రాక్టర్ సురేశ్ చంద్రాకర్.. జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్పై కక్ష పెట్టుకున్నాడు.అప్పటికే రంగంలోకి దిగిన అధికారులు కాంట్రాక్టర్కు చెందిన మూడు బ్యాంకు ఖాతాలను హోల్డ్లో ఉంచారు. దాంతో ముఖేష్ ను హత్యచేయాలనే ప్లాన్ చేసిన సురేష్ చంద్రకర్ తోపాటు అతని సోదరులు రితేష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, సూపర్వైజర్ మహేంద్ర రామ్టేకేల తో కలిసి జర్నలిస్టు ముఖేష్ ను హత్యచేశారు. జనవరి 1న ముఖేష్ అదృశ్యమైనప్పటి నుండి వెతుకుతున్న పోలీసులకు 3వ తేదీన బీజాపూర్ పట్టణంలోని చత్తన్పర బస్తీలో సురేష్ చంద్రకర్కు చెందిన సెప్టిక్ ట్యాంక్లో అతని మృతదేహం లభ్యమైంది. జర్నలిస్టును హత్యచేసిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ బీజేపీ నాయకుడు. అతనికి చాలాకాలంగా ప్రభుత్వం, పోలీసుల వైపునుండి అన్ని రకాల సహాయసహకారాలు అందుతున్నాయనే వార్తలు స్థానిక మీడియా ప్రచురించింది. ఒక్క సురేష్ కే కాకుండా మావోయిస్టులను అణిచివేసేందుకు రోడ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం , వాటిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల అవినీతిని చూసీ చూడనట్టు ఉంటుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యపై మావోయిస్టు పార్టీ దండకారణ్య సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటన పూర్తి పాఠం…
మా పార్టీకి 2025 జనవరి 3న వార్తల మాధ్యమం ద్వారా ముఖేష్ చంద్రకర్ హత్య వార్త అందింది. ఈ హత్యను ఖండిస్తున్నాం.ముఖేష్ చంద్రకర్ గిరిజన ప్రాంతంలో పుట్టి, చదువుకుని అభివృద్ధి సాధించి, స్థానిక జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు . ఆయన మీడియా మాధ్యమం ద్వారా అనేక ప్రజా సమస్యలను, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలను వెల్లడిస్తూ తన పాత్రికేయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నారు.
అభివృద్ధి పేరుతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రోడ్లు, వంతెనలు, కల్వర్టులు నిర్మించేందుకు బీజేపీ మిత్రులకు మద్దతు ఇస్తోంది. ఈ కాంట్రాక్టర్లు అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తూ ‘డబ్బులు తినే పిట్టల్లా’ వ్యవహరిస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల అండదండలతోనే పనులు జరుగుతున్నాయి. ఇదీ మోడీ అభివృద్ధి నమూనా. ముఖేష్ చంద్రాకర్ హత్యలో వీరంతా ప్రమేయం ఉండే అవకాశం ఉందని, దీనిపై విచారణ జరగాలి.
ఈ విషాద సమయంలో ముఖేష్, చంద్రకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మా పార్టీ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తోంది.
సమత
అధికార ప్రతినిధి
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)
సౌత్ సబ్ జోనల్ బ్యూరో
దండకారణ్యం