Menu

డిసెంబర్ 28న ఐక్యంకానున్న రెండు సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమాక్రసీలు

anadmin 6 months ago 0 71

2013 నుండి విడిపోయి రెండు పార్టీలుగా కొనసాగుతున్న రెండు న్యూ డెమాక్రసీ పార్టీలు ఐక్యమవనున్నాయని రెండు పార్టీల నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 28 న ఐక్యతా ప్రకటన చేయనున్నాయి.

ప్రకటన పూర్తి పాఠం…

భారత విప్లవోద్యమం దశాబ్దాల తరబడి విప్లవోద్యమ అభివృద్ధి కోసం, లెక్కలేనన్ని పోరాటాలు సాగించి, గణనీయమైన విజయాలు సాధించింది, యింకా సాధించవలసింది ఎంతో వున్నది. ఈ కాలంలో అనేక చీలికలు ఎదుర్కొంటూ వస్తూన్నది. మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానం ప్రాపంచిక దృక్పథంతో చారిత్రక అవసరంగా 1969లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్ట్) గత 50 ఏళ్లకు పైగా తన లక్ష్యమైన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడంలో యింకా వెనకబడే వున్నది. ఈ పోరాట క్రమంలో వేలాదిమంది కామ్రేడ్స్ అమరులయ్యారు. దేశవ్యాప్తంగా అనేకానేకమంది ఎన్నో కష్టాలకు, నిర్బంధాలకు, చిత్రహింసలకు, బూటకపు ఎన్ కౌంటర్లకు గురయ్యారు. అమరుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో విప్లవ సంస్థలన్నీ ఏకం కావలసిన అవసరాన్ని ఎన్నో ఏళ్లుగా చాలా విప్లవ సంస్థలు గుర్తిస్తున్నప్పటికీ, అవి కనీస స్థాయిలో కూడా సఫలం కాలేకపోతున్నాయి.

ఈ స్థితిలో ఒకే సైద్ధాంతిక, రాజకీయ విధానం కలిగిన సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ 2013 నుండి రెండు పార్టీలుగా విడిపోయి కొనసాగుతున్న క్రమంలోనూ అఖిలభారత స్థాయిలో నాలుగు విప్లవ సంస్థల మధ్య ఐక్యతా చర్చలు గత ఐదారు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ, ఆశించినంత పురోగతి పెద్దగా లేదు. ఈ నేపథ్యంలోనే సైద్ధాంతికంగానూ, రాజకీయపరంగానూ భావసారూప్యం కలిగివున్న రెండు సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు గత ఎనిమిది నెలలుగా ఐక్యతా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఐక్యతా చర్చలు ఫలప్రదమై, డిసెంబర్ 28న హైదరాబాద్లో రెండు పార్టీల ఐక్యతా ప్రకటన చేయాలని నిర్ణయించాయి.

ఈ సందర్భంగా డిసెంబర్ 28న రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తలపెట్టిన ఐక్యతా ప్రకటన సభలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ దర్శన్ సి‍ంగ్ కట్కర్ ముఖ్యఅతిథిగా బహిరంగ సభను జరపబోతున్నాము. ఈ బహిరంగ సభలో ఉభయ సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కామ్రేడ్స్ సాదినేని వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకట్రామయ్య, జె.వి.చలపతిరావు, పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కె.గోవర్ధన్ తో పాటు వి. సంధ్య, జి. ఝాన్సీ తదితరులు ప్రసంగిస్తారు. ఈ ఐక్యతా బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు కోరుతున్నాయి.

భారత విప్లవోద్యంలో ఐక్యతా క్రమానికి, పురోగమనానికి యీ రెండు పార్టీల ఐక్యత ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.ఇది భవిష్యత్తులో మరిన్ని విప్లవ సంస్థల ఐక్యతకు స్ఫూర్తిగా, ప్రేరణగా నిలుస్తుందని ఆశాభావాన్ని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాము.

20-12-2024
విప్లవాభినందనలతో…
సాదినేని వెంకటేశ్వరరావు
జె.వి.చలపతిరావు
వేములపల్లి వెంకట్రామయ్య
కె. గోవర్ధన్

సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad