ములుగుజిల్లా, ఏటూరు నాగారం చల్పాక అడవుల్లో డిశంబర్ 1వ తేదీన అసలేంజరిగిందో మావోయిస్టు పార్టీ వెల్లడించింది. నవంబర్ 30వ తేదీన చల్పాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామానికి దళం వెళ్ళిన తర్వాత జరిగిన విషయాలను మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో తెలిపారు.
జగన్ ప్రకటన పూర్తి పాఠం.
ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న మా దళం చల్పాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రూవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహం కోల్పోయే లాగా చేశారు. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుఝామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారు. శతృవు మోస పూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు @ పాపన్న, బద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లయ్య @(మధు, కోటి జెఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్బుడు), ముచాకీ అందాల్ @ కరుణాకర్ (ఇల్లెందు -నర్సంపేట్ ఏరియా కమిటి సభ్యుడు), ముచాకీ బూమే@ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు ), పూనెం చోటు @కిశోర్( రీజినల్ కంపెనీ -2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడు), కర్టం కామాల్ (రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు), కా. జైసింగ్ (ఏటూర్ నాగారం-మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు)లు ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నది. యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయప్రదం చేయాలని కోరుతున్నది. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాభాల కోసమే దోపిడి విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము.
జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)
