మూలవాసీ బచావో మంచ్ బస్తర్ ప్రాంత వాసుల పోరాట సంస్థ. ఆదివాసీల హక్కుల కోసం 3 సంవత్సరాలుగా బస్తర్లో 30కి పైగా ప్రాంతాల్లో ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థను ప్రభుత్వం 2024 అక్టోబర్ 30న నిషేధించింది. ఈ సంస్థను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ చత్తీస్గఢ్ ప్రభుత్వానికి 113 మంది సివిల్ సొసైటీ సభ్యులు లేఖ రాశారు. కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ (CDRO), సివిల్ లిబర్టీస్ కమిటీ (CLC), అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ (AFDR, పంజాబ్), అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (APDR) వంటి ప్రజాస్వామ్య హక్కుల సంస్థల ప్రతినిధులు డాక్టర్ ఆనంద్ తెల్తుంబ్డే, ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ జగ్మోహన్ సింగ్, ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతి లాంటి వారు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఈ లేఖ రాశారు.
మూలవాసీ బచావో మంచ్పై నిషేధాన్ని ఎత్తివేయాలి
TO,
గౌరవనీయులైన విష్ణు దేవ సాయి,
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
బస్తర్,
దిగువ సంతకం చేసిన మేము చత్తీస్గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద మూలవాసీ బచావో మంచ్పై నిషేధం విధించడాన్ని ఖండిస్తున్నాము. ఈ చర్య రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన హక్కులను బలహీన పరుస్తుంది. రోజురోజుకూ శాంతియుత ఆందోళనల పట్ల పెరుగుతున్న ప్రభుత్వ అసహనం ఆందోళన కలిగిస్తోంది. విధ్వంసక మైనింగ్ ప్రాజెక్టులు, సైనికీకరణ, కార్పొరేట్ దోపిడీ కారణంగా గృహాలు, భూములు, గౌరవం కోల్పోవడానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమూహాల్ని నిషేధించడాన్ని సమర్థించుకోవడంలో ప్రభుత్వ నోటిఫికేషన్ విఫలమైంది.
మూలవాసి బచావో మంచ్ బలవంతపు వలసలను, పర్యావరణ విధ్వంసాన్ని, సాంస్కృతిక అస్థిత్వం కోల్పోవడాన్ని ప్రతిఘటించే ఆదివాసీల గొంతు. ఇలాంటి సంస్థను చట్టవిరుద్ధమైన సంస్థగా ముద్రవేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు భంగంకలిగించడమే. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కు, శాంతియుత సభ, గౌరవప్రదమైన జీవితం లాంటి హక్కులను అణచివేయడమే. కొన్నేళ్లుగా పౌర సమాజం అనేక నివేదికల ద్వారా అభివృద్ధి పేరిట నిర్వాసితులవుతున్న ఆదివాసీల ఆరోగ్యం, విద్య స్థితుగతులను వర్ణిస్తున్నాయి. పంచాయత్ (ఎక్స్టెన్షన్ టూ షెడ్యూల్ ఏరియాస్) – పెసా చట్టంతో పాటు, ఆదివాసీల రక్షణకు హామీ ఇచ్చే 5వ షెడ్యూల్ పట్ల, స్వయం పాలన హక్కు, ప్రాజెక్టులకు స్థానికుల సమ్మతి తప్పనిసరి లాంటి హక్కుల పట్ల ఆందోళనకలుగుతోంది.
మైనింగ్ ప్రాజెక్టుల కోసం గ్రామ సభలను తప్పుదోవ పట్టించడంతో పాటు, ఆదివాసీ సమూహాల రక్షణకు ఉద్దేశించిన హక్కులను తుడివేస్తు్న్నారు. వారి రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల పట్ల ఈ వ్యవస్థాగత నిర్లక్ష్యం, కార్పొరేట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆదివాసీల జీవితాలను, గౌరవాన్ని బలిపెట్టడం ఆందోళన కలిగిస్తోంది.
మూలవాసీ బచావో మంచ్ విధ్వంసకర మైనింగ్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీల హక్కుల కోసం శాంతియుతమైన నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లో మైనింగ్ కంపెనీలు ఓపెన్ కాస్ట్ల వల్ల నదులు, పర్యావరణం పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఛత్తీస్గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఆధారంగా ప్రభుత్వం మూలవాసీ బచావో మంచ్ను నిషేధించడం, ప్రజాస్వామిక వాదనను, ఆదివాసీ హక్కులను అణచివేయడం ప్రమాదకరం.
ఇలాంటి చట్టాలు చరిత్రకు మాయని మచ్చలాంటి. మూలవాసీ బచావో మంచ్ నిషేధం కేవలం ఒక సంస్థపై దాడి మాత్రమే కాదు.. ఇది అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక హెచ్చరిక లాంటిది. ఈ చర్య ద్వారా ప్రతిపక్షం ఎంత న్యాయమైనది, శాంతియుతమైనదైనా సహించేది లేదని ప్రభుత్వం సందేశమిస్తోంది.
ఈ చర్యను పునఃపరిశీలించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. మూలవాసి బచావోపై నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అరెస్టు చేసిన ఎంబీఎం సభ్యులను విడుదల చేసి, మైనింగ్, మిలిటరైజేషన్ను వ్యతిరేకిస్తున్న ఆదివాసీలతో చర్చలు జరపండి.
ఆదివాసీల డిమాండ్లను వినకుండా, వారిని గౌరవించకుండా, వారికి రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తి హక్కును కాపాడకుండా అణచివేత, హింస మార్గాన్ని అనుసరించడం సరైంది కాదు. మిలిటరైజేషన్, కార్పొరేట్ విధ్వంసం గాయాలను మరింత పెద్దవి చేస్తాయి. అందుకే ఈ ప్రాంత ప్రజల బాధ్యతకు కట్టుబడి ఉంటామని చేసిన ప్రమాణాన్ని చత్తీస్గఢ్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం.




