ఏటూరు నాగారం చల్పాక అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని అందులో ఏడుగురు మావోయిస్టులు మరణించారని చెప్తున్న పోలీసుల మాటలు అబద్దమని ఆ ఏడుగురు తినే ఆహారంలో విషం కలిపి కస్టడీలోకి తీసుకుని అనంతరం వారిని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపిస్తున్న పౌరహక్కుల సంఘం ఈ అంశంపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏడుగురి భౌతికకాయాలను రేపటి వరకు భద్రపర్చాలని ఆదేశిస్తూ కేసును రేపటికి వాయిదా వేసింది.
మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారని కోర్టుకు పౌరహక్కుల్ అసంఘం తరపు న్యాయవాది వివరించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని న్యాయవాది కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరుపు న్యాయవాది… అడవిలో పోలీసులు భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించారని న్యాయస్థానానికి తెలిపారు.కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించామని అన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్లు కోర్టుకు తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా… పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి (డిసెంబర్ 3వ తేదీ) వరకూ మృతదేహాలను భద్రపరచాలని.. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.