Menu

స్టాన్ స్వామి స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన‌ మద్రాసు హైకోర్టు

anadmin 7 months ago 0 103

ముంబయి జైల్లో మరణించిన ఫాదర్ స్టాన్ స్వామి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను మద్రాసు హైకోర్టు తోసి పుచ్చింది. భీమా కోరేగావ్ కేసులో ముంబయ్ జైల్లో ఉండిన స్టాన్ స్వామి మెడికల్ బెయిల్ కోసం నిరీక్షిస్తూ జూలై 5, 2021న మరణించాడు. జార్ఖండ్ లో ఒక చర్చిలో ఫాదర్ గా ఉన్న స్టాన్ స్వామి తన చుట్టూ ఉన్న గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాడు. గిరిజనుల పోరాటానికి అనేక రకాల సహాయ సహకారాలు అందించాడు. గిరిజనులలో ఆయన కల్పిస్తున్న చైతన్యం, వారిపోరాటానికి ఆయన అందిస్తున్న అండదండలు చూసి స్టాన్ స్వామిపై, దేశ‌వ్యాప్తంగా ఉన్న మేదావులైన మరో 15 మందితో కలిపి కల్పిత భీమా కోరేగావ్ కేసును బనాయించారు. చనిపోయేనాటికి 83 ఏళ్ళ వయసుగల స్టాన్ స్వామి పార్కిన్ సన్ వ్యాధితో సహా ఇతర‌ తీవ్ర అనారోగ్యసమస్యలతో సతమతమయినప్పటికీ జైలు అధికారులు ఆయనకు సరైన వైద్య సదుపాయాలు అందించలేదు. ఆయన తన నోటితో సరిగా మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయనకు ఒక స్ట్రా ఇవ్వడనికి కూడా జైలు అధికారులు నిరాకరించారు. ఆయనను అనేక రకాలుగా వేదించి చివరకు ఆయన మరణానికి కారణమయ్యారు.

కాగా, ఆయన ఙాపకార్దం తన ప్రైవేటు స్థలంలో స్తూపాన్ని నిర్మించేందుకు తమిళనాడు సేలంకు చెందిన సామాజిక కార్యకర్త‌ పీయూష్ సేథియా నిర్ణయించుకోగా పీయూష్ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. స్టాన్ స్వామి స్మారక స్తూపాన్ని నిర్మించడానికి వీలులేదని ధర్మపురి తహసీల్దార్ జూలై 16, 2021న జారీ చేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు జస్టిస్ ఎం. దండపాణి కొట్టివేశారు.ఒక వ్యక్తి తన ప్రైవేట్ భూమిలో స్మారక చిహ్నాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్టించకుండా రాష్ట్రం ప్రభుత్వం ఆపజాలదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

” ఫాదర్ స్టాన్ స్వామి గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంతే కాకుండా సాధారణ సూత్రం ప్రకారం, చట్టం పౌరులకు వారి స్వంత ప్రైవేట్ ఆస్తిలో విగ్రహాలను ప్రతిష్టించే హక్కును అందిస్తుంది. రెండు వర్గాల మధ్య లేదా ఒక నిర్దిష్ట సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదనేదే ఏకైక ఆంక్ష. ప్రైవేట్ పట్టా భూమిలో విగ్రహం ఏర్పాటుకు అనుమతించడానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకి లేదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. సేథియా తన భూమిలో స్టాన్ స్వామి స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి అన్ని ఖర్చులను తానే భరించాలని కూడా కోర్టు పేర్కొంది.

2021లో సేథియా జిల్లా అధికారుల ముందు చేసిన విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించడంతో న్యాయవాది వి సురేష్ ద్వారా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆదివాసీ వర్గాల కోసం స్టాన్ స్వామి చేసిన కృషితో తాను స్ఫూర్తి పొందానని, దివంగత కార్యకర్తను తాను గురువుగా భావించానని ఆయన కోర్టుకు తెలిపారు. అందుకే స్టాన్ స్వామిని స్మరించుకుంటూ తన సొంత స్థలంలో స్మారక చిహ్నాన్ని నిర్మించుకోవాలని పీయూష్ సేథియా ఆకాంక్షించారు.

అయితే, ఈ పిటిషన్‌ను రాష్ట్ర, జిల్లా అధికారులు వ్యతిరేకించారు, వారు ప్రతిపాదిత స్మారక చిహ్నం “నక్సల్స్, మావోయిస్టులకు సంబంధించిన వ్యక్తి యొక్క కార్యక్రమాలను స్మరించుకునేలా ఉంటుందని వాదించారు.అటువంటి స్మారకం ఆ ప్రాంతంలో “శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం కలిగిస్తుంది” అని కూడా రాష్ట్రం వాదించింది.

అయితే, సేథియా స్మారకాన్ని నిర్మించడం వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పిటిషన్‌ను అనుమతించేందుకు తాము మొగ్గు చూపుతున్నట్లు హైకోర్టు పేర్కొంది.

ధర్మపురి జిల్లా, నల్లంపల్లి తాలూకా, నెక్కుండి గ్రామంలోని సర్వే నెం.382/4, 391లోని తన ప్రైవేట్ పట్టా భూమిలో స్టాన్ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad