Menu

కొడుకు కోసం ఎదురు చూస్తున్న తల్లికి ఆ కొడుకు ఇక ‘లేడు’ అని తెలిసినప్పుడు…

anadmin 7 months ago 0 433

(పీపల్ మీడియా peepalmedia.com కన్నడ వెబ్ సైట్ లో జర్నలిస్టు రాజేశ్ రావ్ పుత్తూరు రాసిన కథనం)

ఆ తల్లి కన్నీళ్లు యింకా కళ్ళముందు కనిపిస్తున్నాయి. కొడుకు కోసం ఎదురు చూస్తున్న ఆమె ‘ఇక లేడు’ అనే వార్త విని ఏడ్చిన తీరు ఎప్పటికీ మరిచిపోలేను. దాంతో పాటు తన కొడుకు అలా ఎందుకయ్యాడో చెప్పిన ఆమె కన్నీటి గాధ ఈ నాటికీ చెవిలో ప్రతిధ్వనిస్తోంది.
కొడుకు తమను వదిలిపెట్టి వెళ్ళి సంవత్సరాలు గడచిపోయినా, ఇవాళ కాకుంటే రేపైనా వస్తాడు కదా అని ఎదురు చూస్తున్న ఆమెకు ఆ రోజు కొడుకు మరణించిన వార్త పిడుగులా మీద పడింది. ఆమె రోదన ఆ అడవి అడుగడుగునా వ్యాపించి అక్కడే కరిగిపోయింది.
అయితే వాస్తవానికి ఆ రోజు ఆమె కొడుకు మరణించలేదు. తప్పుడు వార్త ఆమెకు చేరింది. కానీ ఈసారి నిజంగానే ఆమె కొడుకు ఎన్‌కౌంటర్‌కు బలయ్యాడు. అతను ఎవరో కాదు విక్రమ్ గౌడ.
అది 2007 సంవత్సరం నాటి గాథ. చిక్కమగళూరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో విక్రమ్ గౌడ చనిపోయాడు అనే సమాచారాన్ని పోలీసులే ఇచ్చారు. ఉడుపిలో వున్న నేను, కెమెరామెన్‌ బైక్ మీద కబ్బినాలే వైపు ప్రయాణం ప్రారంభించాం. హెబ్రి దాటి కబ్బినాలె రోడ్డు ఎక్కగానే ఎఎన్‌ఎఫ్ (నక్సల్ వ్యతిరేక బలగం) మమ్మల్ని ఆపి ముందుకు వెళ్లడానికి వీల్లేదు అన్నారు. కార్కాల పోలీసు ఆఫీసర్‌ను సంప్రదించి ఎలాగోలా అనుమతి సంపాదించి బయలుదేరాం. మధ్య మధ్యలో అక్కడక్కడ్ ఎఎన్‌ఎఫ్ బలగాలు; నక్సల్ గుంపు దాడి చేయవచ్చు అనే భయం మాకూ వుండింది. అలాగే కొంతదూరం మోటారు సైకిల్ మీద వెళ్ళి ఇక రోడ్డు లేకపోవడంతో సుమారు మూడు కిలో మీటర్లు నడిచి కబ్బినాలె చేరుకున్నాం.
“విక్రమ్ గౌడ ఇల్లు ఎక్కడ అన్నా” అని ఒకరిని అడిగితే అతను మమ్మల్ని విచిత్రంగా చూసి, “రెండు ఫర్లాంగులు ముందుకు వెళ్ళండి, ఎడమ వైపు కాలువ దాటటానికి ఒక తాడు వంతెన వుంటుంది. అది దాటి ఒక ఫర్లాంగు వెళ్తే ఇళ్ళు వుంటాయి, అక్కడ అడగండి” అన్నాడు.
“అతని తల్లి మా యజమాని తోటలోనే పని చేస్తుంది. నేను చెప్తాను, మీరు వెళ్ళండి” అని మమ్మల్ని పంపించాడు. మేము రెండు అడుగులు వెయ్యగానే, అతను ఎవరినో పిలిచి మా సమాచారం ఇవ్వడం వినిపించింది. అతను చెప్పిన దారిలోనే ముందుకు నడుస్తున్న మాకు, కొడుకు చనిపోయాడని తెలిసి కూడా తల్లి పనికి పోవడం విచిత్రంగా అనిపించింది. అలాగే మేమిద్దరం మాట్లాడుకుంటూ విక్రమ్ యింటికి (గుడిసె)చేరుకున్నాం. అక్కడి వాతావరణం కూడా ఏమీ జరగలేదు అన్నట్లే వుంది.
అదొక చిన్న గుడిసె. 200 చదరపు అడుగులు వుండచ్చు, అంటే ఒకరకంగా తలుపులు లేని ఒక చూరు అంతే.. ఇంట్లో ఎవరూ కనపడకపోవడంతో పేడతో అలికి శుభ్రంగా వున్న మెట్ల మీద విశ్రాంతిగా కూర్చున్నాం. వెనుక నుంచి ఏం కావాలి అని ఒక మహిళ అడగటం వినిపించి తిరిగి చూస్తే చంకలో బిడ్డనెత్తుకున్న చిన్న వయసు గల ఒకామె కనపడింది. ఆమె విక్రమ్ చిన్న తమ్ముడి భార్య అని తరవాత తెలిసింది. అయితే ఆమె ముఖంలో కూడా ఏ విషాదమూ కనిపించలేదు. ఇది విక్రమ్ గౌడ ఇల్లేనా అని మళ్ళీ అనుమానం వచ్చి అడిగాం. అవును అన్నది. ఇదేంటి ఇలా అని ఒక వైపు గజిబిజి, మరోవైపు విక్రమ్ ఇంటికే వచ్చామా అనే సందేహం…. పక్కింటి వాళ్ళు మమ్మల్నే కుతూహలంగా చూడటం గమనించి ఒకరిని పిలిచి అడిగితే మేం రావాల్సిన యిల్లు ఇదే అని ఖరారైంది. అతను “వాళ్ళకి యింకా విషయం తెలియదు” అని గుసగుసగా చెప్పాడు.
ఇంతలో విక్రమ్ అమ్మ వచ్చింది. “ఎందుకు వచ్చారు? ఏంటీ విషయం” అని అడిగేసరికి నాకు నోట మాట రాలేదు. “ఏం లేదమ్మా, మీ అబ్బాయి గురించి మాట్లాడదామని వచ్చాను” అన్నాను. రికార్డు చేయడానికి కెమెరా రెడీగా వుంది. “కొడుకు నక్సలైట్ ఎలా అయాడు? అడవిలోకి ఎప్పుడు వెళ్ళాడు?” ఇలా అనేక విషయాలు అడిగాను. కన్నీరు కారుస్తూ ఒక్కొక్క గాథను చెబుతూ “రోజూ పోలీసులు వచ్చి కొట్టడం తిట్టడం వల్లనే నా కొడుకు అడవికి వెళ్ళాడు” అని అన్నప్పుడు ఈ వ్యవస్థ పట్ల వున్న అసహనం ఆ తల్లి ముఖంలో దాగలేదు.
అటవీ ఉత్పత్తులను సేకరించి జీవిస్తున్న విక్రమ్ ఇంటి వెనుక వున్న దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి ఉత్పత్తులను సేకరించి అటవీ శాఖ ద్వారానే అమ్ముతూండేవాడు.
కానీ సాకేత్ రాజన్ కోసం పోలీసులు తీవ్ర వేట సాగిస్తున్న సందర్భంలో పోలీసులకు ఇతనిపట్ల అనుమానం వుండింది. కొండల పైకి వెళ్తున్న యితను నక్సలైట్ల సంపర్కంలో వున్నాడు అని అనుమానించారు. (అనుమానం నిజమా, అబద్ధమా అనేది వేరే విషయం) అందువల్లనే ఒకటి రెండు సార్లు విక్రమ్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు.
తనకేమి తెలియదు అని చెప్పిన విక్రమ్ తన జీవనోపాధి అయిన అటవీ ఉత్పత్తుల సేకరణను కొనసాగించాడు. కూంబింగ్ కార్యకలాపాలు మొదలయ్యాక ఒకరోజు పోలీసులు విక్రమ్‌ను తీసుకువెళ్ళి ‘మంచిగా’ దర్యాఫ్తు చేశారు. ఆ దర్యాఫ్తు నుంచి తేరుకొని మామూలు మనిషి అవడానికి విక్రమ్‌కి కొన్ని వారాలు పట్టింది. మళ్ళీ ఇంటికి వచ్చిన పోలీసులు ఇంట్లోనూ దర్యాఫ్తు చేసి, వెంట తీసుకువెళ్లారు. అదే పోలీసులు జరిపిన చివరి విచారణ.
పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన విక్రమ్ రాత్రికి రాత్రే ఇంటి నుంచి బయటికి వచ్చి వెనక వున్న కొండపైకి వెళ్ళాడు. ఇదీ విక్రమ్ తల్లి మాకు చెప్పిన గాథ.
ఇదంతా చెప్పిన తల్లికి మీ కొడుకు పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు అనే నిజం ఎలా చెప్పాలి అని చాలా యిబ్బందిగా అనిపించింది. పక్క గుడిసెలో వుండే వాళ్ళ బంధువు మీరే ఆ విషయం చెప్పండి అన్నది. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూండగానే మరో జర్నలిస్టుల బృందం అక్కడికి వచ్చింది. వాళ్ళకీ యింటి పరిస్థితి చూసి అయోమయం. నన్ను అడిగితే వారికి యింకా విషయం తెలియదు అని చెప్పాను.
అంతలో ఆ తల్లికి అనుమానం వచ్చి “మీరు ఇంతమంది వచ్చారు అంటే నా కొడుకుకి ఏమైనా అయి వుండచ్చు, ఏమైంది” అని అడిగేసింది. ఒక సీనియర్ జర్నలిస్టు నెమ్మదిగా “ చిక్కమగళూరు అడవి ప్రాంతంలో పోలీసులు మీ కొడుకును కాల్పుల్లో చంపేశారు అన్న వార్త విని వచ్చాము” అని చెప్పారు.
ఆ మాట వినగానే పెద్ద పిడుగు పడినట్లయిన ఆ తల్లి రోదన అరణ్యమంతటా ప్రతిధ్వనించింది. ఆ తరవాత ఆమెను సాంత్వన పరిచి, విక్రమ్ గురించి మరి కొన్ని వివరాలు తెలుసుకొని బయలుదేరాం.
కబ్బినాలె అడవి నుంచి హెబ్రికి వచ్చి విక్రమ్ మృతదేహం ఎక్కడికి వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. అంతలో పోలీసు శాఖ నుంచి వచ్చిన సమాచారం మమ్మల్నే కదిలించేసింది. వారి సమాచారాన్ని నమ్మి సజీవంగా వున్న కొడుకుని చనిపోయాడని చెప్పి ఆ తల్లిని కన్నీరు పెట్టించాం కదా అనే పశ్చాత్తాపం వెంటాడింది.
ఆ రోజు పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది కుత్లూరుకి చెందిన దినకర గౌడ అనే అతను.
ఆ రోజు అబద్ధమయిన ఘటన ఈ రోజు వాస్తవమైంది. తన ఊరి పక్కనే విక్రమ్ మరణించాడు. అతని తల్లి ప్రకారం అతని ఈ స్థితికి ఈ వ్యవస్థనే కారణం. ఆనాడు దర్యాఫ్తు పేరుతో జరిపిన హింస తల్లి కొడుకులను వేరు చేసింది.

(తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి)

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad