ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో కార్పొరేటీకరణ, సైనికీకరణలను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఆదివాసీల బస్తర్ ఆధారిత మూల్వాసీ బచావో మంచ్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
నవంబర్ 18న మానవ హక్కుల కార్యకర్తల దృష్టికి వచ్చిన ఈ నిషేధ నోటిఫికేషన్, ఛత్తీస్గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ (సిఎస్పిఎస్ఎ), 2005లోని సెక్షన్ 3 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం మూల్వాసీ బచావో మంచ్ను ఒక సంవత్సరం కాలంపాటు చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది. అక్టోబర్ 30, 2024 నుండి నిషేధం అమలులోకి వచ్చింది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను, ఆ అభివృద్ధి పనులను సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన భద్రతా దళ శిబిరాల ఏర్పాటును మూల్వాసీ బచావో మంచ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. వాటికి వ్యతిరేకంగా ప్రజలను ఆ సంస్థ రెచ్చగొట్టింది అనేది ప్రభుత్వ ఆరోపణ.
అంతేకాకుండా, ఈ సంస్థ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని; పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తోందని ప్రభుత్వం ఆరోపించింది.
పెసా చట్టం, 1996 నియమాలను ఉల్లంఘించి, గ్రామసభ సమ్మతి లేకుండా 2021లో సిలంగేర్లో పోలీసు క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించడం ద్వారా మూల్వాసీ బచావో మంచ్ ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. 2021 మే 17నాడు సిఆర్పిఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో గర్భిణీ స్త్రీతో సహా నలుగురు ఆదివాసీ గ్రామస్తులు మరణించిన తరువాత ఉద్యమం తీవ్రతరమైంది.
బస్తర్పై సైన్యం వైమానిక బాంబు దాడి చేసిన సందర్భంగా ఈ సంస్థ నిరసన తెలియచేసింది. వైమానిక దాడులు ఐదుసార్లు జరిగాయి. పోలీసుల అకృత్యాలు, బూటకపు ఎన్కౌంటర్లలో శిశువులతో సహా పిల్లలు, ఆదివాసీల హత్యలు, అత్యాచారాలు, అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, ముఖ్యంగా 2024 జనవరి 1 నుంచి ఆదివాసీలపై హింస పెరగడానికి వ్యతిరేకంగా జరిపిన నిరసనలతో మూల వాసీ బచావో మంచ్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
మూల వాసీ బచావో మంచ్ అధ్యక్షుడు గోండ్ ఆదివాసీ అయిన ఇరవై మూడేళ్ళ రఘు మిడియంకు ఈ జర్నలిస్టు ఫోన్ చేయగా, ఈ ఫోన్ రావడానికి కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే నిషేధం గురించి తనకు వాట్సాప్ సందేశాల ద్వారా తెలిసిందన్నారు.
నిషేధంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘు, “మా వనరులను, భూమిని దోచుకోవాలనుకునే సంస్థలకు అనుకూలంగానే తమపై నిషేధం విధించారు. మేము ఈ నిషేధాన్ని రాజ్యాంగపరమైన, ప్రజాస్వామ్య మార్గాల ద్వారా సవాలు చేయబోతున్నాము. ఇతర సభ్యులతో చర్చించిన తర్వాత చేపట్టబోయే చర్యల గురించి నిర్ణయిస్తాం.'' అని తెలిపారు. 2021లో మూల వాసీ బచావో మంచ్ లో చేరిన రఘు, తమ సంస్థ గురించి మాట్లాడుతూ, “మూల్వాసీ బచావో మంచ్ బస్తర్లో యువత నేతృత్వంలోని ఆదివాసీల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక ప్రజాస్వామిక సంస్థ. ఇంతకుముందు పోలీసులు ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినప్పుడు, మా కోసం నిరసన తెలిపే చాలా సంస్థలు నగరాల్లోనే ఉన్నాయి. గ్రామాల్లో ఏ సంస్థ కూడా పనిచేయలేదు. అందుకే బస్తర్లో మూల్వాసీ బచావో మంచ్ ఏర్పడింది.'' అన్నారు.
మూల్వాసీ బచావో మంచ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నదనే ఆరోపణలను తోసిపుచ్చిన రఘు, “మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అంగన్వాడీలు, పాఠశాలలు, ఆదివాసీలకు ఆరోగ్య సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అడవులు, నీరు, భూమి, వనరులను కాపాడుకోవడానికి మేము పోరాడుతున్నాం. వాటిని కార్పొరేట్లకు అమ్ముతున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, అపనిందలు వేస్తున్నారు, మావోయిస్టులుగా వేస్తున్నారు” అని వివరించారు.
బిజెపి, రాష్ట్ర ప్రభుత్వ శక్తులు గతంలో కంటే రెట్టింపు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని రఘు ఆరోపించారు.
“గ్రామస్తులు నిరంతరం భయంతో బతుకుతున్నారు. తమ గ్రామంలో తిరగడానికి కూడా భయపడుతున్నారు. నిరంతరం కాల్పులు, ఆదివాసీల హత్యలు, వైమానిక బాంబు దాడులు కూడా జరిగాయి. అల్లర్లు, దహనంలాంటి తప్పుడు ఆరోపణలపైన క్రూరమైన చట్టాల కింద అమాయక ఆదివాసీ గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
“700–800 మంది ఆదివాసీలు జైలులో ఉన్నారు. ఇప్పటి వరకు అనేక మంది కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేశారు. ఈ ఒక్క ఏడాదిలోనే అమాయక ఆదివాసీ రైతులతో సహా దాదాపు 300 మంది చనిపోయారు.''
“మానవ హక్కుల కార్యకర్తలతో సహా బస్తర్లో ఈ సమస్యలను వెలికి తెస్తున్న వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు. గత రెండు రోజుల్లో దాదాపు 10 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నారు.” అని రఘు తెలిపారు.
”25 ఏళ్ల ఆదివాసీ మహిళ, మూల్వాసీ బచావో మంచ్ ఉపాధ్యక్షురాలు సునీతా పొట్టమ్ను జూన్ 3న రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ మేరీ లాలర్ ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా, సునీతా పొట్టమ్ సీపీఐ (మావోయిస్ట్) పట్టణ నెట్వర్క్లో కీలక లింక్ అని ఛత్తీస్గఢ్ పోలీసులు ఆరోపించారు.
ఏప్రిల్ 2న, ఉపా, ఛత్తీస్ఘడ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద సంస్థలోని మరొక సభ్యుడు సుర్జు టేకమ్ను పోలీసులు అరెస్టు చేశారు.
నవంబర్ 8న, మూల్వాసీ బచావో మంచ్కి చెందిన ఆరుగురు సభ్యులను-అర్జున్ సోని, ముయా హేమ్లా, నగేష్ బన్సే, జోగ మిడియం, గిల్లు కాటం, భీమా కుంజం లను జైలుకు పంపారు.
బస్తర్లో ప్రజాస్వామ్య స్థితిని విమర్శిస్తూ, “ఇక్కడ రాజ్యాంగం పట్టింపు లేదు, ప్రతిచోటా అన్యాయం ఉంది. బస్తర్లో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అసమ్మతిని అణచివేయడానికి వారు బాంబులు, తుపాకులను ఉపయోగిస్తున్నారు.
తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యూస్ ఛానళ్లు తన ఫోటోను చూపిస్తూ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాయని రఘు ఆరోపించారు.
ఇటీవలే సెప్టెంబర్ 17న సంజయ్, సుక్క, నగేష్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తారేమోమన్న భయాన్ని వ్యక్తం చేశాడు.
అంతే కాదు, “నన్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేస్తారేమోననే భయం ఉంది. నన్ను చంపడానికి రాజ్యం చురుకుగా కుట్ర పన్నుతోంది. వారు నన్ను ఒంటరిగా పట్టుకుంటే చంపేస్తారు; నిరసనల్లో పాల్గొంటే నిర్బంధించి చంపేస్తారు. లేదా ఏదైనా పట్టణంలో దొరికినా చంపేస్తారు” అన్నారు రఘు.
నిషేధం నేపథ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలపై ప్రభుత్వ వైఖరిపై మానవ హక్కుల సంస్థలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్థ నిషేధాన్ని విమర్శిస్తూ, ఛత్తీస్గఢ్, పియుసిఎల్కు సంబంధించిన కార్యకర్త రించిన్ మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను ఖండించాలి. భద్రతా బలగాల మితిమీరిన చర్యలకు వ్యతిరేకంగా ప్రజల గొంతుకగా మూల్వాసీ బచావో మంచ్ నిలిచింది. ఈ సంస్థను నిషేధించడం ప్రజాస్వామిక నిరసనలు, గళాలను అణిచివేసేందుకు, ప్రజాస్వామిక అవకాశాలను పరిమితం చేసే మరొక చర్య.
“చాలా కాలంగా వారు మంచ్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నిరంతరం దాని యువ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. నక్సలిజాన్ని అంతం చేయాలనే పేరుతో ఆదివాసీలపై మారణకాండ సాగిస్తున్న ప్రభుత్వం శాంతియుత నిరసనను అణచివేయాలని కోరుతోంది” అన్నారు.
గాంధేయ కార్యకర్త హిమాంశు కుమార్ కూడా మూల్వాసీ బచావో మంచ్ పై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు.
"భూమి, అడవి, నీటి సంరక్షణ కోసం ప్రజాస్వామిక పద్ధతుల్లో మాత్రమే పని చేస్తున్న ఈ సంస్థలో చాలా మంది ఆదివాసీలు భాగమయ్యారు. వారిని ప్రజా స్వామ్యానికి ముప్పు అని ఆరోపించడం ఆదివాసీ ప్రాంతాలలో మిగిలి ఉన్న ప్రజాస్వామిక అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.”
ఉద్యమకారులపై రాజ్యహింసపై హిమాంశు మాట్లాడుతూ, “ఛత్తీస్గఢ్లో ఆదివాసీ అనుకూల మానవ హక్కుల కార్యకర్తలను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. పోలీసు ఆఫీసర్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెల, నారాయణపూర్ ఎస్పీగా పనిచేసినప్పుడు మానవ హక్కుల కార్యకర్తలను వాహనాలతో తోక్కించాలని బహిరంగంగా ప్రకటించాడు. ఇది సవాలుతో కూడుకున్న పరిస్థితి, అయితే బస్తర్ ప్రజలు, కార్యకర్తలు కలిసి ఈ దురాగతాలను బయటపెడతారని, కార్పొరేట్, పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటారని మేము ఆశిస్తున్నాము” అన్నారు.
సాయుధ మావోయిస్టులైనా లేదా నిరాయుధ ఆదివాసీ రైతులు ప్రజా ఉద్యమాల ద్వారా సంఘటితమవుతున్నా కార్పొరేట్ దోపిడీకి అలాంటి అన్ని అడ్డంకులను తొలగించడమే ప్రభుత్వ ఉద్దేశ మని ఆదివాసీ ప్రాంతాలలో ప్రభుత్వ-కార్పొరేట్ హింసను వ్యతిరేకించే, ఢిల్లీకి చెందిన ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక) పేర్కొంది.
వేదిక సభ్యుడు, న్యాయవాది ఎహ్త్మామ్-ఉల్-హక్ ఈ విలేఖరితో మాట్లాడుతూ, “మూల్వాసీ బచావో మంచ్ పై నిషేధం ఛత్తీస్గఢ్లోని విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వ ఫాసిస్ట్ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.” అన్నారు.
సల్వా జుడుం, ఆపరేషన్ గ్రీన్ హంట్లు జరిపిన మారణకాండ సమయంలో మూల్వాసీ బచావో మంచ్ కార్యకర్తలు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఈ యువకులు ఆదివాసీ సంస్కృతి, గుర్తింపు, ఉనికిని కాపాడుకోవడానికి జల్-జంగిల్-జమీన్ను రక్షించుకోడానికి వున్న ప్రాముఖ్యతను కూడా గుర్తించారు. హింసాకాండ బెదిరింపులతో సాగుతున్న కార్పొరేట్ దోపిడీని నిరోధించేందుకు ఆదివాసీ రైతులను సంఘటితం చేయడం వల్ల వారిపై అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్ర వేసారు అని మండిపడ్డారు.
నిషేధించడానికి రాజ్యం చేసిన వాదనలను విమర్శిస్తూ, “అభివృద్ధిని తీసుకురావడానికి ఉద్దేశించిన పారామిలటరీ శిబిరాలను వ్యతిరేకించడం వల్ల మూల్వాసీ బచావో మంచ్ అభివృద్ధి నిరోధక సంస్థ అనే వాదన చాలా లోపభూయిష్టమైనది. కుటిలమైనది. మైనింగ్ కార్యకలాపాల ద్వారా అభివృద్ధి అని పిలవబడేది ఆదివాసీ రైతుల నిర్వాసిత్వం, నదీ కాలుష్యం, బంజరు వ్యవసాయ భూములు, ఆదివాసీ సంస్కృతి, జీవన విధానానికి, అస్తిత్వ ముప్పుకు దారి తీస్తుంది అని ఎహ్త్మామ్ అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి నమూనాను ఖండిస్తూ, “ఈ అభివృద్ధి అని పిలవబడేది నిర్వాసిత్వం, విధ్వంసాలను కలిగించడమే కాకుండా, ఇప్పుడు అడవులు, గ్రామాల గుండా విశాలమైన రోడ్లు ఉన్నప్పటికీ, గ్రామాలకు, చిన్న పట్టణాలకు ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో విఫలమైంది. ”
”వరుసగా వచ్చిన ప్రభుత్వాలు వాగ్దానం చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి ఈ ప్రాంతాలు వెనుకబడిపోవడానికి రోడ్ల కొరతే కారణం కాదా? అయినప్పటికీ, గత ఐదు సంవత్సరాలుగా, ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ, బస్తర్లో అభివృద్ది కోసం రహదారి నెట్వర్క్ లను అభివృద్ధి చేస్తున్నామనే ముసుగులో పారామిలటరీ క్యాంపులను దూకుడుగా నిర్మించారు.” అన్నారు.
వైమానిక బాంబు దాడులపై నిజనిర్ధారణ పరిశోధనల కోసం బస్తర్కు వెళ్ళిన ఎహ్త్మామ్, “ఈ రహదారులు ప్రధానంగా ప్రభుత్వ దళాలకు, మైనింగ్ ఖనిజాలను రవాణా చేసే ట్రక్కులకు మార్గాలుగా పనిచేస్తాయి” అన్నాడు.
నిరాయుధ ప్రజాస్వామ్య సంస్థలపై నిషేధం విధించిన ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడాన్ని గురించి ఆలోచిస్తుందని ఎలా అనుకోవాలి అని ఆయన ప్రశ్నించారు.
మూలవాసి బచావో మంచ్పై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయాలని, అరెస్టయిన సభ్యులందరినీ విడుదల చేయాలని, వారి డిమాండ్లను పరిష్కరించేందుకు సంస్థతో చర్చలు జరపాలని వేదిక డిమాండ్ చేసింది.
(countercurrents.org నుంచి)
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి