Menu

హోటల్ వర్కర్ నుండి విప్లవోద్య‌మ నాయకుడిగా విక్రమ్ గౌడ ప్రస్థానం

anadmin 7 months ago 0 402

నిన్న కర్నాటకలో పోలీసులు కాల్చి చంపిన మావోయిస్టు నాయకుడు విక్రమ్ గౌడ ఉడిపి జిల్లా హెబ్రీ తాలూకా నడ్‌పాల్ గ్రామపంచాయతీలోని కూడ్లు గ్రామంలో 44 ఏళ్ళ క్రితం ఒక నిరు పేద రైతు కుటుంబంలో పుట్టాడు.పేదరికంలోనే పెరిగాడు. హైస్కూలు కూడా పూర్తి చేయకుండానే తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చిన్న వయసులోనే హోటల్ లో కార్మికుడుగా మారాడు.

విక్రమ్ గౌడ తన నిరుపేద కుటుంబాన్ని పోషించుకోవడానికి హెబ్రీలోని ఒక హోటల్‌లో పనిచేశాడు. ఆ సమయంలోనే ఆయన కార్మిక సంఘం కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. అప్పటికే అక్కడ ఉదృతంగా సాగుతున్న ప్రజా ఉద్యమాలతో, వాటికి నాయకత్వం వహిస్తున్న సీపీఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ పార్టీ రాజకీయాలతో ఉత్తేజితుడయ్యాడు. క్రమంగా విక్రమ్ గౌడ్ తన చుట్టూ ఉన్న ఆదివాసీల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయో గమనించాడు. వారి హక్కులను కాలరాస్తున్న పాలకుల కుట్రలను గ్రహించాడు. ఆ క్రమంలో ఆయన ఆదివాసుల హక్కుల కోసం కూడా పని చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో కుద్రేముఖ్ నేషనల్ పార్క్‌కు వ్యతిరేకంగా తిరగబడ్డ ఆదివాసీలకు విక్రమ్ గౌడ్ నాయకత్వం వహించాడు. అదే క్రమంలో ఆయన తీవ్రమైన పోలీసు నిర్భందాన్ని ఎదుర్కొన్నాడు. కబ్బినలే, నడ్‌పాలు, ముట్లుపడి వంటి ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు తీవ్రతరమైన నేపథ్యంలో విక్రమగౌడ కోసం పోలీసులు తీవ్రంగా గాలించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన‌ ఆయన అఙాతంలోకి వెళ్ళి అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాడు. అదే సమయంలో పోలీసులు విక్రమ గౌడ ఇంటిపై తరచూ దాడులు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఆయన తల్లి గులాబీ గౌడను, సోదరుడు సురేష్ గౌడని అనేక రకాలుగా వేధించారు. అది భరించలేని విక్రమగౌడ సోదరుడు ముద్రాడికి మకాం మార్చాడు, అక్కడ అతను తన భార్య , పిల్లలను పోషించడానికి రోజువారీ కూలీ పని చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం విక్రమ గౌడ తల్లి గులాబీ గౌడ మరణించారు.

ఈ నేపథ్యంలో విక్రమ గౌడ నేత్రావతి దళ నాయకుడుగా బాధ్యతలు చేపట్టి వేలాదిగా ప్రజలను ఉద్యమపథం వైపు నడిపించాడు. కర్నాటకలో ఉద్యమానికి నాయకత్వం వహించిన కామ్రేడ్ బి జి కృష్ణమూర్తి 2011 లో అరెస్టు తర్వాత ఆ బాధ్యతలను విక్రమగౌడ తీసుకొని పోరాటాన్ని కొనసాగించాడు. 20 ఏళ్ళుగా విక్రమగౌడను చంంపడానికి పోలీసులు చేసిన అనేక ప్రయత్నాలను ఆయన వమ్ము చేశాడు. 2016లో పోలీసులు దాడి చేస్తే కారంపొడి ఉపయోగించి కేరళ పోలీసుల నుంచి తప్పించుకున్న వైనాన్ని అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రభుత్వం చేపట్టిన నక్సలైట్ల లొంగుబాటు కార్య‌క్రమాన్ని విక్రమగౌడ తీవ్రంగా వ్యతిరేకించడమేకాకుండా ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా బెంగుళూరు సహా కర్నాటకలోని అనేక చోట్ల ప్రచారాన్ని నిర్వహించాడు.

ప్రభుత్వం కర్నాటక అడవుల్లో పెద్ద ఎత్తున సైనికబలగాలను దింపి మావోయిస్టులను నిర్మూలించే ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమగౌడ అటు కేరళనుండి ఇటు కర్నాటక‌ వరకు కార్యకలాపాలను కొనసాగించాడు. కర్నాటకలో మళ్ళీ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్న క్రమంలో నవంబర్ 18వ తేదీ అర్దరాత్రి ఉడిపి జిల్లా హెబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబ్బినలే అటవీ ప్రాంతంలో తన 44 ఏళ్ళ వయసులో అమరుడయ్యాడు. ఇక పోలీసులు వినిపిస్తున్న విక్రమ్ ఎన్ కౌంటర్ కథలోని నిజానిజాలు తేలాల్సిఉన్నది.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

– Advertisement – BuzzMag Ad