కర్ణాటకలోని ఉడిపి జిల్లా హెబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబ్బినలే అటవీ ప్రాంతంలో నవంబర్ 18 సోమవారం రాత్రి పోలీసులు విక్రమ్ గౌడ అనే మావోయిస్టు నాయకుడిని కాల్చి చంపారు. ఇది ఎన్ కౌంటర్ అని మరో ఐదుగురు నక్సలైట్లు తప్పించుకున్నారనే కథను ఎప్పటిలాగే పోలీసులు వినిపిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం… విక్రమ్ గౌడ్ సోమవారం రాత్రి తన సహచరులతో కలిసి కిరాణా సామాను తీసుకునేందుకు కబ్బినలే గ్రామానికి వెళ్ళాడు. తమకొచ్చిన సమాచారం ఆధారంగా, ANF అతనిపై దాడి చేసింది. నక్సల్స్ కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు విక్రమ్ గౌడ్ మృతి చెందాడు. అతనితో వచ్చిన మిగతా వారు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయారు.
మావోయిస్టు నాయకుడు విక్రమ గౌడ కోసం 20 ఏళ్ళుగా గాలిస్తున్నట్టు కర్నాటక హోం మంత్రి జి. పరమేశ్వర అన్నారు. గతంలో జరిగిన అనేక ఎన్కౌంటర్లలో విక్రమగౌడ తప్పించుకున్నాడని హోం మంత్రి చెప్పారు.
కర్ణాటకలో రెండు దశాబ్దాల తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ ఇది. 2003 నవంబర్ 17వ తేదీన ఉడిపి జిల్లా కర్కాలలోని ఈడు సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో సుమతి, 24, ఉష, 23, అనే ఇద్దరు మహిళా నక్సలైట్లు మరణించారు.