హత్యలు, రేపులు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా లాంటి వాళ్ళకు వేల కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళకు అవసరమున్నప్పుడల్లా పెరోల్ ఇచ్చి బైటికి పంపించే కోర్టులు. ప్రజల హక్కుల కోసం గొంతెత్తే వారికి మాత్రం శిక్ష పడకపోయినా, ఇంకా కేసు నడుస్తున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడం లేదు. ఇప్పుడలాగే జగిత్యాలకు చెందిన పౌరహక్కుల కార్యకర్త పోగుల రాజేశం కు కన్న కూతురు అంత్యక్రియలకు కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు.
జగిత్యాలకు చెందిన పౌరహక్కుల సంఘం నాయకుడు పోగుల రాజేశం తన కూతురు అంత్యక్రియలకు హాజరవడానికి చత్తీస్ గడ్ కోర్టు అంగీకరించలేదు. వరకట్న దాహంతో భర్త, అత్త, మామల చేతిలో గత శుక్రవారం హత్యకు గురైన పోగుల లత అంత్య క్రియల్లో పాల్గొనడానికి పోగుల రాజేశం పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఎన్ ఐ ఏ కోర్టు తిరస్కరించింది. బిడ్డను కడసారి చూసుకోవాలన్న రాజేశం ఆశను కోర్టు అడియాస చేసింది. ఆయన బెయిల్ కోసం జగదల్పూర్ వెళ్ళిన ఆయన భార్య పోగుల మల్లేశ్వరి, పౌరహక్కుల సంఘం నాయకుడు కుమారస్వామి,తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి లు తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, మావోయిస్టులతో సంబంధాలన్నాయన్న నెపంపై పోగుల రాజేశంను ఎన్ ఐ ఏ పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన జగదల్పూర్ జైల్లో ఉన్నారు. మరో వైపు నిర్మల్ లో నివాసముండే ఆయన కూతురు లతను వరకట్నం తీసుకరావాలని వత్తిడి చేసిన ఆమె భర్త, అత్త, మామలు లతను దుర్మార్గంగా హత్య చేశారు.
ఆమె అంత్యక్రియలకు రాజేశం కు కోర్టు బెయిల్ ఇస్తుందనే ఆశతో బంధువులు లత భౌతిక కాయాన్ని ఫ్రీజర్ లో భద్ర పరిచారు. ఇప్పుడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయకపోవడంతో లత అంత్యక్రియలు మంగళవారం ఉదయం 9-30 గంటలకు రేచపల్లి లో కన్న తండ్రి లేకుండానే జరగనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
కాగా లత హత్య కేసు విషయంలో పోలీసుల దర్యాప్తు కూడా సరిగా లేనందున రీ – పోస్ట్ మార్టం జరపాలని బంధువ్ మిత్రులు, పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. అందుకు అనుగుణంగా లత భౌతిక కాయాన్ని దహనం చేయకుండా ఖననం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.