27-10-2024,
ఆదివారం,
ఉదయం 10 గంటలకు
సభాస్థలం:
వాల్మీకి భవన్,
నల్లకుంట,
గద్వాల్
గద్వాలలో ఎల్ ఐ సీ రామిరెడ్డి పెద్ద కూతురు సుగుణ 80 వ దశకం లో, సమాజంలో పేదరికం, కులం, నిరుద్యోగం, వరకట్నం ఇలా ఎన్నో సమస్యలు పరిష్కారం కావాలంటే సమాజంలో మౌలిక మార్పు జరగాలని, సాయుధ పోరాటమే దానికి మార్గమని ఆ మార్గం లో 28 సంవత్సరాలు అప్పుటి పీపుల్స్ వార్ నేటి మావోయిస్టు ఉద్యమంలో పనిచేసింది.
మొదటి మహిళా దళ కమాండర్ గా మహిళల సమస్యలను ప్రత్యేక దృష్టితో చూసింది. మహిళలకు కూడా పురుషులతో పాటు మిలటరీ డ్రెస్ ఉండాలని, ఈ రంగంలో మహిళల ను కూడా భాగస్వాములు చేయాలని, మహిళల శారీరక మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని, స్థాయి విషయంలో వీరికి రిజర్వేషన్ ఉండాలని ప్రతిపాదించి వాటిని అమలు అయ్యేటట్లు చేసిన వారిలో మొదటి తరం మహిళా కామ్రేడ్ సుగుణ (అరుణ, రాధ, లత) అని ఈ తరంవారికి చెప్పవచ్చు.
అచ్చంపేట దగ్గర ఉన్న నల్లమల్ల అడవిలో చెంచులతో పనిచేసేటప్పుడు వారితో బాగా కలిసిపోయి వారి జీవన విధానాన్ని సంస్కృతిని పరిశోధించి, రచనలు చేసింది. మెదక్ జిల్లాలో అప్పటి ఇన్ ఫార్మర్ వ్యవస్థను ఎదుర్కొని ఎన్నో ఎన్కౌంటర్లను తప్పించుకొని మేధావి వర్గాన్ని కలుస్తూ తన ప్రభావం వేసింది.. ఆంధ్రలోని పలనాడులో ఎన్నో కరువు దాడులలో పాల్గొని ఆకలిచావుల నివారణ కొరకు యాక్షన్ టీమ్ లీడర్ గా ఉంటూ తన వంతు కృషి చేసింది. ఇలా తెలంగాణ నుంచి ఆంధ్ర వరకు తన 28 ఏళ్ల ఉద్యమంలో పీడిత, శ్రామిక ప్రజల కొరకు పనిచేసింది.
ఉద్యమంలో నాయకత్వ స్థానంలో ఉన్న వారిని మట్టుపెట్టాలని రాజ్యం ఏర్పరిచిన ఇన్ ఫార్మర్ వ్యవస్థ ద్వారా కళ్ళు బాగా లేక ఆసుపత్రికి వచ్చిన క్రమంలో ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో సుగుణను, ఆమె సహచరుడు కౌముదిని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేసింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
ఆమె ప్రతి వర్ధంతిని అప్పటి సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవడానికి సభలు పెడుతున్నాం. ఈ 21 వ వర్ధంతి సభ ను “వికారాబాద్ లో “దామగుండం రాడార్ స్టేషన్” వ్యతిరేకిస్తూ, అడవి ఆదివాసీలకు మద్దతు పలికిన సాయిబాబా స్మరించుకుందాం “అని పిలుపునిస్తూ జరుపుతున్నాము.
2024 అక్టోబర్ 15 న తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా లో దామగుండం ఫారెస్ట్ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభోత్సవం చేయడం అప్రజాస్వామికం.. దామగుండం ఫారెస్ట్ విభిన్న వృక్ష జంతు జాలాలతో ఉన్న ఒక ముఖ్యమైన పర్యావరణ జోన్.. ఈ అడవి ఉండడం వలన హైదరాబాద్ కు మంచి ఆక్సిజన్ తో పాటు వరద నివారణ జోన్ గా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు కొరకు 899 చెట్లను మాత్రమే నరికి వేస్తామని నేవీ అధికారులు చెప్పగా, 1,93,562 చెట్లను తీసేయాల్సి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ 12 లక్షలు చెట్లు తొలగించాల్సి వస్తుంది. ఇవి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. వీటి తొలగింపు వల్ల జీవవైవిద్యం దెబ్బతిని పర్యావరణ సమతుల్యత అదుపు తప్పుతుంది.
రిజర్వ్ ఫారెస్ట్ లో 2900 ఎకరాల ను అటవీ అధికారులు జనవరి 24న సీఎం సమక్షంలో నావికా దళానికి అప్పగించారు. ఇందులో 350 ఎకరాల లో సుమారు 3000 మంది నివాసం ఉండేలా ఒక టైం షిప్ నిర్మిస్తారు. అటవీ భూముల లో ప్రాజెక్టు కట్టాలంటే అడవిలోని చెట్లను నరకకుండా ఎలా సాధ్యం అవుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. మేము ఒక చెట్టును కూడా తొలగించకుండా రాడార్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పడం అవాస్తవం. ప్రభుత్వానికి ప్రజలకు పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను బహిరంగపరచాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారము ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న వారితో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఇవన్నీ ప్రభుత్వం చేయనందువలన వికారాబాద్ లో సేవ్ దామగుండం అనే ఉ ద్యమం మొదలైంది. ప్రముఖ పర్యావరణ వేత్త మేధాపాట్కర్ రెండు నెలల క్రితం సీఎంకు చెట్లను తొలగించి కట్టే ప్రాజెక్టు వద్దని ఒక లేఖ రాశారు. స్థానికులు పర్యావరణవేత్తలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి అంతా నష్టం జరుగుతుందని, ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య అని తెలియజేస్తున్నాం…
అడవులను రక్షించాలని, అడవిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ల నుండి కాపాడాలని ఆదివాసులు చేస్తున్న ఉద్యమానికి ప్రొఫెసర్ జి.యస్. సాయిబాబా మద్దతు ఇచ్చారు. 90% అంగవైకల్యం ఉన్న సాయిబాబాను మహారాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అక్రమంగా అరెస్టు చేసి పది సంవత్సరాలు అండా సెల్ లో నిర్బంధించింది. ఈ సంవత్సరం మార్చిలో సాయిబాబా నిర్దోషిగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వలన విడుదల అయ్యాడు.
జైల్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల సాయిబాబా 19 రోగాల బారిన పడ్డాడు. అందువల్ల చిన్న సర్జరీ చేసినా తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణానికి కేంద్ర ప్రభుత్వం తప్పక బాధ్యత వహించాలి.
సుగుణక్క బంధు మితృలు, గద్వాల జిల్లా