గత 60 సంవత్సరాలుగా, రాజ్యం జగ్జీత్ సింగ్ సోహల్ కోసం తీవ్రంగా వెతుకుతోంది. కానీ ఆ పేరు ఇంటెలిజెన్స్ పత్రాల్లో మాత్రమే ఉంది. పోలీసులు వెతుకుతున్న ఆ వ్యక్తి చాలా కాలం క్రితమే ఆ పేరును వదులుకుని రకరకాల పేర్లతో ప్రజా ఉద్యమాల కోసం పనిచేస్తున్నాడు. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు “శర్మా జీ”.
1970ల ప్రారంభంలో నక్సలైట్ ఉద్యమ స్థాపకుడు చారు మజుందార్ సహచరుడు, మావోయిస్ట్ పార్టీ నాయకుడు జగ్జీత్ సింగ్ సోహల్ ఇక లేరు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు పోలీసులతో దాగుడు మూతలు ఆడిన ఆయన ఆదివారం కన్నుమూశారు. 96 ఏళ్ల వయసులో ఆయన అంత్యక్రియలు పంజాబ్ లోని పాటియాలాలో జరిగాయి.
పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లాలోని షాంపూర్ గ్రామానికి చెందిన సోహల్, జాగీర్ సింగ్ జోగా, సత్పాల్ డాంగ్, హరికిషన్ సింగ్ సూర్జిత్ల సమకాలీనుడు. లాహోర్లో ప్రధాన కార్యాలయం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు.
1964లో చీలిక తరువాత, అతను సిపిఎంలో చేరి, మూడు సంవత్సరాల తరువాత, ఎమ్.ఎల్ పార్టీలో చేరాడు. చారు మజుందార్ నేతృత్వంలోని కేంద్ర కమిటీలో సభ్యుడు అయ్యాడు. మజుందార్ మరణం తరువాత, అతను 1974లో CPI (మార్క్సిస్ట్-లెనినిస్ట్) కేంద్ర ఆర్గనైజింగ్ కమిటీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అప్పటి నుండి, అతను రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు. అనంఅత్రం అతని నేతృత్వంలోని పార్టీ పీపుల్స్ వార్లో విలీనమై తరువాత CPI (మావోయిస్ట్) గా మారింది.
1967 నుండి సోహల్తో కలిసి పనిచేసిన క్రాంతికారి కిసాన్ యూనియన్ నాయకుడు గుర్మీత్ సింగ్ దిట్టుపూర్ “అతని మరణంతో, అవిభక్త పంజాబ్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ప్రస్తుతానికి మధ్య ఉన్న చివరి సంబంధాన్ని మేము కోల్పోయాము” అన్నారు.
ఈ రోజు మనం వీడ్కోలు పలుకుతున్న పోరాటాలు, జ్ఞాపకాల నిధిని మిగిల్చిన అమరుడు మనందరికీ గర్వకారణమని, ఇది రాబోయే తరాలకు ఖచ్చితంగా మార్గాన్ని చూపుతుందని ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్త బూటా సింగ్ మెహమూద్పూర్ అన్నారు. .
“శర్మ జీ చివరి శ్వాస వరకు ఉత్సాహంగా ఉన్నారు. అతను అణగారిన వారి కోసం జీవించాడు. ఏనాడూ పశ్చాత్తాపపడలేదు, ”అని అంటున్న అతని భార్య విమల్, అరవైల చివరలో చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నప్పుడు, అతనితో పాటు అజ్ఞాత జీవితానికి కూడా వెళ్ళింది. బారు సత్వర్గ్ రచించిన పంజాబీ జీవిత చరిత్ర నవల “పన్నా ఏక్ ఇతిహాస్ దా”లో సోహల్ అమర చరిత్ర లిఖితమైంది.