ఆదివాసులపై పోలీసుల నరసంహారం ఆపాలని డిమాండ్ చేస్తూ చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్లోని నారాయణపూర్, ఓర్చాలో వేలాది ఆదివాసులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా దాదాపు 40 గ్రామస్తులను నక్సలైట్లని చెప్పి పోలీసులు హత్య చేశారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయాన్ని అందచేయాలని, దోషులైన పోలీసులను శిక్షించాలి అనే డిమాండ్లతో ప్రజలు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 5500 మంది ప్రజలు 55 గ్రామాల నుంచి వచ్చారు.
ఆదివాసీలు నృత్యం చేస్తూ, జల్, జంగల్, జమీన్ మాది. వాటిపైన అధికారం మాది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకోడానికి వీల్లేదు అనే అర్దం వచ్చే పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు.
మేం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం వినకపోతే 1910లో వీర నాయకుడు గుండాధూర్ తిరుగుబాటు చేసినట్లుగా మేం కూడా విల్లు, బాణాలు తీసుకొని ఉగ్ర రూపంలో పోరాటం చేయాల్సి వస్తుంది. అప్పుడే మా హక్కులు లభిస్తాయి అని ఆదివాసులు హెచ్చరిస్తున్నారు.
తమ ఆందోళనను మరింత ఉద్ఱ్ఱ్తం చేయాలని ఆదివాసులు భావిస్తున్నారు. నారాయణపూర్ లేదా బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం దగ్గర కానీ లేక జగదల్పూర్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఆలోచిస్తున్నట్టు వాళ్ళంటున్నారు. ఇవాళ ఒకవేళ ఎవరైనా అధికారి వస్తే మా డిమాండ్ల పత్రాన్ని ఇస్తాం. వినకపోతే లేదా వాటిని అమలు చేయకపోతే … మా డిమాండ్లు పూర్తి చేయకపోతే నారాయణపూర్ కలెక్టర్ ఆఫీసును ఘెరావ్ చేయాలని అనుకుంటున్నామని వారు చెప్తున్నారు.
పోలీసు క్యాంపులు పెట్టడాన్ని ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. గనుల త్రవ్వకాల వల్ల పర్యావరణం నాశనమవుతోందని, ఆమ్దా గనులు మూసివేయాలని లేకపోతే రెండో భూమ్కాల్ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
”ఛత్తీస్ఘడ్లో ఆదివాసీ ముఖ్యమంత్రి వున్నాడు అయినా ఆదివాసీల సమస్యలు అలాగే వున్నాయి
నాలుగయిదు నెలల్లో 40-45 మందిని హత్య చేశారు. ఈ ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తుందని నమ్మకం లేదు. ముఖ్యమంత్రి ఆదివాసీలకు శత్రువు. ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నప్పటికి మా డిమాండ్లను పట్టించుకోవడం లేదు. అందుకని ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఢిల్లీ పార్లమెంట్ దాకా కూడా పోతాం” అని ఆదివాసులు అంటున్నారు.