ఏడాది తర్వాత కూడా మణిపూర్ లో శాంతి నెలకొనకపోవడం పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, సమాజంలో సంఘర్షణ మంచిది కాదని అన్నారు.
‘‘మణిపూర్ గత ఏడాది కాలంగా శాంతి కోసం ఎదురుచూస్తోంది. పదేళ్ల క్రితం మణిపూర్లో శాంతి ఉండేది. అక్కడ గన్ కల్చర్ పూర్తిగా పోయినట్లు అనిపించింది. కానీ రాష్ట్రం అకస్మాత్తుగా హింసను చవి చూసింది,” అని ఆయన అన్నారు.
“మణిపూర్లో పరిస్థితికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్నికల రాజకీయాలను అధిగమించి దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ నొక్కి చెప్పారు.
మణిపూర్లో గత ఏడాది మేలో కుకీల మీద మెయిటీలు దారుణమైన దాడులకు పాల్పడ్డారు. దాంతో కుకీలు కూడా ప్రతి దాడులు చేశారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం మెయిటీలు కుకీల్ అమీద దాడులు , హత్యాకాండ సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. పలు నిజనిర్దారణ కమిటీలుకూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. మహిళలపై హత్యాచారాలకు ఒడిగట్టారు. కుకీలను వేటాడి, వెంటాడి చంపారు. ఇళ్ళు, ఆస్తులు తగలబెట్టారు. ఏడాది గడిచినా ఇప్పటికీ మణిపూర్ లో కుకీలు భయాందోళనలతో దాక్కొని బతుకులీడుస్తున్నారు.
మరి ఈ పరిస్థితులు ఇప్పటికైనా మారాలని ఉపన్యాసాలు ఇస్తున్న ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ ఎప్పుడైనా ఆ హింసలో బీజేపీ నిర్వహించిన పాత్రను ఖండించారా ? కనీసం అంతర్గతంగానైనా తమ వాళ్ళకు ఇది తప్పని, ఇలా చేయకూడదని చెప్పారా ? ఆయన ఏం చెప్తే అది వినే ప్రభుత్వమే మణిపూర్ లో, కేంద్రంలో ఉండగా శాంతి కావాలని ఆయన ఎవరిని అడుగుతున్నట్టు ?